అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి, సబ్బండ వర్గాలను మోసం చేసినందుకు, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గారికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన బహిరంగ లేఖ.
గౌరవనీయులైన రాహుల్గాంధీ గారికి..
పదేండ్లలో ఘనంగా అభివృద్ధి చెంది, పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేండ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా ఒక్కసారి గుర్తుచేయదలచుకున్నాను. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కష్టమొచ్చినా సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా ఒక్కరేమిటి సమాజంలో అన్ని వర్గాలను నయవంచనకు గురిచేశారు. ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేశారు.
ప్రజలను హింసించే పులికేసి మాదిరిగా మీ ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి యాతనలు పెడుతుంటే మీరు ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఢిల్లీలో గప్చుప్ అయిపోయారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే మీ నయవంచక స్వరూపం ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టిన మీరు మూడు వందల రోజులు దాటినా సరే వాటిని అమలుచేయటం చేతకాక చేతులెత్తేశారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు విలవిలలాడుతోంది. అభయహస్తం అని నమ్మబలికి భస్మాసుర హస్తంతో తెలంగాణ ప్రజలను నిండా ముంచారు. ఒక్కటా, రెండా ఈ ఏడాది కాలంలో మీ పార్టీ పాలనా వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టాను మించిపోయాయి.
నమ్మించి మోసం చేయటమనే నైజం కాంగ్రెస్ పార్టీ నరనరాల్లోనే ఉంది. ఆరు గ్యారెంటీలు, అభయహస్తం అంటూ ఇక్కడి ప్రజలను మోసం చేసేందుకు ముందుగా ఢిల్లీ నుంచి వచ్చి నాంది పలికింది మీరే. ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్టు ఆ తర్వాత మీ బాటలోనే ఇక్కడి నాయకులు నడుస్తున్నారు. ‘ఆరు గ్యారెంటీల అమలు బాధ్యత నాది’ అని చెప్పిన మీరు… అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగి కూడా చూడ లేదు. 300 రోజులైనా ఒక పరిమిత ఉచిత బస్సు మినహా ఒక్క గ్యారెంటీని అమలుచేయలేని అసమర్థత మీది. రైతులకు రుణమాఫీ అని చెప్పి సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదు. కానీ, మీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో మాత్రం పూర్తి రుణమాఫీ చేసేశామంటూ సిగ్గులేకుండా అబద్ధాలను ప్రచారం చేసుకున్నారు. ఒక్క రుణమాఫీయే కాదు, రైతుబంధును ఎగ్గొట్టారు. బోనస్ను బోగస్ చేశారు. కనీసం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని దద్దమ్మల మాదిరిగా తయారయ్యారు. నమ్మి ఓట్లు వేసినందుకు ఒక్క వర్గం కాదు, తెలంగాణలోని సబ్బండ వర్గాలను మోసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న మీ తీరును సమాజం గమనిస్తున్నది.
‘అన్నివర్గాల సంక్షేమం మా బాధ్యత’
అంటూ ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ, ఇప్పుడు అన్నివర్గాల సంక్షేమాన్ని నాశనం చేసే పనిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ సాధించింది ఏంటంటే సబ్బండ వర్గాలను రోడ్డెక్కించటమే. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, అంగన్వాడీలు, పోలీసులు ఇలా అన్నివర్గాల వాళ్లు ప్రతిరోజు రోడ్లపై ధర్నాలు, నిరసనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా పోలీసులను పోలీసులతోనే కొట్టించిన ఘనత మీకే దక్కుతుంది. అన్నివర్గాల ప్రజలను మోసం చేయటమే క్షమించరాని తప్పంటే.. అది చాలదన్నట్లుగా గెలిపించిన ప్రజలను హింసిస్తున్నారు.
సాధారణంగా ప్రజల బాధలను తీర్చటం పాలకుల బాధ్యత. ప్రజలను బాధించటం ఎంత మాత్రం కాదు. కానీ, హింసించే పులికేసి మాదిరిగా మీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తయారయ్యారు. మూసీ, హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నాడు. హైడ్రా, మూసీ పేరు చెప్తేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలకు గూడు కట్టిస్తామంటూ నమ్మబలికి వాళ్ల గూడును చెదరగొట్టిన గొప్ప పాలన మీ ప్రభుత్వానిది. పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూలగొడుతుంటే వాళ్ల ఆర్తనాదాలు మీకెందుకు వినబడలేదు. తెలంగాణలో చిన్నపిల్లాడు పిలిచినా వస్తానని బీరాలు పలికిన మీరు ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారు? స్వయంగా అశోక్నగర్కు వెళ్లి ‘ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు నాది భరోసా’ అని చెప్పి వారిని మోసం చేస్తున్నందుకు సిగ్గు అనిపించటం లేదా?
దమ్ముందా రాహుల్గాంధీ గారు మీకు.. అశోక్నగర్లో నిరుద్యోగుల దగ్గరికి వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్గాంధీ గారు రైతుల దగ్గరికి వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్గాంధీ గారు విద్యార్థుల దగ్గరికి వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్గాంధీ గారు మీకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల దగ్గరికి వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్గాంధీ గారు మూసీ, హైడ్రా బాధితులను పరామర్శించేందుకు? దమ్ముందా రాహుల్గాంధీ గారు ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల దగ్గరికి వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్గాంధీ గారు ఆటో డ్రైవర్ల దగ్గరికి వెళ్లేందుకు? అసలు తెలంగాణ ప్రజల ముందుకు వచ్చే దమ్ముందా రాహుల్గాంధీ గారు మీకు?
మీ చేతగాని పాలన కారణంగా రాష్ట్రం ఆగమవుతోంది. మీ ఏడాది పాలనలోనే వందేండ్ల విధ్వంసం సృష్టించారు. ఇంకా నాలుగేండ్ల మీ చేతగాని పాలన కారణంగా తెలంగాణ ఏమైపోతుందోనని ఆవేదన కలుగుతున్నది. రైతులు, చేనేత కార్మికులు, ఆటోడ్రైవర్లు మీ పాలన మొదలు కాగానే ఆత్మహత్యలు చేసుకోవటం మొదలుపెట్టారు. ప్రతి వర్గాన్ని రోడ్డెక్కించారు. కంపెనీలు తరలిపోతున్నాయి. రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోంది. పాలన అనుభవం లేని బ్లాక్మెయిలింగ్ ముఖ్యమంత్రి కారణంగా తెలంగాణ వందేండ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో నిరసనలు కూడా చేసేందుకు వీలు లేకుండా నెలరోజుల పాటు ఆంక్షలు పెట్టే దుస్థితి మీ ప్రభుత్వానిది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ మాత్రం అంచనా వేయకుండా నేల విడిచి మీరు చేసిన సాము కారణంగా తెలంగాణ భవిష్యత్తు తలకిందులుగా మారింది. తీరా చేయాల్సిన అన్యాయమంతా చేసి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మించి హామీలు ఇస్తే ఆ రాష్ట్రం దివాళా తీస్తుందని స్వయంగా మీ పార్టీ అధ్యక్షుల వారే నొక్కి వక్కాణిస్తున్నారు. అధికారమే పరమావధిగా బొచ్చెడు హామీలు ఇచ్చిన పాపంలో మీరే ప్రధాన భాగస్వాములు. ఇప్పుడు అందుకు క్షమాపణలు చెప్తారా రాహుల్గాంధీ గారు.
దొరికిందే అవకాశమని మీ ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణను అడ్డగోలుగా దోచుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరి ట్యాక్స్ వాళ్లకు కట్టే పరిస్థితి తెచ్చారు. మీ ముఖ్యమంత్రి గారు బహిరంగంగానే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కుంభకోణాలకు రాష్ర్టాన్ని కేరాఫ్ అడ్రస్గా మార్చేశారు. ఇది చాలదన్నట్టుగా కొడితే ఏనుగు కుంభస్థలం అన్నట్టు మూసీ ప్రాజెక్టు తెరపైకి తెచ్చారు. రూ.1.50 లక్షల కోట్లతో చేపడుతామంటున్న ఈ ప్రాజెక్ట్ ఎవరి ప్రయోజనాల కోసమో? ఈ మొత్తం సొమ్ములో ఢిల్లీ వాటా ఎంత? పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు జేబులో వేసుకొనే ఈ ప్రాజెక్ట్ మీ ఆమోదం లేకుండానే జరుగుతోందా?
మీ మోసం, నయవంచన ఒక్క ప్రజలతోనే ఆగిపోలేదు. మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకుంటున్న తీరు చూస్తుంటే మీపై సానుభూతి కలుగుతోంది. పార్టీ ఫిరాయింపులు చేస్తే తక్షణమే వేటు పడేలా చట్టం అంటూ తెలంగాణలో పోజులు కొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంటే తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయారు. రాజ్యాంగాన్ని కాపాడుతానంటూ రాజ్యాంగ ప్రతులను పట్టుకొని తిరిగే మీరు తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతుంటే మౌన ముని అయిపోయారు.
అదానీ విషయంలో మీ హిపోక్రసీ చూసిన తర్వాత నవ్వాలో, ఏడ్వాలో తెలియని దుస్థితి. ఓ వైపు మోదీ, అదానీని కలిపి మోదానీ అంటారు. మరోవైపు తెలంగాణలో దోస్తానా చేస్తారు. సిగ్గు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి. మొత్తంగా ఏడాది కూడా తిరగకముందే కాంగ్రెస్ నాయకులు రోడ్లపై తిరగలేని దుస్థితి తీసుకొచ్చారు. మా తెలంగాణ ఆగమయ్యేందుకు ప్రధాన కారణం మీరే. కనుక సూటిగా మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పండి. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సబ్బండ వర్గాలను మోసం చేసిన మీరు, అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు యావత్తు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి.
ఇట్లు
కల్వకుంట్ల తారక రామారావు
భారత రాష్ట్ర సమితి వర్కింగ్
ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే