ప్రపంచ వేదికల మీద ప్రజాస్వామ్య ప్రవచనాలు వల్లించే విశ్వగురుకు సొంత దేశంలో సమస్యలు పట్టవు. మంటల్లో మలమల మాడుతున్న మణిపూర్పై ప్రధాని మోదీ పెదవి విప్పరు. పైగా అక్కడున్నది ఆయన సొంతపార్టీ సర్కారే. అంటే డబుల్ ఇంజిన్ అన్నమాట! తెగల సెగలతో అట్టుడుకుతున్న మణిపూర్ మారణ హోమంపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రధాని ముఖం చాటేయడం ఏమిటి? పార్లమెంటులో చర్చించేందుకు అంతకుమించిన సమస్య ఏముంటుంది? ఇవాళ యావత్తు భారతదేశం మణిపూర్ గురించి కలత చెందుతున్నది. మణిపూర్ దావానలం నాగాలాండ్కు, అటునుంచి మొత్తంగా ఈశాన్యానికి వ్యాపించే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కానీ 56 అంగుళాల ఛాతీ ఉందని ప్రచారం చేసుకునే ప్రధాని మాత్రం ఈ సమస్యపై పార్లమెంటును ఎదుర్కొనేందుకు వెనుకాడుతున్నారు. మణిపూర్లో మెయితీ వర్సెస్ కుకీ-నాగా తగాదా హింసోన్మాదంగా పరిణమించింది. మణిపూర్లో మెయితీల అకృత్యాలపై రోజుకో కథనం బయటకు వస్తున్నది. మరోవైపు నాగాలాండ్లో స్థిరపడిన మెయితీలు నాగాల భయంతో పారిపోయి మణిపూర్ వస్తున్నారు. ఇంత తీవ్ర సమస్యపై ప్రధానికి ఇతర రాష్ర్టాల్లో జవాబుదారీ ఏమీ లేదా? ఒక రాష్ట్రంలోని తెగలు ఒకరినొకరు నరుక్కుంటుంటే దేశ ప్రధాని మాట్లాడాల్సిన అవసరం లేదా? చర్చించి పరిష్కార మార్గం కనుగొనాల్సిన బాధ్యత ఆయనపై లేదా?
మణిపూర్లో అనుసరిస్తున్న మతోన్మాద ఎజెండాపై విపక్షాలు తనను నిలదీస్తాయని జంకుతున్నట్టున్నరు. పార్లమెంటులో చర్చను విపక్షాలు అడ్డుకోవడం తెలుసు. ఇప్పుడు పాలకపక్షమే ఆ పనికి ఒడిగడుతున్నది. మణిపూర్లో మంటలు రాజేసింది ఎవరు? తెగల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? స్వార్థ, సంకుచిత రాజకీయాలకు మణిపూర్ను బలివేదిక మీదకు ఎక్కించింది ఎవరు? తనకు ఇబ్బందికరంగా ఉంటుందని ఇప్పుడు పార్లమెంటు వేదికపై పారదర్శక చర్చను అడ్డుకుంటున్నది ఎవరు? ఈ వ్యవహారంలో కేంద్ర పాలకుల డొల్లతనం, దాటవేత ధోరణి విస్పష్టంగా తెలిసిపోతున్నది. అసమర్థ డబుల్ ఇంజిన్ పాలన వల్లనే కదా మణిపూర్ వల్లకాడులా మారింది. తెగల తరతరాల తగాదాలో మతోన్మాద విషాన్ని రంగరించి తయారు చేసిన ఫార్ములా ఊపిరాడనివ్వడం లేదు. కండ్లముందరే ఘోరకలి నిత్యం ఆవిష్కృతమవుతున్నా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గద్దె పట్టుకొని వేలాడుతున్నారు. మూడు నెలలుగా సంక్షోభం తీవ్రమవుతున్నా మూతిముడుపే మోదీ సమాధానమైంది. ఇది ఈ దేశ ప్రధానికి శోభించే విషయం కాదు.
పార్లమెంటులో మణిపూర్ అల్లర్లపై లోతుగా చర్చించాలని, అదే విధంగా ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు కొద్దిరోజులుగా ధర్నా చేస్తున్నాయి. గందరగోళ పరిస్థితుల మధ్య ఉభయసభలు పదేపదే వాయిదా పడుతున్నాయి. అయినా సర్కారు సహకరించకపోవడంతో విపక్షాలు చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానాన్ని ఎంచుకున్నాయి. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) స్పీకర్కు దీనిపై నోటీసు కూడా సమర్పించింది. ఈ ప్రధాని నేతృత్వంలోని సర్కారుపై తమకు విశ్వాసం పోయిందని చాటిచెప్పడమే దీని వెనుక గల ఉద్దేశం. తనకున్న సంఖ్యాబలంతో మోదీ సర్కార్ ఈ తీర్మానాన్ని నెగ్గుకురావచ్చు. కానీ దేశ ప్రజల విశ్వాసం పునరుద్ధరించుకోవడం మాత్రం అంత సులభంగా అయ్యేది కాదు.