కాకతీయ రాజ్యం సామ్రాజ్యంగా వెలుగొందడానికి పునాదులు వేసినవారిలో కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రముఖుడు. ఇతన్నే మొదటి ప్రతాపరుద్రుడుగా పిలిచేవారు. ప్రసిద్ధమైన అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం కాకతీయుల చరిత్రకు సంబంధించిన ముఖ్య శాసనం. ప్రోలరాజు ప్రారంభించిన దిగ్విజయ యాత్రలను రుద్రదేవుడు కొనసాగించి కాకతి రాజ్య విస్తరణకు కృషి చేసి కాకతీయ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా నిలబెట్టాడు. ఇతని కాలంలో బెక్కల్లులో వేయించిన సంస్కృత తెలుగు శాసనం చాలా విశిష్టమైనది. శాసన కాలం శ.సం. 1117 = క్రీ.శ. 1195.
శాసనంలో రెండు అంశాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఒకటి కాకతి రుద్రదేవుని సామంతులైన రంజన వంశస్థుల ప్రశంస. ఆ వంశానికి చెందిన పొమ్మన, అతని కుమారుడు దండ్డప్ప, దండ్డప్ప కొడుకు కుల్వణుడు. అతనికి గోవర్ధనుడు, గదాధరుడు అనే పుత్రులు ఉన్నారు. ఈ గధాధరుడు గౌరీదేవి శ్రీకంఠ (శివ) ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ ఆ శివుడి గురించి గొప్ప వర్ణన ఉంది. దేదీప్యమాన శర సంభవ తీవ్ర వహ్ని సందీపిత త్రిపుర సంజ్జన కల్పవక్షుడని, గంగా తరంగ తతిభూషిత చారుమౌళి అని, …. గీర్వాణ పాదప ఇవాభిమత ప్రదాయీత శంకరస్య చరణాబ్ద యుగన్నమామి అని ఆ దేవ దేవుణ్ణి వర్ణించాడు. ఈ శాసనాన్ని బ్రాహ్మణ పుంగవుడు, గుణనిధి, గౌతమ వంశీయుడు, ధర్మాతుడును అయిన దామోదరార్యుని పుత్రుడు శ్రీ నాగదేవ కవి రాశాడు.
శాసనం మధ్యభాగంలో తెలుగు లిపిలో దాన విషయం ఉంది. ఇందులో ప్రారంభంలో శ్రీ రామేశ్వర, శ్రీ గొయ్యేశ్వర, శ్రీ బయ్యేశ్వర దేవుళ్ళు, శ్రీ సౌచాయ సరిగొయ్య రావుతు ప్రతిష్టించిన తపోధన విశ్వేశ్వర దేవుడు గురించి ప్రస్తావించారు. అదేవిధంగా రుద్రదేవ మహారాజు ఓరుగంటి నేలను రాజ్యం చేస్తుండగా ఆయన పాద పద్మోపజీవి, మహామండలేశ్వరుడు, భద్రంగ పురవరాధీశ్వరుడు, మాండలిక రావుత భుజంగ మండళిక రవుత మకర గ్రాము మండళిక రవుతం జముడూరు గొయ్యరావుతు,బయ్యరావుతుల తమ్ముడైన శ్రీగా హిచ రావుతు వక్కంటి శ్రీరామేశ్వర దేవునికి, ఆ సన్నిధిలో తన అన్నల పేర గొయ్యేశ్వర, బయ్యేశ్వర దేవరల ప్రతిష్టించిన సమయంలో శ్రీ రామేశ్వర దేవర ప్రముఖంగా ఈ మూడు ఆలయాలకు పూజ పునస్కార సహితంగా, అన్ని దేవకార్యాలకు 3 మర్తుర్లు సమర్పించాడు. ఇంకా ఎఱయె చెఱ్వు వెనక 8 మర్తుర్లు, నీరోహరి వెనక రెండు కాలాల్లో పంట పండే 11 మర్తుర్లు, చెరువు కట్ట కింద తోటలో మామిడిపండ్లు, వెలి పొలము 120 మర్తుర్లు శ్రీ విశ్వేశ్వర జియ్యకు బిడ్డ బిడ్డ తరముగా ప్రెత్తులు సమర్పించారు.
దీనికి వ్యతిరేకంగా నడిచినవారు కపిల గోవును పొడిచినంత పాపం పొందుతారు. అదేవిధంగా శాసనంలో గ్రామానికి సంబంధించిన ఏ వస్తువు తీసుకున్నా, రత్నం తీసుకున్నా, భూమిలో ఒక అంగుళం హరించినా నరకాన్ని పొందుతారని శాపోక్తులు చెప్పబడినాయి.
ఈ శాసనం ప్రభు భక్తి పరాయణకు, ఇంట్లో పెద్దవారిని గౌరవించే విధానం, భగవంతుని పట్ల నమ్మకాన్ని తెలుపుతుంది. ఇటువంటి శాసనాలు మన శాసన సాహిత్యంలో చాలా ఉన్నాయి.
-బిన్నూరి మనోహరి