‘కేఏ పాల్’ కనిపించగానే ‘అమిత్ షా’ పరుగు పరుగున వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఓ ఐదు నిమిషాల వరకు ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు. పాతికేండ్ల కిందట జాతరలో తప్పిపోయిన కవలల్లా, ఒకరికోసం ఒకరన్నట్టు బతికిన ప్రేమికుల్లా అనిపించారు. అపురూపమైన ఆ దృశ్యాన్ని చూసి అక్కడి సిబ్బంది కళ్లు చెమ్మగిల్లాయి. ఢిల్లీకి ప్రభువైనా తమ్ముడికి అన్నే అని సిబ్బంది కళ్ళు తుడుచుకున్నారు.
అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎన్టీఆర్ను జానపద సినిమాల్లో చూశాం. ఇద్దరు ఎన్టీఆర్లలో ఒకరు రాజు వద్ద పెరిగి యువరాజు అయితే, రెండో ఎన్టీఆర్ ముసలమ్మ వద్ద పెరిగి సామాన్యుడిగా, అల్లరి చిల్లరగా తిరుగుతాడు. అటువంటి అపూర్వ సహోదరుల్లో ఒకరు ‘అమిత్ షా’ అయితే ఇంకొకరు ‘కేఏ పాల్’ కావడం విధి విచిత్రం అంటూ అచ్చం జానపద సినిమాల్లో రాజ దర్బార్లో సామాన్యులు మాట్లాడుకుంటున్నట్టుగానే ‘షా’ దర్బార్లోని సామాన్యులు మాట్లాడుకోసాగారు. ఇదంతా వింటున్న ‘షా’ పీఏకు చిర్రెత్తుకొచ్చింది. వాళ్లిద్దరూ అపూర్వ సహోదరులు, జాతరలో తప్పిపోయిన అన్నదమ్ములని మీకు ఎవరు చెప్పారని చిరాకు పడ్డాడు.
‘షా.. అంత తన్మయంతో కౌగిలించుకోగా ఎప్పుడూ చూడలేదు. అందుకే అలా అనుకున్నామ’ని బదులిచ్చారు. ‘మీ ఇష్టం ఉన్నట్టు ఉహించుకోవడమేనా? ఊహలకు కూడా జీఎస్టీ విధిస్తే కానీ జనం దారిలోకి రార’ని పీఏ కోపంగా అన్నాడు. తనకు వచ్చిన ఐడియాకు తనను తానే అభినందించుకొని ఈ ఐడియా ప్రధానికి చేరేట్టు చేయాలి. ఆలోచనలపై కూడా జీఎస్టీ విధిస్తే ప్రభుత్వానికి బోలెడు ఆదాయం వస్తుంది. జీఎస్టీ కట్టలేక జనం ఆలోచనలు మానేసి కంట్రోల్లో ఉంటారని పీఏ ఆలోచనల్లో మునిగి పోయాడు. పీఏ మరో లోకంలోకి వెళ్లాడని గ్రహించిన సందర్శకులు “షా’, ‘పాల్’ అన్నదమ్ము లు కాకపోతే మరి అంత ఆప్యాయంగా ఎందుకు కౌగిలించుకున్నార’ని సందేహం వ్యక్తం చేశారు.
పీఏ నవ్వి ‘వారిద్దరూ సిద్ధాంతాలపరంగా అన్నదమ్ముళ్లు, భావసారూప్యత వల్ల అన్నదమ్ములు, ఆలోచనల్లో అన్నదమ్ముళ్లు, మాటల్లో, చేతల్లో అన్నదమ్ముళ్లు’ అని బదులిచ్చాడు. ‘అర్థం కాలేదు. పైగా మీ సమాధానం మమ్మల్ని మరింత గందరగోళంలో పడేసింది. పాల్ క్రైస్తవ మత ప్రచారకులు, మీరేమో హిందూ మతం ఓనర్లమని చెప్పుకొంటారు. మాత మార్పిడి ప్రచారం చేసే పాల్కు, దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పే మీకూ భావసారూప్యతనా? చిత్రంగా ఉంద’ని ఆశ్చర్యపోయారు. అంతా విన్న కమలనాథుడొకరు జోక్యం చేసుకుని ‘ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? పాల్ ఐనా మేమైనా మతాన్ని అడ్డుపెట్టుకొని బతుకుతాం, ఇంతకుమించి భావ సారూప్యత ఏముంటుంది? మతాన్ని నమ్ముకొని పాల్ బోలెడు సంపాదించాడు. మేమూ సంపాదించాం. పాల్ అన్ని దేశాలు తిరుగుతాడు, మా అధినేత అంతే పిలిచినా పిలవకపోయినా దేశాలన్నీ తిరుగుతాడు. మా ఇద్దరివీ కోతలు ఎక్కువ, పనులు తక్కువ. చెప్పేదానికి, చేసేదానికి అస్సలు పొంతన ఉండదు. రామరాజ్యం తెస్తామంటాం. సీతను శ్రీరాముడు తిరిగి స్వీకరించడాన్ని ఎవరో ఒక అనామకుడు తప్పుబట్టాడని తెలిసి శ్రీ రామచంద్రుడు సీతమ్మను అడవిలో వదిలేశాడు. మరి మేమేం చేశాం! వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తూ నెలల తరబడి రోడ్డుమీద ఉద్యమిస్తే తన్ని తగిలేశాం.. రైతుల పైనుంచి కారు నడిపించి ప్రాణాలు తీశాం. ఐనా సిగ్గు పడకుండా రామరాజ్యం తెచ్చామని చెప్తాం. రామలక్ష్మణులు అన్నదమ్ముళ్ల అన్యోన్యతకు ప్రతీకలు. మరి మాకు తమ్ముడి హత్య కేసులో ముద్దాయి పాల్ ఆదర్శం. ఐనా మాది రామరాజ్యం అని నమ్మిస్తాం. గాడ్సే మా ఆదర్శం. కానీ, గాంధీజీని పూజిస్తున్నట్టు నటిస్తాం. ఏం చేస్తున్నామని కాదు, రాజకీయాల్లో ఏం చెప్తున్నామనేది ముఖ్యం. గుట్కా తిన్నా ఫరవాలేదు, తింటున్నది లవంగం అని చెప్పాలి, నమ్మించాలి. ఇదే రాజకీయం’..
‘మీ ఇష్టం ఉన్నట్టు ఉహించుకోవడమేనా? ఊహలకు కూడా జీఎస్టీ విధిస్తే కానీ జనం దారిలోకి రార’ని పీఏ కోపంగా అన్నాడు. తనకు వచ్చిన ఐడియాకు తనను తానే అభినందించుకొని ఈ ఐడియా ప్రధానికి చేరేట్టు చేయాలి. ఆలోచనలపై కూడా జీఎస్టీ విధిస్తే ప్రభుత్వానికి బోలెడు ఆదాయం వస్తుంది.
‘అమిత్ షా’ బయటకు రాగానే అంతా అలర్టయ్యారు. వీరి సంభాషణ ఆయన వినలేదనుకున్నారు. వీరి దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి ‘మోదీ, నేను, అదానీ, వారు, వీరు అని కాదు, సక్సెస్ఫుల్ వ్యాపారులు అందరూ గుజరాతీలే. వ్యాపారంలో లాభం కోసం ఏమైనా చేయవచ్చు తప్పు లేదు. రాజకీయం లాభసాటి వ్యాపారం ఏమైనా చేస్తాం, చేస్తున్నాం.. అబద్ధాలు ప్రచారం చేసైనా వస్తువులమ్ముకోవాలి. రాజకీయాల్లోనూ అంతే.. బ్రహ్మాండమైన ఆయుధంతో తెలంగాణలో అడుగుపెడుతున్నాం. ఆ భారీ ఆయుధాన్ని తుక్కుగూడ సభలో ప్రకటిస్తామ’ని సస్పెన్స్లో పెట్టి ‘షా’ అక్కడినుంచి వెళ్లిపోయారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో, చివరి బాల్ అంటూ కిరణ్కుమార్రెడ్డి బోల్తా పడ్డట్టు ఈయనేం చేస్తాడో అని అక్కడున్న ఒకరు గొణుక్కున్నారు. తుక్కుగూడ సభలో అమిత్ షా ఏ ఆయుధాన్ని లాంచ్ చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమిత్ షా తన ప్రసంగం ముగింపులో ‘మీ కోసం ఓ ఆయుధం.. ఈ ఆయు ధంతో గెలుపు మనదే అంటూ ఊరించి, ఉత్కంఠతను పెంచి, ఒక్క క్షణం మౌనంగా ఉండి.. ‘మీ కోసం భారీ ఆయుధం కేఏ పాల్, ఇక మీరు పాల్ తో కలిసి పనిచేసి అధికారం సాధించండి’ అనగానే అంతా ఒక్కసారి ఘొల్లున నవ్వారు. అమిత్ షా అయోమయంగా పక్కనున్న కిషన్ రెడ్డితో ‘అంతా ఎందుకు నవ్వుతున్నార’ని అడిగాడు.
‘తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని ఎలాగూ పాల్ లాంటి వారికే అప్పగించారు. ఒక పాల్ సరిపోడా? ఇంకో పాల్ను రప్పించార’ని అంతా నవ్వుతున్నారని చెప్పాలని ఉన్నా, కిషన్రెడ్డి చెప్పలేక మౌనంగా ఉండిపోయారు.
– కౌటిల్య