ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో ‘రాజ్యాంగాన్ని మార్చాలి’ అన్న మాట రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేపటం చూశాం. రాజకీయ నాయకులు ఇంతలా కేసీఆర్ను ఎందుకు విమర్శిస్తున్నారనేది విస్మయం కలిగిస్తున్నది. రాజ్యాంగాన్ని మార్చాలనటం నేరమా? ఘోరమా? లేక చట్ట వ్యతిరేక చర్యా? నిజానికి రాజ్యాంగాన్ని మార్చాలని అడిగే హక్కు రాజ్యాంగమే కల్పిస్తున్నది.
వాక్స్వాతంత్య్రం అంటే ఏమిటి? గాంధీని చంపిన గాడ్సే చాలా గొప్పవాడని ఒక గౌరవ సభ్యురాలు చట్టసభలో నొక్కివక్కాణించినప్పుడు ఏమైంది రాజ్యాంగం పట్ల గౌరవం? రాజ్యాంగం చాలా ముఖ్యమైన అంశం. అందులో సందేహం లేదు. ముఖ్యం కాబట్టే మార్చాలని కోరుకోవచ్చు కదా? ఇటువంటి ప్రశ్నలన్నీ రాజ్యాంగ పరమైనవి. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు నిండిన వేళ మన రాజ్యాంగం మన ఆకాంక్షలను ఏ మాత్రం సఫలీకృతం చేసిందీ అనే విషయం చర్చించటంలో తప్పేమీ లేదు. రాజ్యాంగాన్ని మార్చాలనటంలో విడ్డూరం ఏమీ లేదు.
చాలా ఏండ్లు మనం బంధించిన ఆర్థిక వ్యవస్థలో బతికాం. హఠాత్తుగా ఒకరోజు తలుపులు తీసి ప్రపంచాన్ని లోపలికి పిలిచాం! ఎందుకని? మూసి ఉన్న వ్యవస్థ వల్ల మంచి జరగలేదని గ్రహించాం గనక. అలాగే ప్రస్తుత రాజ్యాంగం వల్ల ప్రజలకు మేలు జరగటం లేదనే వాదన ఉన్నది. అది పెద్దగా శబ్దం చేయకపోవచ్చు. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనడం ద్వారా రాజ్యాంగాన్ని గానీ, రాజ్యాంగ నిర్మాణంలో అత్యంత కీలకపాత్ర పోషించిన అంబేద్కర్ను గానీ కించపరచలేదు, అగౌరవపరచనూ లేదు. ఆయన వ్యాఖ్యలను మనం ఉద్రేకంతో కాకుండా నిదానంగా ఆలోచించితే అందులో ఏ తప్పు లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్యాంగం అనేది మన కోసం మనం నిర్మించుకున్న ప్రాథమిక చట్టం. ఎన్నోసార్లు మన రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. 1976లో అయితే 42వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి విప్లవాత్మకమైన మార్పులు చేసుకున్నాం. అనేకసార్లు కోర్టులు పార్లమెంట్ చేసిన సవరణలు చెల్లవని చెప్పాయి. ఒకసారైతే రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు అసలు లేనేలేదని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు. అదే గోరక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో తీర్పు. అది చాలా అసంబద్ధమైన తీర్పు అని అన్నివర్గాలూ భావించాయి. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది జస్టిస్ కోకా సుబ్బారావు. అలా సెలవిచ్చిన ఆనతికాలంలోనే ఆయన రాష్ట్రపతి పదవికి పోటీ పడటం కొసమెరుపు. ఇది రాజ్యాంగంలో ఉన్న లోపం కాదా? న్యాయమూర్తులు పదవీ కాలం అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తే వారిచ్చిన తీర్పులకు ఏం విశ్వసనీయత ఉంటుంది? న్యాయమూర్తులుగా ఉన్నారు కాబట్టి రాజకీయాల్లోకి రాకూడదనే నిబంధన పెట్టడం సరైనదేనా? ఇటువంటి ప్రశ్నలన్నీ రాజ్యాంగపరమైనవి.
మన ప్రాథమిక శాసనంలో అనేక సమస్యలున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం ఉన్నా రాజ్యాంగాన్ని రద్దుచేసి కొత్తదాన్ని ఏర్పాటుచేసుకోవటమేనా అనేది ర్చించవలసిన అంశం! కానీ రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకోవటం చట్టవ్యతిరేకం కానే కాదు. కొత్త రాజ్యాంగం కావాలని కోరుకునేవాళ్లు ఉన్నదాన్ని అగౌరవపరచకూడదు. ఉన్న రాజ్యాంగాన్ని అనుసరించే నడవాలి. సహేతుకమైన కారణాలుంటే రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకోవడంలో తప్పేం లేదు.
ప్రపంచంలో చాలా దేశాలు రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం రాజ్యాంగాలను పునర్నిర్మించుకున్నాయి. మనం రాజ్యాంగాన్ని పదే పదే సవరిస్తూ వచ్చాం. 2000లో ఒక కమిటీ కూడా వేశాం. స్వాతంత్య్రం వచ్చి యాభై ఏండ్లవుతున్న సందర్భంగా మన రాజ్యాంగ పనితీరును పరిశీలించి కాలానుగుణంగా ఎటువంటి మార్పులు చేర్పులు చెయ్యాలనేది ఈ కమిటీ బాధ్యత. ఇది జరిగింది బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే. రాజ్యాంగాన్ని సమీక్షించటం అంటే అది మన అవసరాలకు అనుగుణంగా లేదనే కదా!
గోరక్నాథ్ తీర్పుకు భిన్నంగా కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు మధ్యేమార్గం ఎంచుకున్నది. రాజ్యాంగానికి మార్పుచేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది గానీ, ఆ మార్పులు రాజ్యాంగ ప్రాథమిక స్వరూపానికి నష్టం కలిగించేవిగా ఉండకూడదనేది ఈ కేసులో సారాంశం. అయితే ఏమిటి రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం, దాన్ని తెలుసుకోవటం ఎలా అనే విషయాలను కోర్టు తేల్చిచెప్పలేదు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే రాజ్యాం గం అనేది భగవద్గీత లాంటి ఐతిహాసిక గ్రంథం కాదు. అది ప్రజల ఆకాంక్షలు నెరేవేర్చటానికి మనం మనకోసం ఏర్పాటుచేసుకున్న వ్యవస్థ. ఎప్పుడైతే ఆ ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి లేదో మనకు మరో రాజ్యాంగాన్ని రచించుకునే హక్కు సార్వభౌమాధికారం గల జాతిగా మనకు ఎప్పుడూ ఉంటుంది. అంబేద్కర్ లాంటి మహామనిషే ఒకానొక సందర్భంలో ఈ రాజ్యాంగాన్ని తగలేస్తానన్నారు రాజ్యసభలో. రాజ్యాంగం మీద చాలామందికి తీవ్రమైన అసంతృప్తి ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. దీనికి అనేక కారణాలున్నాయి. మనది ఫెడరల్ వ్యవస్థ అయినప్పటికీ ఆ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉంది వ్యవహారం అనేక విషయాల్లో. మన రాజ్యాంగంలో అతి ముఖ్యమైన విషయం ప్రాథమిక హక్కులు. ఇవి వ్యక్తి స్వేచ్ఛగా జీవించటానికి తన తెలివితేటలను సంపూర్ణంగా వినియోగించి తాను అభివృద్ధి చెందటానికి, తద్వారా ఇతరులను అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తాయనేది నమ్మకం. కానీ నిజంగా అలా జరిగిందా?
కేసీఆర్ను ఇంతలా విమర్శించేవారు రాజ్యాంగాన్ని ఏ మాత్రం గౌరవిస్తున్నారు? 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దాదా పు కొత్త రాజ్యాంగానికి తెరలేపింది కాంగ్రెస్ కాదా? రాజ్యాంగ వ్యవస్థలను అణచివేసేవిధంగా వ్యవహరిస్తున్నది బీజేపీ కాదా? లోక్సభలో తనకంటూ తగినంత మెజారిటీ ఉన్నప్పటికీ, ఎన్నికలు జరిగి రెండేండ్లు అయినా డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోకుండానే కాలం గడుపుతున్న బీజేపీకి రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పాలి. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన్నారే కానీ ఇప్పుడున్న రాజ్యాంగాన్ని అగౌరవపరచలేదు. అమర్యాదకరంగా మాట్లాడలేదు. మరి ఎందుకింత రాద్ధాంతం? ఎందుకు చర్చ జరగకూడదు రాజ్యాంగం పనితీరు మీద? కేసీఆర్ ఏ ఉద్దేశంతో రాజ్యాంగాన్ని మార్చాలన్నారో ఆయన విడమరిచి చెప్పలేదు. కానీ ఆయన లేవదీసిన అంశం చర్చించదగిందే. మన దేశంలో కోట్ల మంది ప్రజలకు రాజ్యాంగం అనేది ఒకటి ఉందని, అది హక్కులను కలిగించింది అని చాలా మందికి తెలియదనేది మాత్రం నిజం.
బతుకు భారంగా ఉన్నప్పుడు, రేపు ఎలా గడుస్తుందో అన్న ఆలోచనలో మునిగి ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులనేది హుళక్కే. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్టలు, దాచుకోవటానికి నీడ ఉన్నప్పుడే మనిషి హక్కులు, వ్యక్తిత్వం, గుడ్డూ, గూసు గురించి ఆలోచిస్తాడు. మన రాజ్యాంగం మనిషి ప్రాథమిక అవసరాలు తీర్చేవిధంగా ఉన్నదా? రాజకీయపక్షాలు ఎన్నికప్పుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోతే రాజ్యాంగం ఏమైనా చేయగలుగుతుందా? ఓటు వేసిన ప్రజలు ఐదేండ్లు ఓపికగా ఉండటం మినహా పాలకులను దారిలో పెట్టే వ్యవస్థ ఏమైనా మన రాజ్యాంగం మనకు కల్పించిందా? అమలు చేయలేని హామీలు ఇస్తున్నప్పుడు రాజ్యాంగం ఏమైనా చేయగలిగిందా? రాజ్యాంగాన్ని మారిస్తే కొత్తగా వచ్చేది బాగుంటుందా అనేది కూడా చర్చనీయాంశమే. ఈ విషయాలన్నిటిపై చర్చ జరగాలన్నది కేసీఆర్ ఉద్దేశమై ఉండవచ్చు.
(వ్యాసకర్త: లోక్సభ సచివాలయంలో మాజీ డైరెక్టర్)
-గుమ్మడిదల రంగారావు
98181 66360