అసలైన అంబేద్కరిస్టులు నిరంతరం అంబేద్కర్ చెప్పిన ‘బోధించు – సమీకరించు – పోరాడు’ సిద్ధాంతాన్ని పాటించాలి. అంబేద్కరిస్టులు సహనం, ఓర్పు, నేర్పు, తెలివి కలిగి ఉండాలి. అందరితో కలవాలి, అందరినీ జ్ఞానవంతుల్ని చేయాలి. దేశాభివృద్ధి కోసం, దళిత జాతి అభ్యున్నతి కోసం ప్రగతిశీల వాదులంతా అంబేద్కరిజాన్ని ఆచరించాలి.
అంబేద్కర్ అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఈ దేశానికి కులం ద్వారా పెను ప్రమాదం ఉందని తెలుసుకున్నారు. ‘కుల నిర్మూలన’ పుస్తకం రాశారు. అధ్యయనం నుంచే ఆచరణ మొదలవ్వాలని సూచించారు. అంబేద్కర్ తన చిన్నతనం నుంచి ఎదుర్కొన్న కుల వివక్షను, దానికి మూలమైన హిందూ మత కట్టుబాట్ల సంకెళ్లను తెంపడానికి జీవితాంతం పోరాటం చేశారు. భారత సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో నిరంతరం అధ్యయనం చేశారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు రోజుకు ఒక్క టీ తాగి కడుపు నింపుకొని 18 గంటలు చదివారు.
లండన్లోని బ్రిటీష్ లైబ్రరీలోని పుస్తకాలన్నీ అంబేద్కర్ చదివారని చెబుతారు. ఉన్నత విద్యాభ్యాసంతో పొందిన జ్ఞానంతో స్పష్టంగా ఆలోచించి అనేక గ్రంథాలను రచించారు. ఆయన రాసిన అనేక పుస్తకాలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఒక పక్క అధ్యయనం, మరో పక్క సమాజ మార్పు కోసం ఉద్యమం చేశారు. ఆయన కృషి వల్లే ఇప్పుడు మనం ప్రగతి ఫలాలు అనుభవిస్తున్నాం. ఒక పక్క కళాశాలలో పాఠాలు బోధిస్తూ, మరో పక్క పేదల కోసం న్యాయవాదిగా పని చేశారు అంబేద్కర్. కులం తాలుకు అవమానాలు ఎదుర్కొంటూనే దళిత జాతిని జాగృతం చేశారు.
కాంగ్రెస్ కుతంత్రాలను ‘మూక్ నాయక్’ పత్రిక ద్వారా ప్రజలకు తెలియ చెప్పారు. కులం, మతంలోని లోపాలను బట్ట బయలు చేశారు. కార్మికుల కోసం ఒక పార్టీ కావాలని ‘ఇండియన్ లేబర్ పార్టీ’ ప్రారంభించారు. ఆయన అధ్యయనం-ఆచరణ పోటాపోటీగా ఉండేవి. ఈ దేశం కోసం, తన జాతి కోసం తన సొంత పిల్లలను కోల్పోయారు అంబేద్కర్. లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితుల హక్కుల కోసం, ప్రత్యేక నియోజక వర్గాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం, కాంగ్రెస్, గాంధీజీతో పోరాడారు.
భారత దేశానికి రాజ్యాంగాన్ని రచించే అవకాశం వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలకు, తన జాతి ప్రజలకు మేలు చేయవచ్చనే ఉద్దేశంతో దాన్ని స్వీకరించారు. రాజ్యాంగ రచన కమిటీలో ఇతర సభ్యుల సహకారం ఎక్కువగా లేకపోయినా రాజ్యాంగ రచన పూర్తి చేశారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకొన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం రాజ్యాంగాన్ని తొలగించడానికి, దానికి తూట్లు పొడవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నమ్మిన విలువల కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం కేంద్ర మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు.
ఆయన గదిలో రాత్రి వేళ ఎప్పుడూ లైట్ వెలుగుతూనే ఉండేది. పగటి వేళ కూడా చేతిలో పుస్తకం ఉండేది. కారులో ప్రయాణిస్తున్నా పుస్తకాలు చదివేవారు. ఈ దేశ అభివృద్ధి కోసం ఆయన తన కుటుంబ సభ్యుల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కుల, మత వివక్షలను రూపు మాపడానికి ప్రయత్నించారు. ‘కాంగ్రెస్-గాంధీ అంటరాని వారికి ఏం చేశారు’, ‘అస్పృశ్యులెవరు’, ‘హిందూ మతంలో చిక్కుముడులు’, ‘పాకిస్థాన్ లేదా భారతదేశ విభజన,’ ‘రూపాయి సమస్య’, ‘బుద్ధుడు-అతడి ధర్మం’ మొదలైన పుస్తకాలు రాశారు.
దేశాభివృద్ధి కోసం, దళిత జాతి అభ్యున్నతి కోసం ప్రగతిశీల వాదులంతా నిరంతరం అధ్యయనం చేయాలి, ఉద్యమించాలి. అంబేద్కరిస్టు అంటే సహనం, ఓర్పు, నేర్పు, తెలివి కలిగి ఉండాలి. అందరితో కలవాలి, అందరినీ జ్ఞానవంతుల్ని చేయాలి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా, గొడవలు పడకుండా అంబేద్కరిజాన్ని ఆచరణలో ముందుకు తీసుకువెళ్లాలి. అసలైన అంబేద్కరిస్టు నిరంతరం అంబేద్కర్ చెప్పిన ‘బోధించు – సమీకరించు – పోరాడు’ సిద్ధాంతాన్ని పాటిస్తారు. అందుకే మన సమాజానికి, దేశానికి, జాతికి అధ్యయనం, ఆచరణ చాలా అవసరం.
(నేడు అంబేద్కర్ వర్ధంతి)
తంగిరాల సోని: 96766 09234