ఏండ్ల తరబడి చేసిన పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తొమ్మిదేండ్లుగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ దేశం ముందు తలెత్తుకొని నిలబడింది. ఇప్పుడు దేశానికి తెలంగాణ అనేక అంశాల పట్ల ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నది. పలురంగాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, రివార్డులే ఇందుకు నిదర్శనం. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ అస్తిత్వానికి గట్టి పునాది పడింది. తెలంగాణ ప్రజల శ్రమ శక్తి బయటపడింది. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగ ఉత్పత్తులు విపరీతంగా పెరిగాయి. ఆర్థికవృద్ధి, జీఎస్డీపీ రెట్టింపైంది. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. సాంస్కృతిక వైభవం, తెలంగాణ భాష అత్యున్నత స్థితిలో ఉన్నది. ఇప్పుడు తెలంగాణ భాషలో మాట్లాడటం తెలుగు ప్రజలకు ముఖ్యంగా యువతకు ఒక ఫ్యాషన్గా మారింది.
తెలంగాణ కథలతో వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తున్నాయి. తెలంగాణ సినిమా ప్రజల్లోకి చొచ్చుకపోయింది. ఇదంతా తెలంగాణ అస్తిత్వంలో భాగంగా కేసీఆర్ నాయకత్వంలోని పరిపాలనా ఉద్యమంలో సాధించిన ఒక గొప్ప విజయం. ఈ విజయ పరంపర కొనసాగాలన్నా.. తెలంగాణ అస్తిత్వం మరింత బలోపేతం కావాలన్నా.. కేసీఆర్ పరిపాలనా ఉద్యమానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా మార్గం వేయాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులదే. తొమ్మిదేండ్ల పరిపాలనా ఉద్యమంలో వచ్చిన ఫలితాలతో దేశంలోని బడా కార్పొరేట్ల కన్ను తెలంగాణ మీద పడింది. ఇక్కడ ఉన్న సంపద, ఆర్థిక వనరులను తమ గుప్పెట్లోకి తీసుకోవడానికి పెద్ద రాజకీయ, ఆర్థిక వ్యూహాలను, కుట్రలను అమలుచేయటానికి అడుగులు వేస్తున్నారు. ఇందుకు ఈ సంవత్సరం చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను తమ రణక్షేత్రంగా ఈ బడా కార్పొరేట్లు ఎన్నుకున్నారు. ఈ బడా కార్పొరేట్లు బీజేపీ ముసుగులో తెలంగాణపై పడుతున్నారు. గుజరాత్ కార్పొరేట్లే దీనికి నాయకత్వం వహిస్తున్నారు. రాజకీయంగా కూడా గుజరాత్ బడా రాజకీయ నాయకులే దీనికి సారథ్యం. మొత్తమ్మీద గుజరాత్ పరివార్ తెలంగాణ అస్తిత్వంపై దాడికి రాజకీయ కత్తులు సిద్ధం చేసుకుంటున్నది.
తెలంగాణ ఆర్థిక వనరులు, సంపదను చెరబట్టడానికి గుజరాత్ కార్పొరేట్, రాజకీయ పరివార్ కలిసి ఆడుతున్న ఎన్నికల ఆట. ఈ ఆటలో గుజరాత్ కార్పొరేట్ రాజకీయ పరివార్ వైపా, తెలంగాణను తొమ్మిదేండ్లలో ఆర్థికశక్తిగా తయారుచేసి ఉద్యమం లాగానే పరిపాలన సాగిస్తున్న తెలంగాణ సాధకుడు కేసీఆర్ వైపా అనేది ప్రజలు తేల్చుకోవాలి. దేశానికి డబ్బులు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గుర్తించకపోయినా బడా కార్పొరేట్లు గుర్తించారు. అందుకే ఈ రాష్ట్రం మీద పెత్తనం కోసం బీజేపీ నాయకత్వాన్ని ఈ గుజరాత్ బడా కార్పొరేట్లు పట్టుకున్నారు. దేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ర్టాలను ఇదే తరహాలో తమ గుప్పెట్లో పెట్టుకొని సంపదను దోపిడీ చేస్తున్నారు. మతాన్ని ముందుపెట్టి ఈ బడా కార్పొరేట్లకు దోచిపెట్టే సాధనంగా బీజేపీ తయారైంది.
కేంద్రంలో అత్యధిక ఎంపీ స్థానాలతో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అప్రజాసామిక పద్ధతిలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను తమ చేతుల్లోకి తీసుకున్నది. తెలంగాణలో ఇలాంటి ప్రయోగం చేయబోతుందని గ్రహించిన కేసీఆర్ ముందుగానే జాగ్రత్తపడి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాజకీయంగా బలంగా ఉన్నామనే అహంకారంతో రాష్ర్టాల హక్కులను, సమాఖ్యస్ఫూర్తిని సమాధి చేస్తూ.. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అవమానిస్తున్నారు. రాష్ర్టాల అధికారాలను క్రమంగా పరోక్షంగా లాక్కుంటున్నది కేంద్ర ప్రభుత్వం. బడా కార్పొరేట్లు చెప్పేవిధంగా ముఖ్యమంత్రులు వినాలనే రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. అలా వినని ముఖ్యమంత్రులపై రాజకీయంగా, ఇతర విచారణ సంస్థల ద్వారా దాడి చేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పిన కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లారు. బడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లకుండా తెలంగాణ అస్తిత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పరిపాలనను కూడా ఉద్యమం లాగా చేస్తున్న కేసీఆర్పై కార్పొరేట్లు, బీజేపీ అగ్రనాయకత్వం చేస్తున్న కుట్రలను, కిటుకులను తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకున్నది.
ఎన్నో ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు తిని తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి లక్ష్యాన్ని చేరుకున్న కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని బడా కార్పొరేటర్ గుప్పిట్లోకి పోకుండా మరో పరిపాలనా రాజకీయ ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయటానికి గుజరాత్ కార్పొరేట్ రాజకీయ పరివార్ మొదటగా తెలంగాణలోని ధనవంతులను టార్గెట్ చేసుకొని తమవైపు తిప్పుకున్నది. కానీ, ప్రజా నాయకుడు తెలంగాణ ఉద్యమ నిర్మాత, సాధకుడు కేసీఆర్ ఉద్యమంలో అన్నిరకాల వ్యక్తులు, సంస్థలు, నాయకులను కలుపుకొని తెలంగాణ సాధించిన వ్యక్తిగా గుర్తింపు ఇచ్చి, తెలంగాణ ప్రజలు కేసీఆర్కు రెండుసార్లు అధికారం ఇచ్చారు. ఆ స్ఫూర్తి, ఆ ఉద్యమ పంథాతోనే పరిపాలన సాగిస్తూ తెలంగాణ గౌరవాన్ని అభివృద్ధిని, ఆర్థికశక్తి, అస్తిత్వాన్ని దేశం ముందు నిలబెట్టారు.
తెలంగాణలో విద్యుత్, బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేసీఆర్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో అదానికీ కేసీఆర్ లొంగలేదు. యాదాద్రి పవర్ప్లాంట్ తెలంగాణ ప్రభుత్వమే నిర్మించింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కు, దీని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇలాంటివి నచ్చక గుజరాత్ కార్పొరేట్ శక్తులు కేసీఆర్పై రాజకీయంగా కక్షగట్టారు. తెలంగాణ సంపదను చెరబట్టడానికే గుజరాత్ రాజకీయ, కార్పొరేట్ పరివార్ తెలంగాణ ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఇక్కడి ప్రజలు నిరంతరం బతుకు, ఉనికి, అస్తిత్వం కోసం పేదరికంతో కొట్లాటలు ఉద్యమాలు, పోరాటాలతో వేలాది మంది ప్రాణాలర్పించారు.
ఈ తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ప్రజలకు కొంత వెసులుబాటు, కొంత ఆర్థికశక్తి వచ్చింది. ప్రజలకు వచ్చిన ఈ శక్తిని నిర్వీర్యం చేసి సంపదను గద్దల్లా తన్నుకపోవటానికి వస్తున్న గుజరాత్ బడా కార్పొరేట్ రాజకీయ పరివారం ఒకవైపు, తెలంగాణ ఉద్యమ నిర్మాత తెలంగాణ అస్తిత్వాన్ని బలోపేతం చేయడానికి మరిన్ని అడుగులు వేస్తూ ఉద్యమంలా సాగిన కేసీఆర్ తొమ్మిదేళ్ల పరిపాలన, ఫలితాలు మరోవైపు… తెలంగాణ ఎన్నికల రణరంగంలో తలపడనున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా పోరాటాలు ఉద్యమాలతోనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బడా గుజరాత్ కార్పొరేట్లతో జరుగుతున్న పోరాటంలోనూ ప్రజ లు ప్రజా ఉద్యమ నాయకుడు కేసీఆర్తోనే నడుస్తారు. నడవాలి, నడచి తీరాలి. లేకపోతే తెలంగాణ అస్తిత్వం గుజరాత్ కార్పొరేట్ కబంధహస్తాల్లో నలిగిపోవడం ఖాయం.
తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా పోరాటాలు ఉద్యమాలతోనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బడా గుజరాత్ కార్పొరేట్లతో జరుగుతున్న పోరాటంలోనూ ప్రజలు ప్రజా ఉద్యమ నాయకుడు కేసీఆర్తోనే నడుస్తారు. నడవాలి, నడచితీరాలి. లేకపోతే తెలంగాణ అస్తిత్వం గుజరాత్ కార్పొరేట్ కబంధ హస్తాల్లో నలిగిపోవడం ఖాయం.
– నర్రా విజయ్కుమార్
90521 16316
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)