భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది. అదే సంవత్సరం జనవరి 13న ఏర్పడిన తెలంగాణ పరిరక్షణ కమిటీకి ఉస్మానియా విద్యార్థులు బాసటగా నిలబడ్డరు. జనవరి 24న సదాశివపేటలో జరిగిన కాల్పుల్లో 14 మంది గాయపడ్డరు. వారిలో పదిహేడేండ్ల శంకర్ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మరుసటిరోజు చనిపోయిన్రు.
1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్. ఆగ్రహోదగ్రుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ తిరుగుబావుటా ఎగరేసి, మంత్రి పదవికి రాజీనామా చేసిన్రు. సరిగ్గా అదే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశీర్వాదంతో మూడు దశాబ్దాల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జలదృశ్యం సాక్షిగా ప్రత్యేక రాష్ట్ర కాడిని ఎత్తుకున్నరు. ఉద్యమానికి మెరుపు వేగాన్ని, చాతుర్యాన్ని, ఇంకా ఎన్నో హంగులనూ అద్దిన్రు, తీవ్రతను పెంచిన్రు.
నాటి శంకర్తో మొదలైన త్యాగాల పరంపర 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదాకా కొనసాగింది. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మొదలుకొని వందలాది తెలంగాణ బిడ్డలు చావుకు ఎదురేగిన్రు. సకలజనులూ ఏకమైన మహోజ్వల విప్లవమది. ప్రతి తెలంగాణ బిడ్డా తమ అస్తిత్వం కోసం నినదించిన అపురూపమది. మలిదశ ఉద్యమంలో తెలంగాణ కాంక్షించే సర్వ శక్తులకూ అనితర సాధ్యమైన రాజకీయ నాయకత్వం అందించి గల్లీ పోరాటాల్లోనూ, ఢిల్లీ లాబీల్లోనూ అంతా తానైన కేసీఆర్ దక్షత గురించి ప్రస్తావించడం ఆయనను పొగడటం కోసం కాదు, అమరుల ఆశయాలకు ఆయన ఆదెరువు అయిండని గుర్తు చేసుకోవడం.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు, జూన్ 22న, అమరులను యాది చేసుకుంటున్నం. నిరంతరం వారిని గుండెల్లో పెట్టుకొని పూజించుకునే మనం ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా, నాటి కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం సమీపాన అమరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరింపజేసుకుంటున్నం.
అమరులు నాడు ఏమి కోరుకున్నరు? నేడు వారి స్ఫూర్తి మనకు ఏమి దిశానిర్దేశం చేస్తున్నది? అందరి అభివృద్ధి-సంక్షే మ – ఆత్మగౌరవాలకు ఆలవాలమైన తెలంగాణ; ఎలాంటి వివ క్షా లేని, అసమానతల్లేని తెలంగాణ; శాంతికాముక తెలంగాణ; పాలనలో, పరిణతిలో దేశానికి దారి చూపే తెలంగాణ… ఇవి కదా?
స్వరాష్ట్రం సాధించుకున్న తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ఎన్నో అభివృద్ధి సూచీల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా విలసిల్లుతున్నది. ప్రతి రోజూ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు; ఆర్బీఐ, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఇందుకు తార్కాణంగా ప్రశంసలు, అవార్డులు, రివార్డులు ఇస్తూనే ఉన్నయి. లండన్ కేంద్రంగా మనం సర్టిఫికెట్లు అందుకుంటున్నం. అమెరికా, యూరప్ సహా అంతటా మన పేరు మార్మోగుతున్నది, పెట్టుబడులు వెల్లువెత్తుతున్నయి. ఈ ‘వేదిక’ పేజీలలోనే ఎన్నో సార్లు మాట్లాడుకున్నం మనం గణాంకాల సహితంగా. మరికొద్ది గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపబడే అమరుల స్మారక చిహ్నం, నిరంతరం వెలిగే జ్యోతి రూపంలోని అమరుల స్ఫూర్తి మనకు ప్రేరణ ఇవ్వడమే కాకుండా, నిరంతర జాగరూకత అవసరం అని కూడా చెప్తయి.
‘ఉద్యమకారులు’ అనే పదం ఉచ్చరించడానికి కూడా అర్హతలేని వ్యక్తులు నేడు ప్రజాపాలనపై బురద జల్లుతూ ఉన్నరు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ దండలో దారం ఆధారంగా తెలంగాణ విరాజిల్లుతూ ఉన్నది. తొట్ట తొలి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఆంధ్రా నాయకులతో కుమ్మక్కయి లక్షలాది రూపాయలతో టీవీలకు చిక్కిన దొంగ నేడు ఒంటెత్తున లేస్తున్నడు. అమరులకు అత్యంత అవమానం ఇలాంటి వ్యక్తి చేతిలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాలు నడపడం.
మొన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ అన్నట్టు తెలంగాణ మొత్తం వంద శాతం అభివృద్ధి జరిగిందని చెప్పడం లేదు. అది అసలు ఏ ప్రపంచంలోనూ సాధ్యం కాదు, స్వర్గంలోనూ తారతమ్యాలున్నట్టుగా! అయితే, నిరంతరం ప్రజల బాగోగులు పట్టించుకుంటూ గతానికన్నా మెరుగ్గా, ఎవరూ ఊహించతలపెట్టని గొప్ప గొప్ప సంకల్పాలకు ఆచరణ రూపం ఇవ్వడం మాత్రం కేసీఆర్ పాలనకే సాధ్యమైంది. సాగు, తాగునీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, దళిత బంధు, ఐటీ/ పారిశ్రామిక ప్రగతి, పటిష్టమైన శాంతిభద్రతలు… దేశంలో ఏ రాష్ట్రం కూడా మనకు దరిదాపుల్లో లేదు.
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న వినూత్న విధానాలు రూపుదాల్చాలంటే, అమరుల ఆకాంక్షల అమలు నిర్విఘ్నంగా సాగాలంటే, మరొకసారి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది. కుల పిచ్చితో కొట్టుకుంటున్న కాంగ్రెస్, మత పిచ్చిలో మునిగిపోయిన బీజేపీ రాష్ర్టాన్ని వందేండ్లు వెనక్కు తీసుకుపోగలవు. దార్శనికత చచ్చిపోయి, తెలంగాణపై ప్రేమ పుచ్చిపోయి, కేవలం కేసీఆర్ పట్ల వ్యక్తిగత ద్వేషంతో, ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడం అనే ఏకైక దివాళాకోరు కోరికతో దిక్కూ దివాణం లేకుండా తిరుగుతున్న కొందరు బుద్ధిశీలురు కూడా తెలుసుకోవాల్సిందిదే. నిత్యం అమరులు, ఉద్యమకారులు అని జపించే మీరు వారికి క్షోభను మిగులుస్తున్నరు.
కళ్లు తెరవండి. ఐదారు రాష్ర్టాలు తప్ప నేడు దేశమంతా పేదరికానికి దిగువనే ఉన్నది. మతోద్వేగాలు తప్ప ఏమీ పట్టని పార్టీ ఏలుబడిలో మన దేశం కునారిల్లి పోతున్నది. దేశాన్ని మారుద్దామని కేసీఆర్ పిలుపునిస్తున్నరు. అందిపుచ్చుకొండి. మార్పు అంటే విప్లవం. విప్లవం అంటే అమరులు. అమరులు అంటే ప్రేమ. గుండెనిండా ప్రేమ నింపుకొండి, ప్రజల కోసం పనిచేసేవారికి బాసటగా ఉండండి. రండి అమరులకు నిజమైన నివాళులర్పిద్దాం. జై తెలంగాణ, జై భారత్…
శ్రీశైల్రెడ్డి పంజుగుల 93909 97371