నాయకుడంటే ముందు నడిచేవాడు కాదు, నేనున్నానే అభయం ఇచ్చి తనను నమ్ముకున్న ప్రజలను ముందుకు నడిపించేవాడు. నాయకత్వం అంటే ఒక హోదా కాదు, ఒక బాధ్యత. ఇది ఎవరో ఇచ్చే కిరీటం కాదు. నలుగురి మంచి కోసం తనకు తానుగా ఎంచుకున్న ముండ్లబాట. నిజమైన నాయకుడు అపజయం పాలైతే తనదిగా స్వీకరిస్తాడు. విజయం సాధిస్తే ప్రజలదిగా భావిస్తాడు. ఇదే నికార్సయిన నాయకుడి లక్షణం, లక్ష్యం.
తెలంగాణ కోసం నాడు ఒక్కడిగా కేసీఆర్ ముందుకు నడిచినపుడు ఎన్నో అనుమానాలు, అపోహలు. తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొంటున్న వివక్ష.. తొక్కిపెట్టిన అభివృద్ధి, ఆగమైన సాగు, వలసపోతున్న బతుకులు అన్నీ గమనించిండు. అందుకే రాజకీయ హోదా పరంగా తనకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ ఉద్యమం అనే ముండ్ల కిరీటాన్ని ధరించి పదవులను త్యజించి కేసీఆర్ తానొక్కడుగా ముందుకునడిచిన సందర్భం అద్వితీయం.
ఉద్యమనేతగా నమ్ముకున్న లక్ష్యాన్ని సాధించి, ఆ ఫలితం వృథా కావద్దనే తాపత్రయంతో, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగం కావద్దనే ఆరాటంతో రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను కేసీఆర్ తన భుజాల మీద వేసుకున్నారు. ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచి.. తన ప్రసంగాలతో ఉద్యమస్ఫూర్తిని మేల్కొలిపి, రాష్ట్రం కోసం ముందుకు నడిపించిన మహోన్నతమైన నాయకుడు కేసీఆర్. ఉద్యమానికి ఊపిరి అందించిన ఉస్మానియా గడ్డ మీద తెలంగాణ కోసం నా లాంటి విద్యార్థులను ఎంతోమందిని రాష్ట్రసాధనలో భాగస్వామ్యం చేసిన తీరు చరిత్రాత్మకం. అంతేకాదు, అదే ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం భాగస్వామ్యులను చేసి తెలంగాణ ప్రజల దీవెనలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తీరు అనిర్వచనీయం.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్ల స్వల్పకాలంలోనే పరిపూర్ణం జేసి.. దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిపారు. తత్ఫలితంగా ఉద్యమ సారథి కేసీఆర్ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అయినా, కేసీఆర్లో తనకు తెలియని ఏదో వెలితి. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతున్నా.. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో నెరవేరని ప్రజల ఆకాంక్షల వైపు తన దృష్టిని మళ్లించారు.
గత ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి సాక్షిగా దేశం ఎందుకు అభివృద్ధి సాధించలేక పోయిందన్న ప్రశ్న తన గమ్యాన్ని దేశ ప్రజల ఆకాంక్షల వైపు నడిపించింది. అందుకే తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ నేడు దేశ ప్రజల కోసం బీఆర్ఎస్గా రూపాంతరం చెందేలా చేసింది. దేశ ప్రజల కోసం పొద్దు పొడిచిన బీఆర్ఎస్కు ఒక్కటే ఎజెండా.. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం పాలకులు శ్రమిస్తే ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో దేశ ప్రజలకు చూపెట్టిన నాయకుడు కేసీఆర్. ఎద్దేడిస్తే వ్యవసాయం బాగుపడదు, రైతేడిస్తే రాజ్యం బాగుపడదని నమ్మిన రైతు బిడ్డ కేసీఆర్.
కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ.. మతం ముసుగులో జాతి సంపదను కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం చేసి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్న నాయకులకు కేసీఆర్ చేసే పోరాటం.. ఆయన పడే ఆరాటం అర్థం కాకపోవచ్చు కానీ, దేశ ప్రజలకు తెలుసు. నేడు కేంద్రంతో సహా అనేక రాష్ర్టాలు తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అనుసరిస్తున్నాయి. కారణం ఏమంటే అభివృద్ధికి నూతన ఒరవడిని చూపిన కేసీఆర్ నాయకత్వ పటిమను దేశ ప్రజలు గుర్తించారు కాబట్టి. జనం కోసం నాయకుడు నమ్ముకునేది గుప్పెడు గుండె బలాన్ని. నిస్వార్థంగా పీడిత ప్రజల కోసం ఆ బలాన్ని నమ్ముకొని ప్రజాక్షేత్రంలో నిలిచి కొట్లాడటానికి ముందుకువచ్చినప్పుడు, అదే గుండె బలానికి జనం మద్దతు లభించి నాయకునికి కొండంత బలం అవుతుందని నిరూపించిన నాయకుడు కేసీఆర్. నేడు దేశం కోసం ఆయన ఎత్తిన జెండా దేశ ప్రజల తరఫున కచ్చితంగా గెలిచి నిలబడుతుంది. కొట్లాడటం కేసీఆర్కు కొత్తగాదు, ఆయన ఉద్యమ ప్రస్థానంలో విజయం అనేది లక్ష్యం కాదు, మజిలీ మాత్రమే. అందుకే ఆయన అడుగుజాడల్లో నడిచే ఒక సైనికుడిగా నిన్న రాష్ట్రం కోసం.. నేడు దేశం కోసం ఎందాకైనా నడవడానికి నేను సిద్ధం. ఇది తెలంగాణ ప్రజల తరుపున నాలాంటి వారికి ఎంతో గర్వకారణం కూడా.
దేశ పోరాట చరిత్రలో కేసీఆర్ లాంటి నాయకులు చాలా అరుదు. ప్రజల కోసం.. ప్రజల ఆకాంక్షల కోసం అలుపెరుగని పోరాటమే ఇలాంటి నాయకులకు గొప్పశక్తిని, సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తాయి. దేశ ప్రజల దీవెనలు కేసీఆర్కు ప్రజా జీవితంలో నిండు నూరేండ్లు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తాయి. దేశ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలతో..
బాల్క సుమన్
(వ్యాసకర్త: ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే)