నంది అవార్డుకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టడంపై ఒక వర్గం మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలా స్పందించాలో తెలియక మరో వర్గం మేధావులు మిన్నకుంటున్నారు. పాలకులు తీసుకొచ్చిన మార్పు చరిత్రలో నిలిచిపోతుందని ఇంకో వర్గం మేధావులు సంతోషిస్తున్నారు. వీటిలో ఎవరి వాదనా సరైనది కాదనేది నా భావన.
పాలకులు ముందుగా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలను తీసుకోవాలి. కొన్నిసార్లు వాటికి మినహాయింపులు ఉండవచ్చు. (అలాంటి సమయాల్లో అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలి) అంతేకానీ, ‘నేనే రాజు నేనే మంత్రి’ అని ఒంటెత్తు పోకడలతో దూకుడుగా ముందుకెళ్తే దాని ఫలితం ప్రస్తుతం మంచిగానే ఉండొచ్చు. కానీ, భవిష్యత్తులో పరిణామాలు వేరే విధంగా ఉండవచ్చు. మీరు తీసుకునే నిర్ణయం మీకే కాదు, వ్యవస్థ మొత్తానికి నష్టాన్ని కలిగించవచ్చు. చరిత్రలో మనం ఇలాంటి సంఘటనలను ఎన్నో చూశాం, చూస్తున్నాం, చూడబోతున్నాం కూడా!
ఇక అవార్డు విషయానికి వస్తే, నంది అవార్డు అని ఒక ప్రత్యేక సందర్భంలో దానికి అలా నామకరణం చేశారు. ఆ చరిత్ర ఇప్పుడు అప్రస్తుతం. అందరికీ తెలిసిందే. కానీ, ఆ అవార్డు పేరును ‘గద్దర్ అవార్డు’గా మార్చడమే గందరగోళాన్ని కలిగిస్తున్నది. గద్దర్ ప్రజా గాయకుడు, ప్రజల గొంతుక. అలాంటి గొంతుక మన మధ్య లేకున్నా ప్రతిరోజు మనం తన పేరును తలుచుకునే విధంగా వారి గుర్తులు, ఆలోచనలు ఉండాలి. నేటి యువతరం, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు నిత్యం ఆయన ఆలోచనలను, గుర్తులను మననం చేసుకునేలా ఉండాలి.
ఆయన పేరు ప్రతిరోజు వినబడే విధంగా ఉండాలి. గద్దర్ పేరు చెప్తే ఆయన ఆలోచనలు గుర్తుకొచ్చేలా ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. కానీ, కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం, ఆ ఆలోచనలకు తగ్గట్టుగా లేదు. తీసుకున్న నిర్ణయం, చేసిన మార్పు పెద్దదే కావచ్చు, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ, నిర్ణయం తీసుకునే ముందు ఒక విషయాన్ని ఆలోచించాల్సింది. నంది అవార్డు ఎంతమంది పేద కళాకారులకు అందుతున్నది? మీరు కేవలం పేరును మార్చగలరు కానీ, విధానాలను మార్చలేరు కదా! నంది అవార్డు కోసం జరిగే రాజకీయాలు ఏంటో అందరికీ విదితమే. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
గద్దర్ కనుక బతికి ఉండుంటే, ఈ ప్రతిపాదిత మార్పును కచ్చితంగా వ్యతిరేకించేవారు. గద్దర్ పేరుని చరిత్రలో చిరస్థాయిగా నిలపాలని పాలకులు భావిస్తే, ప్రతిఒక్కరూ తలుచుకునేలా విశ్వవిద్యాలయానికో, ప్రభుత్వ వైద్యశాలకో ఆయన పేరు పెట్టాలి. గద్దర్ తన జీవితాంతం పేదల కోసం పరితపించారు. సామాన్యుల తరఫున న్యాయం కోసం పోరాడారు. అలాంటి వ్యక్తి ఆలోచనావిధానాలు చిరస్థాయిగా నిలవాలనుకుంటే, నూతనంగా నిర్మించబోయే ఏదైనా ప్రభుత్వ భవనానికి గద్దర్ పేరు పెట్టాలి. అది చరిత్రలో మిగిలిపోతుంది!
అంతేకానీ, నంది అవార్డు పేరును తొలగించడం సరైనది కాదు. ఆ అవార్డుకు గద్దర్ పేరు పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. అది గద్దర్ ఆలోచనలకు ఏ విధంగానూ దగ్గరగా లేదు. ఈ నిర్ణయంపై ప్రభుత్వంతో పాటు మేధావులు పునరాలోచన చేయాలి. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి.
– తాళ్లపల్లి సురేందర్ 98497 99893