దేశం అభివృద్ధి చెందిందని ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు గత తొమ్మిదేండ్ల మోదీ పాలనను నిష్పాక్షికంగా పరిశీలిస్తే వైఫల్యాలే తప్ప మరేం కనిపించదు. నిజానికి దేశ ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనాతీరుతో విసిగిపోయి ఉన్న సమయంలో బీజేపీ ఆశాకిరణంలా కనిపించింది. మోదీ నాయకత్వంలో గుజరాత్ అవినీతిరహిత, సమర్థ, అభివృద్ధి మాడల్పై జరిగిన ప్రచార హోరులో ప్రజలు బీజేపీపై అనేక ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు. సామాజిక, ఆర్థికరంగాల్లో భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశించారు. అందుకే, రెండుసార్లు అధికారం కట్టబెట్టారు. కానీ బీజేపీ పాలనలో ప్రజల బతుకులు ‘పెనంపై నుంచి పొయ్యిలోకి ’ జారిన చందంగా తయారయ్యాయి.
మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారారు. కార్పొరేటు శక్తులకే ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లభించింది. వారికే ప్రపంచ కుబేరుల స్థానం దక్కింది. హిందుత్వవాదం వెలుగులోకి వచ్చి పరమత ద్వేషం పెరిగింది. మైనారిటీలపై దాడులు పెరిగాయి. రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, ఆర్బీఐ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు తమ స్వేచ్ఛను, విశ్వసనీయతను కోల్పోయాయి. అవి ప్రభుత్వ జేబు సంస్థలుగా మారాయని విమర్శలు వస్తున్నాయి.
దేశం అన్నిరంగాల్లో అధోగతి పాలైంది. ప్రజాస్వామ్య విలువలు, మీడియా స్వేచ్ఛ నశించాయి. దేశ వ్యవసాయ, పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి రంగాలు గతం కంటే గణనీయంగా క్షీణించాయి. ఎగుమతులు పడిపోయి, దిగుమతులు మరింత పెరిగాయి. రాజ్యాంగం తన ప్రజలకు ఇచ్చిన పౌర, మానవ హక్కులపై దాడులు పెరిగాయి. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు మరింత పెరిగాయి. ప్రజా సంక్షేమం అడుగంటింది. నిరుద్యోగం, అవినీతి తారాస్థాయికి చేరాయి.
కాంగ్రెస్ హయాంలో స్విట్జర్లాండ్, సింగపూర్ మొదలైన విదేశీ బ్యాంకుల్లో అవినీతిపరులు లక్షల కోట్లు దాచుకున్నారని మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు అధికారం ఇస్తే దాన్ని వంద రోజుల్లో వెనక్కి తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని వాగ్దానం చేశారు. కానీ, ఈ వాగ్దానం నేటికీ నెరవేరలేదు. కనీసం వారి పేర్లను కూడా అధికారికంగా, బహిర్గతం చేయలేదు. కొందరి పేర్లు వెలువడ్డా, వారిలో ఒక్కరిని కూడా మన దేశానికి రప్పించిందీ లేదు, వారిని చట్టప్రకారం శిక్షించిందీ లేదు. పైగా గతంలో కంటే విదేశీ బ్యాంకుల్లో హవాలా మార్గంలో అవినీతి సొమ్ము మరింత చేరిందని నివేదికలు చెప్తున్నాయి.
అలాగే 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం కల్పిస్తామన్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఆ లెక్కన ఇప్పటికే 18 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ వీటిలో ఏ ఒకటీ నెరవేరలేదన్నది వాస్తవం. కొత్త ఉద్యోగాలు రాకపోగా, ప్రభుత్వరంగసంస్థలను ఇష్టారీతిన కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుండటంతో ఉన్న ఉద్యోగాలకే ఎసరొచ్చింది.
మోదీ ప్రతి ఒక్కరికీ ఉండటానికి ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. కానీ నేటికీ ప్రతి ఇద్దరిలో ఒకరికి సొంత గూడు లేదు. స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చి విస్తరింపజేస్తామన్నారు. కానీ రోజుకు 270 చొప్పున, ఇప్పటివరకు 8 లక్షల కంపెనీలు మూతపడ్డాయి. దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతామన్నారు, ఫలితాలు చూస్తే బానిసత్వ సూచిలో ప్రపంచంలోనే భారత్ టాప్ ర్యాంకులో ఉన్నది. మోదీ పాలన అబద్ధాలకు, దోపిడికి, అవినీతికి, అణచివేతకు కేరాఫ్ అడ్రస్గా మారిందనటంలో సందేహం లేదు.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం… 14 సూచీల్లో భారత్ అత్యంత దారుణమైన స్థానాల్లో నిలిచింది. ప్రపంచ ఆకలి సూచీలో 107వ స్థానం, హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్లో 146, హ్యూమన్ ఫ్రీడం ఇండెక్స్లో 150, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 139, పర్యావరణ పరిరక్షణ సూచీలో 180, ప్రపంచ లింగ సమానత్వ సూచీలో 135, ఈ.ఐ.యూ.డెమోక్రసీ ఇండెక్స్లో 53, హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో 90, మానవాభివృద్ధి సూచీలో 132, పత్రికాస్వేచ్ఛ సూచీలో 142, పింఛన్ సూచీలో 41, అవినీతి సూచీలో 85, దయనీయ సూచీలో 103, బానిసత్వ సూచీలో 1 ఇలా.. దాదాపు అన్నిరంగాల్లో భారత్ దిగువ స్థాయిలో నిలిచింది.
మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రాథమిక సమస్యలు పరిష్కారం కాలేదు. దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయి. వారి పాలనను ప్రశ్నించినవారిని అక్రమ కేసుల్లో ఇరికించారు. జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులపై ‘నాన్ బెయిలబుల్ సెక్షన్లు’ విధించారు. వారిని నెలల తరబడి జైళ్లల్లో నిర్బంధించారు. ప్రభుత్వ పనితీరును విమర్శించిన పేదల ఇండ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇతర మతస్థులపై భౌతికదాడులు పెరిగాయి.
మణిపూర్ నిత్య అగ్నిహోత్రమై తగులబడుతున్నది. విదేశీ టూర్లు, ఎన్నికల ప్రచారాలకు సమయం ఉంటుంది. బాధితులను పరామర్శించటానికి మా త్రం మన ప్రధానికి సమయం దొరకటం లేదు. ప్రధాని దేశ సమైక్య భావనకు తూట్లు పొడిచాడు. ‘మేక్ ఇన్ ఇండియా’, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, స్పెషల్ బీమా మొదలైన పెద్దపెద్ద మాటలు చెప్పారు. బూటకపు నినాదాలు చేశారు. ఆర్థిక నేరగాళ్లను అక్కున చేర్చుకున్నారు. వారిపై చర్య లు శూన్యం. బ్యాంకు రుణాల ఎగవేతదారుల, అసలు, వడ్డీ కలిపి లక్షల కోట్లను మాఫీ చేశారు. పైగా వారికే కొత్త అప్పులు ఇవ్వాలని ఆర్బీఐపై ఒత్తిడి పెంచారు.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల మంటలతో దేశాన్ని అధోగతి పట్టించారు. రాజ్యాంగ హామీని ఉల్లంఘించి కశ్మీర్ విభజన, పౌరసత్వ చట్ట సవరణ, కార్మిక చట్టాల సవరణ, రైతు వ్యతిరేక చీకటి చట్టాలతో పాటు, నిన్నమొన్నటి రాజదండం వరకు అన్నీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలే. ‘గోరక్షణ’, ‘ఘర్ వాపసీ’ ‘లవ్ జిహాద్’ అంటూ మైనారిటీ, దళిత, ఆదివాసీ, మహిళలను వేధించారు.
కార్పొరేట్ వ్యాపారవర్గాలు, ఇతరుల నుంచి ఇతర పార్టీల కంటే అధికంగా రూ.10 వేల కోట్లు బీజేపీకి విరాళాలు అందాయి. వాటితో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అప్రజాస్వామికంగా ఎనిమిది బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేశారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలే మోదీకి అ త్యంత సన్నిహితులు. వారి ముం దు సాధారణ ప్రజలు, రైతు లు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు అందరూ బలాదూరే. బీజేపీ పాలనలో సమాఖ్య స్ఫూర్తికి ఘోరంగా విఘాతం కలిగింది. విపక్ష రాష్ర్టాల్లో గవర్నర్ వ్యవస్థ అనవసర జోక్యం విమర్శలకు నిలయమైంది. మొత్తం మీద మోదీ మార్క్ పరిపాలన తొమ్మిదేండ్లలో ప్రజల ఆశలను అడియాసలు చేసింది. నమ్మకాలను వమ్ము చేసింది.
-డాక్టర్ కోలాహలం రామ్కిశోర్
98493 28496