పాత పార్లమెంటు భవనంపై ఉగ్రదాడి జరిగిన రోజే కొత్త పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. పార్లమెంటులో లోక్సభ సమావేశమందిరంలో ఆగంతకులు జొరబడి రంగువాయువులు వెదజల్లుతూ బీభత్సం సృష్టించడం టీవీ ల్లో చూసిన దేశం ఉలిక్కిపడింది. వెలుపల మరి కొందరు అలాంటి చర్యకే ఒడిగట్టడం మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. ఆగంతకులు ఉపయోగించిన రంగు వాయువులు ప్రమాదకరమైనవి కావని తేలడం కొంత ఉపశమనం కలిగించింది. వారిలో ఒకరు బీజేపీ ఎంపీ జారీచేసిన సందర్శకుల పాస్తో పార్లమెంటు ప్రాంగణంలోకి అడుగుపెట్టడం గమనార్హం. పార్లమెంటు సభ్యులకు హాని తలపెట్టడం వారి ఉద్దేశం కాదని ప్రమాదరహిత వాయువులు అని స్పష్టం చేస్తున్నప్పటికీ అసలు ఉద్దేశం ఏమై ఉంటుందనేది ఇంకా తెలియరాలేదు.
పాత పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు, ఇప్పుడు నూతన పార్లమెంటుపై దాడి జరిగినప్పుడూ రెండు సందర్భాల్లోనూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండటం కాకతాళీయం కావచ్చు. పరిశీలకుల దృష్టికి తప్పనిసరిగా వచ్చే అంశాల్లో ఇది కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. 2001లో ఉగ్రవాదులు దాడి చేయగా భద్రతా సిబ్బంది ప్రాణాలకు తెగించి వారిని మట్టుబెట్టడం దేశ ప్రజలకు ఇంకా గుర్తుంది. వారి అమరత్వాన్ని గుర్తుచేసుకోవాల్సిన రోజే మరోదాడి జరగడం కలతకు గురిచేసే అంశమే. నాటి దాడి పర్యవసానంగా పార్లమెంటు భద్రతను కట్టుదిట్టం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అప్పటికీ, ఇప్పటికీ భద్రతా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ 2016లో ఓ దుండగుడు నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులోకి దూసుకుపోవడం సంచలనం కలిగించింది. ఉభయసభల సమావేశాలు ఇటీవల కొత్తగా కట్టిన భవనంలోకి మారిపోయాయి.
సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా పార్లమెంటులోకి ఈగ కూడా ప్రవేశించదని సామాన్యులు అనుకునే రోజులివి. రాజకీయ ప్రముఖులపై, అధికార ప్రాంగణాలపై ఇదివరకు జరిగిన దాడుల దృష్ట్యా భద్రతాపరంగా పకడ్బందీ ఏర్పాట్లు ఉండే ఉంటాయని ఎవరైనా ఆశిస్తారు. గత దాడితో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ భద్రత ఉంటుందని నమ్మే నూతన పార్లమెంటు వద్ద దుండగులు స్వైరవిహారం చేయడం ఎలా సాధ్యమైంది? వారు వెంట తెచ్చుకున్నవి ప్రమాదరహితమైన రంగు వాయువులే కావచ్చు. వాటి స్థానంలో విషవాయువుతోనో, మారణాయుధాలతోనో లోపలికి వెళ్తే ఏం జరిగేది? అనేవి ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న కీలక ప్రశ్నలు. దాడిచేసిన వారి ఉద్దేశం ఏమై ఉంటుందనేది ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావచ్చు. ఎలా చూసినా ఈ ఉదంతంతో పార్లమెంటు భద్రతావ్యవస్థ సామర్థ్యం ప్రశ్నార్థకమైందని చెప్పక తప్పదు. సభ భద్రత బాధ్యత తనదే కనుక తానే స్వయంగా దీనిపై లోతైన దర్యా ప్తు జరిపిస్తానని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. లోక్సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో దాడి జరిగిందన్నది ఇక్కడ గుర్తుంచుకోవాలి. దేశ రాజకీయవ్యవస్థకు గుండెకాయ వంటి పార్లమెంటు భవనం భద్రతను పూర్తి కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.