భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో వెలుగులు పంచి తరతరాల జాతిజనులు రుణపడేలా చేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. 1896 మే 28న పాలమూరు జిల్లా బోరవెల్లిలో ఆయన జన్మించారు. 9వ తరగతిలో ఉన్నప్పుడే సంస్కృత విద్వాంసులు వెల్లాల శంకరశాస్త్రి దగ్గర రఘువంశము, కుమారసంభవము, భారత చంపూ, కిరాతార్జునీయం, లఘుసిద్ధాంత కౌముది వంటి గ్రంథాలను అధ్యయనం చేశారు.
నిజాం కళాశాలలో ఎఫ్.ఎ.ఇంటర్మీడియట్, బీఏ పూర్తిచేశారు. తర్వాత న్యాయ శాస్ర్తాన్ని అధ్యయనం చేశారు. విద్యార్థి దశలోనే మాతృసేవ, పినాకిని, కళ వంటి పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వేదము వేంకటరాయశాస్త్రి దగ్గర సంస్కృత భాషాసాహిత్యాన్ని అధ్యయనం చేశారు. మానవల్లి రామకృష్ణ కవి సూచనతో ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ప్రతాపరెడ్డి సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో లోతైన ప్రజ్ఞను సముపార్జించారు. తర్వాతకాలంలో ఆయన తెలంగాణ సాంస్కృతిక అభ్యున్నతికి చేసిన కృషికి ఆ ప్రజ్ఞ ఎంతో దోహదం చేసింది.
ప్రతాపరెడ్డికి పలు విషయాలపై పరిశోధనాసక్తి కలగడానికి నాటి పరిస్థితులే ప్రోద్బలం ఇచ్చాయి. తెలంగాణలో కవులెక్కడున్నరన్న కువిమర్శకులకు దీటైన సమాధానం చెప్పడానికి ఆయన చేసిన పరిశోధనాకృషి నుంచి ఉద్భవించిందే గోలకొండ కవుల సంచిక. గోలకొండ పత్రిక తొలి సంపాదకీయంలో భాషాసేవతో పాటు జాతి, కుల వివక్ష లేక నిష్పక్షపాతంగా సర్వ విషయ సత్వరాభివృద్ధికి పాటుపడుతామని లక్ష్య ప్రకటన చేశారు. ప్రతాపరెడ్డికి అప్పటి కొత్వాల్ రాజబహద్దూర్ వెంకట్రామారెడ్డి అండగా నిలిచారు.
పత్రిక సంపాదకునిగా ఆ పత్రికకు ప్రూఫ్ రీడర్గా అన్నీ తానై ‘గోలకొండ’ను నడుపుతూనే కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, విమర్శలు.. ఒక్కటేమిటి అన్ని ప్రక్రియల్లో రచనలు చేశారు. ‘హంవీరసంభవము’ పేరుతో సోమనాథ దేవాలయ విధ్వంసకుడు మహమూద్ ఘజనిపై 135 పంక్తుల గీతమాలిక రచించారు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై చక్కని పద్యాలు రాశారు. ‘పరుసవేది’, ‘ధర్మశాల’, ‘మిత్రుడా’, తెలుగువాడు’ వంటి ఖండకావ్యాలు రచించారు.
‘శుద్ధాంతకాంత’ అనే నవల, ‘ఉచ్ఛల విషాదము’ ‘భక్తతుకారాం’ నాటకాలు రాశారు. ‘హైందవధర్మవీరులు’, ‘రామాయణ విశేషాలు’, ‘హిందువుల పండుగలు’, ‘మొగలాయి కథలు’, ‘ప్రతాపరెడ్డి కథలు’ ఇలా ఎన్నో రచనలు చెప్పుకోదగినవి. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ ప్రతాపరెడ్డికి అపారమైన గౌరవం, ఆదరణ తెచ్చిపెట్టినది. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి తెలుగువారికి లభించిన తొలి పురస్కారం ఈ గ్రంథానికి దక్కింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ గ్రంథాన్ని ప్రచురించింది. తన జీవితాన్ని, తన కృషిని తన సందేశంగా మిగిల్చి 1953 ఆగస్టు 25న కన్ను మూశారు.
(వ్యాసకర్త: ప్రధానకార్యదర్శి, తెలంగాణ సారస్వత పరిషత్తు)