మాధ్యమాల్లో విలువల పతనానికి లాభాపేక్ష గల బాధ్యతారహిత పెట్టుబడిదారీ మీడియా వ్యవస్థ కారణం. పఠన, శ్రవణ మాధ్యమాల కంటే దృశ్య మాధ్యమాల ప్రభావం తీవ్రమైనది. సీరియళ్లు చూసేది ఎక్కువగా స్త్రీలే. ఇవి వారి మెదళ్లను పాడుచేసి, మాజాన్నిఅమానవీయం చేస్తున్నాయి. సీరియళ్ల కథనాలు, స్త్రీ పాత్రల చిత్రీకరణ అసహజంగా, మానవత్వ విచ్ఛిన్నంగా ఉంటున్నాయి. సమాజంలోని నైతిక విలువల ప్రభావం సీరియళ్లలో, సీరియళ్ల ప్రభావం సమాజంలో పరస్పరం ప్రతిఫలిస్తున్నాయి.
టీవీసీరియళ్లన్నీ కల్పనలే. వాటి లక్ష్యం వినోదమే. ఈ వినోదపు తీరుతెన్నులు, సామాజిక ప్రయోజకత్వం, ప్రత్యేకించి స్త్రీలపై వీటి ప్రభావం రచయిత అవగాహనపై ఆధారపడి ఉంటాయి. శాస్త్రీయ దృక్పథం, సామాజిక స్పృహ బాధ్యతలు లేని రచయితలు సమాజ వినాశక రచనలు చేస్తారు. నిర్మాతలు వాటిని చిత్రీకరిస్తారు. దర్శకులు సహకరిస్తారు. పౌరాణిక కవులు ఒక పాత్రలో ఒక గుణాన్ని ఎత్తిచూపడానికి ఆ పాత్ర మానవత్వాన్నే హత్య చేస్తారు. పరశురాముని పితృభక్తిలో ఆయన మాతృప్రేమను, మానవత్వాన్ని మంటకలిపారు. సీరియళ్ల పాత్రల చిత్రీకరణలోనూ ఇదే జరుగుతున్నది. పదిహేనేండ్ల కిందట ఒక మహిళా అధ్యయన సంస్థ నివేదిక ప్రకారం.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా కొందరు స్త్రీలు క్రమం తప్పక సీరియళ్లు చూస్తున్నారు. దీంతో వారి ప్రవర్తనలో ఊహించని మార్పు వస్తున్నది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులతో సంబంధాల్లో గణనీయమైన మార్పు వస్తున్నది. సీరియళ్ల ప్రభావంతో తోటి స్త్రీలపై నమ్మకం పోతున్నది. వారితో మనసువిప్పి మాట్లాడే అలవాటు, స్నేహభావం మాయమౌతున్నాయి. సీరియళ్లలోని ఆడంబరతలతో తమ స్థితిగతులను పోల్చుకోవటంతో న్యూనతాభావం చోటుచేసుకుంటున్నది.
ఇదింకా శృతిమించి మానసిక రోగులుగా మారుతున్నారు. సీరియళ్లతో ప్రయోజనం లేదని, అన్నీ నష్టాలేనని వీక్షకులు గమనించాలి. 40-60 ఏండ్లవారు సీరియళ్ల పాత్రల్లో దూరిపోతున్నారు. ప్రమాదకర మానసిక స్థితికి చేరుతున్నారు. సీరియళ్లలో స్త్రీని స్త్రీకి శత్రువుగా చూపిస్తున్నారు. అత్తా- కోడళ్లు, తోడుకోడళ్లు, అక్కా- చెల్లెళ్లు, ఆడపడుచులు, తల్లీ బిడ్డలు అనుక్షణం కొట్లాడుకుంటుంటారు. కుట్రలు పన్నుతుంటారు. పరపతి, ఆస్తి, అధికారం, ఉద్యోగం ఉన్న మగాడిని, పెండ్లయినవాడైనా సరే.. వలలో వేసుకోడానికి చేయరాని పనులు చేస్తారు. ఇక మగాడికైతే సాధారణంగా ఇద్దరు భార్యలుంటారు. భార్య లేదా అమ్మాయి అమ్మ వంత పాడతారు. ఆ మగాడి తప్పేమి లేనట్లు, భార్యలతో భర్త తెగ బాధపడిపోతున్నట్లు, తీవ్ర కష్టనష్టాలు భరిస్తున్నట్లు చూపిస్తారు. మరోవైపు కొందరు ఏడ్వటానికే పుట్టినట్లు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఎంత పేరు ప్రఖ్యాతులున్నా అవివాహిత స్త్రీలను ఉన్నతంగా, ఆదర్శంగా చూపరు. నీచులుగా, మగాళ్లను మోసగించేవాళ్లుగా చిత్రిస్తారు. ఇవన్నీ వాస్తవ విరుద్ధాలు. నిజ జీవితానికి దూరమైనవి.
సీరియళ్లన్నింటిలో స్త్రీలకు సౌందర్య పిచ్చి ఉన్నట్లు చూపుతారు. 24 గంటలూ అలంకరించుకునే ఉంటారు. కట్టు- బొట్టు, అలంకరణ, ఆహార్యం వికారంగా, వెటకారంగా ఉంటాయి. అలాంటి ఆభరణాలు, అలంకారాల్లేని బతుకు సాధారణ స్త్రీలకు దండగనిపిస్తుంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు కూడా జుగుప్సాకర అలంకరణలతో ఉంటారు. స్త్రీలంటే అందంగా ఉండాలనే భావన కల్పిస్తారు. వారి శరీర సౌందర్యానికే కానీ, వృత్తి, శక్తిసామర్థ్యాలు, వ్యక్తిత్వాలకు విలువ ఉన్నట్లు చూపరు. చదువుకున్న పట్టణ ప్రాంత కోడలు గ్రామీణ ప్రాంత తోడి కోడలిని రాచిరంపాన పెడుతుంది. సీరియళ్లలో శారీరక శ్రమకు విలువ ఉండదు. శ్రమ సంస్కృతిని హీనంగా చూపిస్తారు. చదువుకున్న స్త్రీలను సంస్కారహీనులుగా, దుర్మార్గురాళ్లుగా చూపిస్తారు. జాతీయ భాష హిందీతో సహా ప్రాంతీయ భాషల సీరియళ్లన్నీ ఒకేలా ఉంటాయి. పురుషులంటే.. మద్యపాన ప్రియులు, స్త్రీ లోలురని చూపుతారు.
స్త్రీలు వాళ్లను సహిస్తారు. భరిస్తారు. యువ పాత్రలన్నీ గడ్డాలతో ఉంటాయి. వీటిని చూసేనేమో నేటి యువకులు పెండ్లిలో కూడా గడ్డం తీయటం లేదు. తప్పనిసరైతే గాని సీరియళ్లలో కామన్మ్యాన్ కనపడడు. అంతా ధనవంతులే. ఇండ్లన్నీ రాజ భవనాలే. ఎక్కడా అనుబంధాలకు తావుండదు. మానవ సంబంధాలను అమానవీకరిస్తారు. అడుగడుగునా లింగవివక్ష కన్పిస్తుంది. మోసాలు, హత్యలు, క్షుద్రపూజలు అట్టహాసంగా జరుగుతుంటాయి. పూజలు, ఆచారాలు, యజ్ఞయాగాలు, క్రతువులు, పుట్టినరోజులు, నామకరణాలు, అక్షరాభ్యాసాలు, కర్మకాండలు ఆడంబరంగా చేస్తారు. సీరియళ్లతో మనం నేర్చుకునేది.. అలవికాని ఆడంబరాలు, కుట్రలు, కుహకాలు, మూఢమైన క్షుద్రపూజలు మాత్రమే. టీవీ సీరియళ్లన్నింటిలో మానవీయత, శాస్త్రీయత ఎక్కడా ఆవగింజంతైనా ఉండదు.
సీరియళ్లలో డైలాగులు నిదానంగా పట్టి పట్టి పలుకుతారు. సాధారణంగా ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు మాట్లాడరు. ఈ లక్షణాలు మంచివే. ఐతే కెమెరా ఒకరిని మార్చి ఒకరిపై నిలిపి వెలుతురు పెంచి, మార్చి మార్చి, పదేపదే చూపుతూ వింతైన భయానక శబ్దాలతో ప్రసారం చేస్తారు. అరగంట సీరియల్లో ఐదు నిమిషాల కథ కూడా నడవదు. కాలమంతా ప్రకటనలతో, జరిగిన కథతో, జరగబోయే కథతో గడిచిపోతుంది. ఒక్కో సీరియల్ ఏండ్ల తరబడి సాగుతుంది. వీక్షకుల కాలం వృథా అవుతుంది. రేపటి కథలో ఏమౌతుందోనన్న ఒత్తిళ్లకు వీక్షకులు లోనవుతుంటారు. సీరియళ్ల నిర్మాతలు మాత్రం విపరీత లాభార్జన పొందుతుంటారు. మంచి సీరియళ్లు ఉండవు కానీ కొన్నింటిలో మంచి అంశాలు ఉంటాయి. ఆ మంచి అంశాలు ఈ చెత్తా చెదారం మధ్య ఎక్కడో కనిపించకుండా పోతాయి.
సమాజంలో సగభాగమైన స్త్రీలకు వ్యాపకం, ప్రత్యామ్నాయ పనులు ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. స్త్రీలు పాల్గొంటేనే ఏ పనైనా విజయవంతమౌతుంది. సీరియళ్ల నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉంది. వీటిని చూడకపోవడమే పరిష్కారం. ప్రజల్లో సామాజిక స్పృహ, చైతన్యం పెంచటానికి పౌరసంఘాలు కృషిచేయాలి. వీక్షకులు తమను తాము సంస్కరించుకోవాలి. మంచీ చెడుల అవగాహనకు రావాలి. సీరియళ్లను స్త్రీలు వినోదాత్మకంగా గాక విమర్శనాత్మకంగా చూడాలి. స్త్రీ వ్యతిరేక సీరియళ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఇందుకు మహిళా సంఘాలు చొరవ తీసుకోవాలి. విరామ సమాజం హానికరం. సీరియళ్లు విరామ సమాజపు ఫలితాలు. సమాజంలో సగమైన స్త్రీలు సీరియళ్ల మత్తులో మునిగితే సామాజిక ప్రగతి కుంటుపడి సమాజం వెనకకు నడుస్తుంది.
(వ్యాసకర్త: సంగిరెడ్డి హనుమంతరెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి)