చల్మెడ దవాఖాన మా ఇంటి కాన్నుంచి దగ్గెర దగ్గెర పది, పదిహేను కిలోమీటర్లుంటది. వారానికి మూడు సార్ల, దినం తప్పిచ్చి దినం ఆ దవాఖానకు వోతె నాలుగు గంటలు మంచమ్మీద పండుకోవెడ్తరు. ఆ నాలుగు గంటలు రౌతం నా పెయ్యిలకెల్లి- మిషిన్లకు, మిషిన్లకెల్లి- పెయ్యిలకు గిరగిరా తిరుగుతనే ఉంటది. ఆ రౌతం అట్లా అటూఇటు తిరుగుతున్నంత సేపు వయస్సు మీద పడ్డ అవ్వ, నా భార్య, ఇద్దరాడివిల్లలు కండ్లముందే కదలాడ్తరు. ‘ఎవనికేం అన్యాయం చేసిన్రా దేవుడా, నాకే ఎందుకొచ్చిందిరా ఈ పాడురోగం పాడుగాను’ అని అనుకుంటే.. కండ్ల పొంటి నీళ్లు వటవటా రాలుతనే ఉంటయి. నాది ఆరేండ్ల గోస. మొదటి మూడేండ్లు వారానికి రెండుసార్ల చేసిర్రు డయాలసిస్, ఇప్పుడు వారానికి మూడుసార్లయితున్నది.
నా పేరు సింగసాని సంతోష్, అవ్వ పేరు లచ్చవ్వ, బాపు లచ్చయ్య. ముదిరాజ్ బిడ్డను. పెండ్లి కాకముందు మూడేండ్లు దుబాయి వొయిన. అక్కడ మెకానిక్ పన్జేసేది. పెండ్లి చేసుకున్న తర్వాత అటుమొకాన పోవుడు బంజేసి ఇక్కన్నే పన్జూసుకున్న. నా పుట్టినూరు చొప్పదండి మండలం రాగంపేట. మా అత్తగారూరు మానకొండూరు, కన్నారానికి ఆనుకునే ఉంటది. మా ఊళ్లె చేసేందుకు పని కరువైతే మానకొండూరుకు ఇల్లిటమొచ్చిన. వచ్చి పద్దెనిమిదేండ్లయితున్నది. మానకొండూర్లనే పెద్ద చెర్వుంటది. ఆ చెర్ల చాపల్ వట్టుడు నేన్జేసే పని. మామిడి, బత్తాయి, నిమ్మ తోటలు ఇట్లా.. ఏ సీజనుకు, ఆ సీజన్ తోటలు గుత్తకు వడ్తా. ఏం పని లేనప్పుడు ఆటో కూడా నడుపుత. పెండ్లాం పిల్లలతో మంచిగనే నడుస్తున్న జీవితం.. ఉన్నట్టుండి కిందామీదైంది. పెయ్యంతా నొప్పులే, వారం రోజులు మంచం మీంచి లెవ్వలె. కన్నారం దవాఖానకు వోతె అన్ని పరీక్షలు చేసిర్రు. ఏమొచ్చిందో గనీ పట్నం పోవాల్నన్నర్లు.
ఓ రోజు ఎగిలివారంగ పట్నం బస్సెక్కితె నిమ్స్ దవాఖానకు చేరేసరికి సరిగ్గా తొమ్మిదైంది. నిమ్స్ల చూసే డాక్టర్లకు ఉన్నదున్నట్టు చెప్పిన. వాళ్లుగూడ పరీక్షలు రాసిర్రు. ఆ పరీక్షల రిపోర్టు వచ్చేసరికి మూడ్నాలుగు దినాలైంది. ఆ మూడ్నాలుగు దినాలు దవాఖాన్లనే తిన్నం, అక్కన్నే నడుమాల్సినం. ఓ రోజు పొద్దున్నె పరీక్షల రిపోర్టు చూసిన డాక్టర్లు ‘బాబూ.. నీ రెండు కిడ్నీలు కరాబైనయన్నరు. ఏంజేయాల్నో అర్థం కాలె. ఓ దిక్కు నన్ను కన్న తల్లి, ఇంకో దిక్కు కట్టుకున్న పెండ్లాం శోకం పెడ్తనే ఉన్నరు. పట్టుమని పదేండ్లు కూడా దాటని పసిపోరగాండ్లు.. యాదికొచ్చి నాగ్గూడ పెయ్యంత సల్లసెమ్టలు పుట్టినయి.
నా బాధ సూడలేక నాకు మళ్లోసారి జన్మనిచ్చేందుకు ముందటవడ్డది మా అవ్వ లచ్చవ్వ. నాకు కిడ్నీ ఇచ్చి కాపాడుకునెటందుకు ధైర్నం చేసింది. మా అమ్మగ్గూడ పరీక్షలు చేసిర్రు డాక్టర్లు. ఆమె అన్ని పరీక్షల్ల పాసైంది. మూణ్నెల్లు నిమ్స్ దవాఖాన్లనే ఉన్నం. ఆపరేషన్కు తయారుగుండుర్రని చెప్పిర్రు డాక్టర్లు. మా లచ్చవ్వ మాత్రం ఎన్కకు వోలె. కనీ ఏం లాభం? నాకు చేసిన పరీక్షలు ఫెయిలైనయి. ‘నీ గుండె వీకుంది, నీ కిడ్నీకి ఆపరేషన్జేత్తె నువ్వు తట్టుకోవని చెప్పిర్రు డాక్టర్లు. అప్పట్నుంచి నాకు డయాలసిసే దిక్కయింది.
ఓ రోజు ప్రైవేటు దవాఖాన్ల డయాలసిస్ చేసుకున్న ఓ పాత రోగి కలిసిండు. ఒక్కసారి డయాలసిస్ చేసుకుంటే ప్రైవేట్ దవాఖాన్ల ఇరువై ఐదు వందలైతయని చెప్పిండు. అసొంటిది నెలకు ఎనిమిది సార్ల చేసుకుంటే రూ.20 వేల కర్సు డయాలసిస్కే అయితయని చెప్పిండు. ఆటో నడుపుకొని బతికేటోడ్ని. అంత కర్సు పెట్టుడు నాతోని కాదు, దానికన్నా ఏ చెట్టుకో ఉరేసుకొని సచ్చింది నయమనుకున్న.
అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిండో దేవునోలె ఓ డాక్టర్ సాబ్ ‘చల్మెడ దవాఖాన ప్రైవేటే అయినా ఫిరీగా డయాలసిస్ చేస్తరు, గతంల ఆరోగ్యశ్రీల డయాలసిస్ ఫిరీగ చేయకపోతుండె, తెలంగాణ వచ్చినంకనే ఆరోగ్యశ్రీ కింద ఫిరీగ డయాలసిస్ చేస్తున్నరు’ అని అడ్రస్ చెప్పిండు. పానం లేసొచ్చినట్లయి ఆడికి పొయిన. ఆరేండ్ల సంది ఇప్పటిదాంక డయాలసిస్ నడుస్తనే ఉన్నది.
డయాలసిస్ చేసుకుంటున్న వ్యక్తి ఉన్నడా అంటే ఉన్నట్టె లెక్క! డయాలసిస్ చేసుకున్న రోజు పెయ్యంత అగ్గి దుంకినట్టె అయితది. ఒక్క రోజు డయాలసిస్ ఆలస్యమైతే తిన్న అన్నం అర్గది. కాల్దీసి కాలేస్తే ఇర్గ మొసొస్తది. అయినా మంచిదే.. పోరగాండ్లు పెద్దగయ్యెదాంక బతికినా సాలనుకున్న. చల్మెడ దవాఖాన్ల నాతోని వంద మందికి పైనే డయాలసిస్ చేసుకుంటరు. పతొక్కలు డయాలసిస్ చేసుకున్నప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్నే యాజ్జేసుకుంటరు. ‘ప్రభుత్వం మనకు డయాలసిస్ ఫిరీగ చేయకపోతె మన బతుకేం గావాలె’ అని పట్నం వైపు చేతులెత్తి మొక్కుతరు. ఫిరీగ డయాలసిస్ చేసుడే కాదు, చేసుకున్నోల్లందరికీ ఇంటికి వోంగ తొవ్వ కర్సుల కింద వంద రూపాలు గూడ చేతిల వెడ్తున్నరు బిడ్డా! సర్కారు మనసు ఎంత గొప్పది! ఆరేండ్ల నుంచి ఇప్పటిదాంక డయాలసిస్ ఫిరీగా చేయకపోతె నేనేడ బతుకుతు? నా ఇద్దరాడివిల్లల మొకాలు చూసినప్పుడల్లా కేసీఆర్ సార్ కండ్లముందల దీవించినట్టు కనవడ్తడు. ఆరేండ్లుగా ఈ భూమ్మీద నాకింకా నూకలు బాకీ ఉన్నయంటే.. నా పెండ్లాం పిల్లల్ని కంటినిండా చూస్క బత్కుతున్ననంటే అంతా కేసీఆర్ సార్ పుణ్యమే.