ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీది బాధ్యతాయుతమైన పాత్ర. ఎక్కడైనా ప్రజా సంక్షేమాన్ని మాత్రమే ప్రతిపక్షం కాంక్షించాలి. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూనే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. రాష్ట్రంలో, దేశంలో దశాబ్దాల కాలంగా ఎంతోమంది ప్రతిపక్ష నాయకులుగా ప్రజాభిమానానికి పాత్రులయ్యారు. అధికారం ఉన్నా, లేకున్నా నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు ఎందరో రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేని ప్రతిపక్ష పార్టీలు ప్రగతి విధ్వంసక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా విఫలమయ్యాయి. అత్యంత విలువైన శాసనసభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏనాడూ ప్రతిపక్షాలు ప్రయత్నించలేదు. అనవసర వాకౌట్లు అడ్డగోలు వాదనలు, అసత్య ఆరోపణలతో సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు ప్రజలను నివ్వెరపరుస్తున్నది. సహేతుక విమర్శలు, నిర్మాణాత్మక సలహాలు ప్రతిపక్షాల నోట ఏనాడూ వినిపించవు. గతంలో ఎంతోమంది ఉద్ధండుల ప్రతిభాపాటవాలతో కాంతులీనిన ప్రతిపక్షనేత స్థానం వికృత విన్యాసాలతో మసకబారుతున్నది.
కరోనా కాటుకు రాష్ట్ర ప్రజలు విలవిలలాడుతుంటే ప్రతిపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసం పాకులాడుతున్నాయి. భారత రాజకీయ చరిత్రలో ఎవ్వరూ చేయనివిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమలు, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛన్దారులకు పీఆర్సీ, పదవీవిరమణ వయోపరిమితి 61 ఏండ్లకు పెంచి తక్షణమే వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల కోసం శ్రమిస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందనటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరాల జల్లే నిదర్శనం. ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంతో 9,17,097 మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాయి. దీంతోపాటు అర్హులైన ఉద్యోగులకూ పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ప్రతిపక్షాలు భరించలేక రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నాయి. వీటితోపాటు సామాజిక భద్రతా పింఛన్ల కూడా దుష్ప్రచారం సాగిస్తున్నాయి. నిరుపేద వృద్ధులు, వితంతువుల, వికలాంగుల పింఛన్లను 5 రెట్లు పెంచడం ద్వారా వారికి, వారి కుటుంబాల్లో, సమాజంలో గౌరవం, ఆనందం ఇనుమడించాయి. వీటన్నిటికి ఎంత వ్యయమవుతున్నా కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకపోవడం బలహీనవర్గాలు, రైతులు, మహిళల పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.
సీఎం కుర్చీనే లక్ష్యంగా ఉద్భవించిన ప్రతిపక్షాలు ఏనాడూ రాష్ట్ర ప్రగతిని పట్టించుకోలేదు. కష్టాల్లో ఉన్న రాష్ర్టాన్ని పాలించడం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ప్రభుత్వాన్ని నడపడం నిజంగా కత్తి మీద సామే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రతిపక్షాలు అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకోవడం వారి బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. విశ్వ నగరమైన హైదరాబాద్ను అభివృద్ధి పథంలో ముందుంచేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు ఎలా అడ్డుపడుతున్నాయో చట్టసభల సాక్షిగా మనం చూస్తూనే ఉన్నాం.
ఉమ్మడి రాష్ట్రంలో తరతరాలుగా కరువు కాటకాలతో విలవిలలాడుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న సదాశయంతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించగలిగాం. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ పథకాలను పార్లమెంట్ సాక్షిగా కీర్తిస్తుంటే ఇక్కడున్న బీజేపీ మాత్రం తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నది. నూతన సచివాలయాన్ని సైతం అడ్డుకున్నారు. ప్రాజెక్టులకు భూములిస్తున్న రైతులను రెచ్చగొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, వర ్గకక్షలతో నిత్యం రావణకాష్టంలా రగులుతూనే ఉండాలనుకునే ప్రతిపక్షాలు ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేయడం, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై అసత్య నిందలు మోపడం, తమకు తీరిక దొరికినప్పుడు పరామర్శల పేరుతో ప్రజల దగ్గరికి వెళ్లి అబద్ధాలతో మభ్యపెట్టడం ప్రతిపక్ష నేతల దిగజారుడు రాజకీయానికి పరాకాష్ఠ.
పురాణాల్లో దేవతలు లోక కల్యాణం కోసం యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు అడ్డం తగిలినట్లుగా ప్రస్తుతం ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం అన్నివిధాలుగా కృషిచేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పింఛన్లో కేంద్రమే రూ.1800 పంపిస్తున్నదని కొంతమంది నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రం ఇచ్చే పింఛన్ తలసరి రూ.45 మాత్రమే. ఇలా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నింటిలో తమ పాత్ర ఉన్నదంటూ అబద్ధాలు పలుకుతూ అల్ప సంతోషుల్లా వ్యవహరిస్తున్నారు ఇక్కడి బీజేపీ నాయకులు.
ప్రభుత్వ ఫలాలు అందుకుంటున్న ప్రజలను తప్పుదారి పట్టిస్తే ప్రజా ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతామని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి. దేశాన్ని ముంచుతున్న వారు ప్రజల తిరస్కారానికి గురై దిక్కుతోచక, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు.నిజంగా రాష్ర్టాభివృద్ధికి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే వారెవరైనా అభివృద్ధి నిరోధకుల్లా మారతారా? రాష్ర్టాభివృద్ధికి అడ్డుపడుతున్న స్వార్థ రాజకీయులను తెలం గాణ ప్రజలు నిలదీయాలి. రాష్ట్ర అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యం, ఇది తథ్యం. ప్రగతి దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి కృషిలో అండగా ఉండాల్సిన సమయం ఇది. అప్పుడే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ ప్రయత్నం సఫలమవుతుంది.
(వ్యాసకర్త: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే)