పీవీ నరసింహారావులో వ్యంగ్యవైచిత్రి కూడా ఎక్కువే. ఎవరినీ నొప్పించకుండానే ఒప్పించగల నేర్పరి కూడాను. వరంగల్ ఎంపీగా ఉన్న సమయంలో ఒకసారి ఆయన ఆ జిల్లాలో పర్యటించారు. ఓ వ్యక్తి పీవీ వద్దకు వచ్చి ‘అయ్యా మీరేమో గెలిచి ఢిల్లీ పోతిరి. ఇక్కడేమో మా వాడలను ఊడ్చేవారు లేకపాయె. చెప్పినా పట్టించుకునేటోళ్లు లేరాయె’ అని అంటూ నిట్టూర్చాడు. అంతే వెంటనే సదరు వ్యక్తితో ‘మీ ఇంట్లో చీపురుంటే తీసుకురా. ఆ వాడను నేను ఊడ్చిపోతా’ అంటూ పీవీ జవాబివ్వడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వెంటనే పీవీనే మళ్లీ ‘గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేసి, పనిచేయించుకోవాల్సిన విషయాన్ని, సమస్యలపై ఢిల్లీలో మాట్లాడవల్సిన నాతో చెబితే ఎలా’ అంటూ ప్రశ్నించడంతో తన మాటల్లోని తప్పును తెలుసుకున్నాడు సదరు వ్యక్తి.