గల్లీలో జరిగినా, ఢిల్లీలో జరిగినా ఆ ఉద్యమంలో మమేకమై, తెలంగాణ ఆవిర్భావంలో భాగస్వామి అయిన నిరుపేద, బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఆయనకు పేదల పట్ల ప్రేమను, బీసీల పట్ల గౌరవాన్ని చాటుతున్నది.
గెల్లు లాంటి ఉద్యమకారుణ్ని, పేద బిడ్డను అభ్యర్థిగా ప్రకటిస్తే సాధారణంగా ఏ పార్టీవారైనా తమ మద్దతును ప్రకటించాలి. కానీ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రి పదవులు అనుభవించినా.. ఈటల మాత్రం మళ్లీ పోటీ చేయడం సిగ్గుచేటు. పైగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి, ప్రగతిశీలున్నని ప్రచారం చేసుకుంటున్నడు. అక్రమంగా వేలకోట్లు సంపాదించి, తమ అక్రమ భూములను కాపాడుకోవడం కోసం కాషాయ పార్టీలో చేరడం విడ్డూరం. కమ్యూనిస్టునని కాలరెగరేసి మరీ చెప్పుకొ న్న ఈటల ఇప్పుడు ‘నవ్విపొదురుగాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నడు.
మాట్లాడితే బహుజన బిడ్డను అని చెప్పుకొంటున్న ఈటల దళిత, బహుజనుల గురించే పనిచేస్తా అంటున్నడు. నిజంగా బహుజనుల కోసమే ఆయన ఉంటే.. నిరుపేద అయిన గెల్లు శ్రీనివాస్పై ఎందుకు పోటీ చేస్తున్నట్లు? గెల్లు జీవితం సగటు తెలంగాణ విద్యార్థి జీవితానికి ప్రతీక. ఆయన ఉన్నత చదువుల కోసం సంకలో సందూక పెట్టుకొని ‘పల్లె వెలుగు’ బస్సె క్కిండు. తన కుటుంబ వెనుకబాటుకు, తెలంగాణకు నీళ్లు, నిధులు లేకపోవడమే కారణమని తెలుసుకొని, తెలంగాణ ఉద్యమ రూపశిల్పి కేసీఆర్ స్ఫూర్తితో ఉద్యమంలో జతకలిసిండు.
ఉస్మానియా సీ-హాస్టల్ను ఉద్యమ వేదికగా చేసుకొని ఉద్యమ పార్టీ అనుబంద విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీలో చేరిండు. లాఠీ దెబ్బలు ఈపు మీద పడుతుంటే.. ‘జై తెలంగాణ’ నినాదం ఎత్తుకున్నడు. ధర్మం కోసం ధర్నా చేసి, రాస్తారోకోలతో రణరంగం సృష్టించిండు. అలాంటి నిఖార్సయిన విద్యార్థి నాయకునిపై పోటీకి దిగి తెలంగాణ ఆత్మగౌరవం అంటూ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉన్నది.
ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు.. కేయూ, ఓయూకు చెందిన దాదాపు 30 మంది ప్రొఫెసర్లు ఈటలను కలిశారు. తెలంగాణలోని అన్ని వర్సిటీలకు నిధులు కేటాయించాలని కోరితే, నిధులు పెంచేది లేదంటూ వెటకారంగా మాట్లాడిన సందర్భాన్ని ఎవరూ మర్చిపోలేదు. ఈ విషయం కేసీఆర్కు తెలువకుండా చేసి బడ్జెట్లో ఉన్నతవిద్యకు నిధులు తగ్గించింది ఈటలే..!
దళిత, బీసీ ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల తన వ్యాపారసంస్థలకు ఫూలే, అంబేద్కర్ల పేర్లు ఎందుకు పెట్టలేదో..? తన నియోజకవర్గంలో ఏ ఒక్కరిని రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగకుండా ఎందుకు అడ్డుకున్నట్టో? ఈటల ఆధిపత్య రాజకీయాలు చేస్తూ అందర్ని గోస వెట్టింది నిజం కాదా?
ఈటల తెలంగాణ ఉద్యమాన్ని, పదవులను అడ్డం పెట్టుకొని ఆస్తులను పెంచుకున్నడు. ఆ ప్రయత్నంలో చేసిన పాపాలకు లెక్కేలేదు. అందుకే హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటాలంటే విద్యార్థి ఉద్యమ నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్నే గెలిపించాలి. దళితులు ధనికులుగా కావాలంటే బీజేపీకి ఓట్లు రాకుండా చేయాలి. ‘తెలంగాణ మత సామరస్యానికి ప్రతీక’. ఇలాంటి రాష్ట్రంలో మత విద్వేషాలను సృష్టించి ప్రజల ప్రాణాలు తీస్తూ.., పార్టీ పునాదులేసుకుంటున్న పార్టీలకు ఆదిలోనే సమాధి కట్టాలి. హుజూరాబాద్ ప్రజలు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే సకల జనులు నిర్మాణాత్మకంగా ఆలోచించాలి. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం బంగారు లోకాన్ని ఆవిష్కరించుకుందాం. సరికొత్త రాష్ట్రంగా తీర్చుదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని బలపరచాలి. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రత్యర్థులు గొల్లుమనే విధంగా భారీ మెజారిటీతో గెలిపించాలి.