విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులున్న దేశం మనది. ఒక్కో ప్రాంతానిది ఒక్కో ప్రత్యేకత. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేలా, దేశంలో సమాఖ్యస్ఫూర్తి విలసిల్లేలా రాజ్యాంగ నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ స్ఫూర్తిని పాతరేస్తున్నది. ఇందుకు ఈడీ, సీబీఐ, ఐటీ సహా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన అన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని విపక్షాల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తున్నది. ఇది బహిరంగ రహస్యం. ఢిల్లీలోని ఆప్ సర్కారును కేంద్రం రకరకాలుగా రాచిరంపాన పెడుతున్నదని రోజువిడిచి రోజు జరుగుతున్న ఘటనలు తెలియజేస్తున్నాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి అధికార యంత్రాంగంపై స్వయంగా పెత్తనం చెలాయించేందుకు ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ వ్యవహారంపై పోరాటం చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సి ఉన్నది. ‘ఇవాళ మేము రేపు మీ వంతు’ అని ఆయన బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
తనకు అధికారం దక్కడం అసాధ్యమని తెలిసినచోట్ల బీజేపీ మరీ అక్కసుతో దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదనే ఆరోపణలు అంతకంతకూ బలంగానే వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గానీ, బీజేపీ నేతల విషయంలో గానీ కేంద్ర సంస్థలు చూసీచూడనట్టు పోతుంటాయని విపక్షాలు పదేపదే ఆరోపిస్తున్న సంగతి విధితమే. తాజాగా జరిగిన తమిళనాడు సచివాలయ ఉదంతం సంచలనం కలిగిస్తున్నది. ఈడీ అసాధారణమైన రీతిలో తమిళ సచివాలయంలోకి కేంద్ర భద్రతా బలగాల పహారాలో సోదాలు జరిపి తన దర్యాప్తుల పరంపరకు అన్నిరకాల హద్దులను చెరిపేసిందంటున్నారు. విపక్షాల వేధింపుల ప్రహసనాన్ని ఈడీ కొత్తపుంతలు తొక్కించిందనే మాట కూడా వినవస్తున్నది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను వెంట పెట్టుకుని వచ్చి ఈడీ మంత్రి కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.
మంత్రి తన చాంబర్లో లేని సమయంలో ఈ సోదాలు జరిగాయి. దాంతోపాటే చెన్నైలోని మంత్రి నివాసంలోనూ సోదాలు జరిపింది. ఇతర నగరాల్లోనూ ఏకకాలంలో ఈడీ దాడులు జరిపింది. మరుసటి రోజు బుధవారం తెల్లవారుజామున మంత్రి సెంథిల్ను అరెస్టు చేయడం, తదుపరి వైద్యపరీక్షల నిమిత్తం దవాఖానకు తీసుకుపోయినప్పుడు ఆయనకు తక్షణం గుండె ఆపరేషన్ చేచయాలని వైద్యులు చెప్పడం నాటకీయంగా జరిగిపోయాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని జాతీయ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సెంథిల్ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఈడీ ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలకు సంబంధించి దాఖలైన కేసుల్లో మొదట మంత్రి సెంథిల్ పేరు ప్రస్తావనకు రాలేదు. తర్వాత కొందరు మంత్రి పేరును చేర్చాలంటూ కేసులు వేశారనేది వేరే విషయం. కాగా, సచివాలయంలో ఈడీ సోదాలు జరపడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఇది సమాఖ్య వ్యవస్థకు మచ్చ అని విమర్శించారు.
ఈడీ, సీబీఐ దర్యాప్తుల పేరిట జరుపుతున్న తతంగం సామాన్య ప్రజల దృష్టిలో అనుమానాస్పదం అవుతుండటం కూడా తెలిసిందే. ఈ తరహా కేసుల్లో చాలావరకు కంచికి చేరకపోవడమే అందుకు కారణం. మెజారిటీ కేసులు ఆధారాలు లేక కొట్టివేతలకు గురవుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. మంత్రి సెంథిల్పై వచ్చిన ఆరోపణల మీద తాజా దర్యాప్తు జరపాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గత అక్టోబర్లో కొట్టివేసిన నేపథ్యంలో ఈడీ దాడులు జరగడం విశేషం.