అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ ఆశలపై కొలరాడో ఉన్నత న్యాయస్థానం తీర్పు నీళ్లు చల్లింది. ట్రంప్ మీద రకరకాల కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. వాటన్నింటిలోకి అతి కీలకమైంది కాంగ్రెస్ భవనం క్యాపిటోల్పై దాడి చేయించడానికి సంబంధించిందని వేరే చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఆయన తన మద్దతుదారులను రెచ్చగొట్టి కాంగ్రెస్ భవనంపై దాడికి ఉసిగొల్పారని ఆరోపణలున్నాయి. ట్రంప్ అభిమానులు దండెత్తి వచ్చి కాంగ్రెస్ ప్రాంగణంలో వీరంగం వేశారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసీ కార్యాలయాన్ని చిందరవందర చేశారు.
ఆగంతకులు చుట్టుముట్టడంతో కాంగ్రెస్ సభ్యులు ప్రాణాలు అరచేత పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం దుస్థితి చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ప్రత్యర్థి జో బైడెన్ ఎన్నికను అంగీకరించేందుకు నిరాకరించి ఓటర్ల మనోగతాన్ని ట్రంప్ అవమానించారు. తానే గెలిచినట్టుగా ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. అందులో భాగంగా మద్దతుదారులను దండెత్తి రమ్మని పిలుపునిచ్చారు. దాడిలో అనేకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో భద్రతా సిబ్బంది, ఆందోళనకారులున్నారు. ఇప్పుడు ఆ దాడే ట్రంప్ కొంప ముంచింది. సాయుధ తిరుగుబాటు చట్టం కింద కొలరాడో న్యాయస్థానం ట్రంప్ను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించింది.
బానిస విధానాన్ని అబ్రహాం లింకన్ రద్దు చేసినప్పుడు అమెరికా ఉత్తర, దక్షిణాలుగా విడిపోయి అంతర్యుద్ధంలో మునిగింది. చివరికి బానిస వ్యవస్థ రద్దును సమర్థించే ఉత్తరాది గెలిచింది. దక్షిణాదివారు ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ ఆధిపత్యం సాధించి తమకు ఇష్టమైన బానిస విదానాన్ని తిరిగి తెస్తారని భయపడిన అప్పటి శాసనకర్తలు సాయుధ తిరుగుబాటు చట్టాన్ని తెచ్చారు. దేశంలో ప్రభుత్వ వ్యవస్థపై సాయుధ తిరుగుబాటును రెచ్చగొట్టిన వారెవరూ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడటం దాని ఉద్దేశం. ఆ చట్టం కిందనే ట్రంప్కు కొలరాడో కోర్టు శిక్ష విధించింది.
అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షునిపై ఈ చట్టాన్ని ప్రయోగించడం బహుశా ఇదే ప్రథమం. వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈ తీర్పు ప్రభావం చాలానే ఉంటుందని చెప్పవచ్చు. ఇతర కేసుల్లోనూ ఈ తరహా తీర్పులే వస్తే ట్రంప్ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే అంతటితో కథ అయిపోయినట్టుగా భావించడానికి వీల్లేదు. ఈ కేసు అంతిమంగా అమెరికా సుప్రీంకోర్టులోనే తేలాల్సి ఉన్నది. ఆ కోర్టులో ట్రంప్ అనుకూల న్యాయమూర్తులదే ఆధిక్యత అంటున్నారు.
కొలరాడో కోర్టు తీర్పుపై ట్రంప్ స్పందన విస్మయం కలిగిస్తున్నది. నియంతృత్వాలు ఇలాగే పుడతాయని ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఒకవేళ అన్ని అడ్డంకులు తొలగిపోయి తాను గెలిస్తే నిరంకుశంగా పాలిస్తానని చెప్పకనే చెప్తున్నారాయన. ట్రంప్ స్పందన ఆయన తిరుగుబాటు కుట్రదారు అని తెలియజేస్తున్నదని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ట్రంప్ భవితవ్యం కోర్టుల్లో తేలుతుందా లేక ప్రజా క్షేత్రంలోనే తేలుతుందా అనేది ఉత్కంఠభరితమైన ప్రశ్న.