మహిళా రెజర్ల పోరాటం తాత్కాలికంగా విజయం సాధించింది. 11 నెలలుగా వారు చేస్తున్న ‘మల్ల యుద్ధాన్ని’ తట్టుకోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. ఇటీవల ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన పాలకమండలిపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేయడం ఆహ్వానించదగిన పరిణామం. ఈ నిర్ణయంతో బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ షాక్కు గురయ్యాడు. దీంతో నూతన అధ్యక్షుడు సంజయ్సింగ్ను అడ్డుపెట్టుకొని మరోసారి రెజ్లింగ్ సమాఖ్యను ఏలాలని భావించిన ఆయన ఆశలు ఆవిరయ్యాయి. అసోసియేషన్ వ్యవహారాలకు దూరంగా ఉంటానని కూడా ఆయన ప్రకటించటం వెనుక బీజేపీ అధిష్ఠానం ఆదేశాలున్నట్టు స్పష్టమవుతున్నది. తాజాగా సస్పెన్షన్కు గురైన పాలకమండలి కూడా బ్రిజ్భూషణ్ కనుసన్నల్లో నడిచేదేననేది జగమెరిగిన సత్యం. వీరవిధేయుడైన సంజయ్సింగ్ ద్వారా మరోసారి రెజ్లింగ్ను శాసించాలని ఆయన అనుకున్నారు. సంజయ్సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు ఢిల్లీలోని నివాసంలో తానే గెలిచినంతలా బ్రిజ్భూషణ్ సంబురాలు చేసుకోవడమే దీనికి నిదర్శనం.
దేశాన్ని కుదిపేసిన రెజ్లర్ల వ్యవహారంపై ఇన్నేండ్లు మౌనం వహించడమే బీజేపీ చేసిన పాపం. అంతేకాకుండా పరోక్షంగా బ్రిజ్భూషణ్కు మద్దతుగా నిలవడం విమర్శలకు తావిచ్చింది. కైసర్గంజ్, అయోధ్య, గోండా, బహరాయిచ్, బలరామ్పూర్, శ్రావస్తి జిల్లాల్లో బ్రిజ్ భూషణ్కు పట్టున్నది. తూర్పు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ఆయన శాసిస్తుండటమే కేంద్రం మౌనానికి కారణం. అయితే సంజయ్సింగ్ ఎన్నికకు నిరసనగా సాక్షి మాలిక్ కుస్తీలకు స్వస్తి చెప్పగా.. బజరంగ్ పునియా, బధిర ఒలింపిక్స్ రెజ్లింగ్ చాంపియన్ వీరేందర్ సింగ్ పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ మరింత ఇరకాటంలో పడింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఈ అంశం మరోసారి తెరపైకి వస్తే తమకు ప్రతికూలంగా మారుతుందని బీజేపీ భావించి ఉండవచ్చు.
వచ్చే ఏడాది జరుగనున్న హర్యానా ఎన్నికలపై రెజ్లర్ల ప్రభావం ఎక్కువ. జాట్ల ఓట్లు ఎక్కువగా ఉండే హర్యానాలో ప్రతి పల్లెలో మల్ల యోధులుంటారు. వారికి కుస్తీ అనేది ఒక సెంటిమెంట్. ఇన్ని రోజులు పెదవి విప్పని బీజేపీ ఇటు సార్వత్రిక, అటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యానే ఇప్పుడు చర్యలు చేపట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఎన్నికైన సమాఖ్యపై వేటు.. అసోసియేషన్ వ్యవహారాల నుంచి బ్రిజ్భూషణ్ రిటైర్మెంట్ వంటి ప్రకటనలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు ముగియగానే సస్పెన్షన్ ఎత్తివేస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. అదే కనుక జరిగితే రెజ్లర్ల పోరాటం మళ్లీ మొదటికొస్తుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని స్వాగతించిన రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ.