ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల లబ్ధిదారుల ఎంపికకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అభయహస్తం గ్యారంటీలకు 1.25 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభయహస్తం గ్యారంటీల్లో మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు దరఖాస్తు చేసుకున్న కోటిమందికి పైగా మహిళలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఈ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై దరఖాస్తుదారుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. స్పష్టత లోపించిన దరఖాస్తు ఫారం, డాటా ఎంట్రీలో నిర్లక్ష్య వైఖరి, ఇప్పటివరకు విడుదలకాని నియమనిబంధనలే దీనికి ప్రధాన కారణం.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా మహిళల బ్యాంకు ఖాతా వివరాలు అడగలేదు. దాంతో ఆర్థిక సాయం బ్యాంకుల ద్వారా చేస్తారా? లేక స్వయంగా లబ్ధిదారుల చేతికి ఇస్తారా? అనేది ఇప్పటివరకు స్పష్టత రావడం లేదు. కుటుంబంలోని మహిళలందరికీ ఇస్తారా? లేక ఒకరికి మాత్రమే అమలు చేస్తారా? వృద్ధాప్య పింఛన్ వస్తున్న వారి కుటుంబంలోని ఇతర మహిళలకు ఇస్తారా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి గ్యాస్ బిల్ మాత్రం అడగలేదు. ఏడాదికి అవసరమైన సిలిండర్లు అన్నీ రూ.500కే ఇస్తారా? పరిమిత సంఖ్యలో ఇస్తే ఎన్ని సిలిండర్లు ఇస్తారు? అనేది ప్రభుత్వం తెలియజేయడం లేదు.
రైతు భరోసా, కౌలుదారులు, వ్యవసాయ కూలీలు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం విషయంలోనూ గందరగోళం నెలకొన్నది. ఇంటి స్థలం లేనివారిని ఇందిరమ్మ ఇండ్లు పథకానికి విస్మరించడం దురదృష్టకరం. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో డిసెంబర్ నుంచే విద్యుత్తు బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటినుంచే విద్యుత్తు బిల్లులు చెల్లించవద్దని ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి చేసిన ప్రచార వీడియోలు ఇప్పుడు సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దరఖాస్తుతో పాటు ఆధార్కార్డు, రేషన్కార్డు జిరాక్స్ కాపీలు మాత్రమే తీసుకున్నారు. వాటితోనే అన్ని గ్యారంటీలకు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారో అంతుచిక్కడం లేదు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు కాలయాపన చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారనే విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా విధివిధానాలపై స్పష్టత ఇవ్వాలి. అర్హులైన వారందరికీ సంక్షేమ లబ్ధి అందించాలి.
– కైలసాని శివప్రసాద్