నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో అమలు చేస్తున్న ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఆ పథకం రాజ్యాంగ విరుద్ధమని చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నదని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది ఏకాభిప్రాయ తీర్పుగా వెలువడటం గమనార్హం. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో ప్రధానంగా రెండు అంశాలను పరిశీలించింది. కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా ‘స్వచ్ఛందంగా’ చెల్లించే చందాల సమాచారం గోప్యంగా ఉంచడం చెల్లుతుందా? తదనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, ఆదాయపు పన్ను చట్టానికి, కంపెనీల చట్టానికి చేసిన సవరణలు చెల్లుబాటు అవుతాయా? అనేది మొదటిది. రెండోది.. కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు ‘అపరిమితమైన’ చందాలు సమర్పించుకోవడానికి సంబంధించి కంపెనీల చట్టానికి చేసిన మరో సవరణ రాజ్యాంగబద్ధత గురించి. రెండు అంశాల్లోనూ పథకానికి ప్రతికూలంగానే కోర్టు తీర్పు వెలువడింది.
‘ఓటుహక్కును సమర్థంగా వినియోగించుకోవాలంటే రాజకీయ పార్టీలకు అందుతున్న నిధుల సమాచారం తెలిసి ఉండటమనేది తప్పనిసరి’ అని ప్రధాన న్యాయమూర్తి నొక్కిచెప్పడం ఈ పథకంలో పారదర్శకత లోపించడాన్ని ఎత్తిచూపుతున్నది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణాన్ని ఇది ఉల్లంఘిస్తున్నదని ఆయన తేల్చిచెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తీర్పు బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని ఈ పథకాన్ని అమలు చేస్తున్న ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఇప్పటివరకు నగదుగా మార్చుకోని బాండ్లను పార్టీలు వెనక్కి ఇచ్చేయాలని కూడా స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు మొత్తం అన్ని బాండ్ల వివరాలను సమర్పించాలని ఎస్బీఐకి సూచించింది. అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలూ తెలపాలని పేర్కొన్నది. ఈ రెండు వచ్చే మార్చి 6వ తేదీలోగా జరగాలని గడువు కూడా విధించింది.
నిర్ణీత పరిస్థితుల్లో కంపెనీలు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చవచ్చని కంపెనీల చట్టం (2013) 182వ నిబంధన అనుమతిస్తున్నది. అయితే 2017లో ఫైనాన్స్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా మోదీ సర్కార్ అనేక మినహాయింపులు అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. వీటి ఆధారంగా 2018 నుంచి బాండ్ల పథకం అమల్లోకి వచ్చింది. 2018 నుంచి 2022 మార్చి వరకు జారీ అయిన మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో 57 శాతం, అంటే రూ.5,271 కోట్లు బీజేపీ కోశాగారంలోకి వెళ్లాయి. తర్వాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్కు రూ.951 కోట్లు మాత్రమే దక్కడం పథకంలో ఉన్న మొగ్గును సూచిస్తున్నది.
రాజకీయ చందాలకు చట్టబద్ధమైన నిధులను నియంత్రిత బ్యాంకింగ్ మార్గాల ద్వారా సేకరించడాన్ని ప్రోత్సహిస్తున్నామని, చందాలు ఇచ్చుకునేవారు రాజకీయ వేధింపులకు గురికాకుండా ఉండేందుకు పేర్లను గోప్యంగా ఉంచడం అవసరమని ప్రభుత్వం చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కంపెనీలు చందాలు ఇస్తున్నాయంటే బదులుగా ఏదైనా లబ్ధి పొందాలనే ఆలోచన దాని వెనుక దాగి ఉండే అవకాశాలు ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి (క్విడ్ ప్రోకో) ఇక్కడ పనిచేస్తుందని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియకు ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనేది గొడ్డలిపెట్టు వంటిదని హెచ్చరించారు. బాండ్లు పారదర్శకతకు మసిపూస్తాయని, నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు దుర్వినియోగమవుతాయని గత నవంబర్లో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది.
సుప్రీంకోర్టు తీర్పు రాబోయే మాసాల్లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. పాలకపక్షం ప్రాపకం కోసం పాకులాడని కార్పొరేట్ సంస్థ ఉంటుందా? అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు సందేహాలు వ్యక్తం చేయడం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కార్పొరేట్ చందాలపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించదగ్గదే. అయితే అసలు సమస్య ఎన్నికల వ్యయం, దానిని వెన్నంటి ఉండే అవినీతి. వ్యక్తిగత చందాల ద్వారా అవినీతి జరగదనే గ్యారంటీ ఏమీ ఉండదనేదీ వాస్తవమే. ఎన్నికల వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి, రాజకీయ పార్టీలు కార్యకర్తల చందాల మీద మాత్రమే ఆధారపడే రోజులు ఎప్పుడో పోయాయి. అదేవిధంగా ఓటర్లందరూ విద్యావంతులై, అవినీతి గురించి చైతన్యం కలిగినవారైతే పరిస్థితి వేరేగా ఉంటుంది. అటు అవినీతికి కళ్లెం పడుతుంది, ఇటు ఎన్నికల వ్యయమూ తగ్గిపోతుంది. కానీ, ప్రస్తుత నేపథ్యంలో అవినీతికి దారితీసే లొసుగులను చక్కదిద్దడం తక్షణావసరం. అదే సమయంలో ఎన్నికల వ్యయాన్ని, అవినీతిని తగ్గించేందుకు సాంకేతికతను వినియోగించడం తప్పనిసరి. ఆధార్తో ఓటును అనుసంధానించడం వంటి సాంకేతిక చర్యల ద్వారా దీనిని సాధించవచ్చు. తగ్గించిన వ్యయాన్ని కూడా పార్టీలు చట్టబద్ధమైన మార్గంలో పొందేందుకు న్యాయమైన విధానాలు ప్రవేశపెట్టాల్సి ఉందని చెప్పకతప్పదు.