గవర్నర్లు ఇటీవలి కాలంలో తరచుగా వార్తలకు ఎక్కుతున్నారు. వారి వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఇది అన్ని రాష్ర్టాల్లో కాదు. కేవలం కేంద్రంలోని పాలక పక్షమైన బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. తెలంగాణతో పాటుగా తమిళనాడు, కేరళ, బెంగాల్ ఈ కోవలోకి వస్తాయి. గవర్నర్లు ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలతో అనునిత్యం తగాదా పడుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బిల్లులు, నియామకాల విషయంలో గవర్నర్లు మోకాలడ్డు పెట్టడం సాధారణమైపోయింది. పెండింగు బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా గవర్నర్లకు సూచించమని కోరుతూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో న్యాయవ్యవస్థను ఆశ్రయించాల్సి వస్తున్నది.
ఈ వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు గవర్నర్లకు కనువిప్పు కావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు మెట్లు ఎక్కితే గానీ గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా ఉండటమనే ధోరణిని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. దీనికి ముగింపు పలకాలని సూచించింది. బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ తాత్సారంపై పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ మేరకు మౌఖిక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో ఈ తరహా కేసు వేసిన సంగతి తెలిసిందే.
గవర్నర్లు కేవలం బిల్లుల విషయంలోనే కాదు, అనేక ఇతర అంశాల్లోనూ ఎన్నికైన ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఓ గవర్నర్ తన శాసనసభ ప్రసంగంలో కొంతభాగం చదువకుండా వదిలేస్తే, మరో గవర్నర్ క్యాబినెట్ సిఫారసు చేసినా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా ఉండిపోతారు. మరో గవర్నర్ ఉన్నపళంగా ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లాలని ఆదేశిస్తారు. ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసే చర్యలే. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడమనేది కొత్తగా వచ్చిన సమస్య ఏమీ కాదు.
కాంగ్రెస్ హయాంలోనే ఇది మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడానికి గవర్నర్లను కేంద్రం వినియోగించు కున్న సందర్భాలూ అనేకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ రాంలాల్ నిర్వహించిన పాత్ర తీవ్ర విమర్శలకు గురైంది. తర్వాత ఆయన రాజీనామా చేశారు. కేంద్ర-రాష్ట్ర వివాదాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ గవర్నర్ల నియామకం, పాత్రపై పలు కీలక సిఫారసులు చేసింది. క్రియాశీల రాజకీయాలతో సంబంధం ఉన్నవారిని గవర్నర్ పదవుల్లో నియమించరాదనేది అందులో ముఖ్యమైంది. కానీ అందుకు విరుద్ధంగా నిన్నా మొన్నటిదాకా కేంద్ర పాలకపక్ష నాయకులుగా చెలామణి అయినవారిని గవర్నర్ పదవుల్లో నియమించడం జరుగుతున్నది.
కేంద్రంలోని పాలకపక్షమే దేశంలోని అన్ని రాష్ర్టాల్లో గెలువాలని ఏమీ లేదు. తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల పార్టీలు గెలవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రాంతీయ ఆకాంక్షల పరిపూర్తికి అవి అవతరించాయనేది తెలిసిందే. అలాంటి రాష్ర్టాల పట్ల కేంద్రం అక్కసుతో వ్యవహరిస్తుండటం మనం చూస్తున్నాం. నిధులు, అనుమతుల విషయంలో, ఎన్నికల సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించడం కేంద్రం చేస్తున్నది. దీనికితోడు గవర్నర్లు రాష్ర్టాల పనితీరుకు ఆటంకం కలిగించేలా బిల్లులను తొక్కిపెట్టడం మరో సమస్య. కేరళ, బెంగాల్ గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణ పడటం నిత్యకృత్యమైంది.
తమిళనాడు గవర్నర్ ఆ మధ్య తనకు లేని అధికారాన్ని ఆపాదించుకొని ఓ మంత్రిని బర్తరఫ్ చేసి, అంతలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంపై దుమారం రేగింది. కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య గవర్నర్లు వారధులుగా ఉండాలి. అలా కాకుండా కేంద్రం తరపున రాష్ర్టాలను సతాయించే పనిముట్లుగా మారితే ప్రజాస్వామ్యానికి ప్రమాదమే. సమాఖ్యస్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధమని చెప్పాల్సిన పనిలేదు. గవర్నర్లు తాము ఎన్నికైన ప్రజా ప్రతినిధులం కామన్న సంగతి గుర్తెరగాలని భారత ప్రధాన న్యాయమూర్తి చెప్పడం గమనార్హం.