అభివృద్ధి, సంక్షేమంలో అంగలు వేస్తున్న తెలంగాణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చిచేరింది. పేదరికంపై సాగిస్తున్న పోరులో రాష్ట్రం గణనీయమైన ముందడుగు సాధించింది. ‘సంపద పెంచు.. ప్రజలకు పంచు’ అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల ఫలం సామాన్యులకు అందుతున్నది. పేదరిక నిర్మూలనలో జాతీయ సగటు కన్నా మన రాష్ట్రం ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. మెరుగుపడిన ప్రజల జీవన ప్రమాణాలే ఇందుకు సాక్ష్యం. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచీ ఆ సంగతినే వెల్లడించింది. పేదరికం తగ్గింపులో తెలంగాణ అద్వితీయమైన ప్రగతి సాధించింది. జాతీయ సగటు పేదరికంతో పోలిస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడో వంతు మాత్రమే ఉన్నది. మన పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో పోటీ పడటం విశేషం. పేదరికం నిర్మూలనలో అవి జాతీయ సగటు కన్నా అత్యుత్తమమైన ఫలితాలు సాధించాయి. విద్య, వైద్యం, స్థిర, చరాస్తులు, పారిశుద్ధ్యం, విద్యుత్తు వినియోగం వంటి పలు అంశాలను ఈ సూచి తయారీలో పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు కొలువుదీరినప్పటి నుంచి ఒక్కో రంగంపై తదేక దీక్షతో కృషి చేస్తున్నది. వ్యవసాయం మొదలు విద్య, వైద్యం వరకు వినూత్నమైన ఆలోచనలతో, సృజనాత్మకమైన పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.
పట్టణాల్లో మెరుగులు, పల్లెల్లో మురుగులు అనే దశ పోయి సమాంతర పరుగులు మొదలయ్యాయి. సాగు బాగుపడితే ఊరు మెరుగవుతుంది. కరెంటు, నీళ్ల సమస్యలు కనుమరుగయ్యాయి. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయి. పెట్టుబడి అవసరాలకు రైతుబంధు, కష్టకాలంలో బీమా అండదండగా నిలుస్తున్నాయి. దీంతో ఊళ్లు పచ్చబడ్డాయి. పల్లె ప్రజల ముఖాలు కళకళలాడుతున్నాయి. పారిశ్రామికాన్ని సులభతరం చేయడంతో పెట్టుబడులు పెరిగి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పోటెత్తుతున్నాయి. అభివృద్ధిలో అంతరాలు అంతరించిపోతున్నాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఆయా అంశాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. వాటి సమగ్ర ప్రభావాల ఫలితంగా పేదరికం అడుగంటుతున్నది. విద్యను చక్కదిద్ది, వైద్యానికి మెరుగులద్ది సామాన్యులకు అందుబాటులోకి తేవడం, బాలింతల పోషణ, పేదింటి అమ్మాయిలకు పెండ్లి ఖర్చులు సమకూర్చడం వంటి సంక్షేమ పథకాలు సామాన్యుల అభ్యున్నతికి సాయపడుతున్నాయి.
అదే సమయంలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అన్నింటా నానాటికి తీసికట్టు అవుతున్నదని నీతి ఆయోగ్ నివేదిక నిగ్గుతేల్చింది. రైళ్లు, పరిశ్రమలు, నిధులు ఎగరేసుకుపోయి గుజరాత్లో గుమ్మరించడం ఆయనకు అలవాటు. కానీ పేదరికం నిర్మూలనలో మాత్రం ఆ రాష్ట్రం పరిస్థితి దయనీయంగా ఉంది. గుజరాత్ మాడల్ గుట్టు ఆయోగ్ నివేదిక రట్టు చేసింది. అభివృద్ధి ఫలాలు అక్కడి పేదలకు ఏ మాత్రం అందడం లేదని చెప్పకనే చెప్పింది. డబుల్ ఇంజిన్ గుజరాత్ సింగిల్ ఇంజిన్ తెలంగాణ ముందు వెలవెలపోతున్నది. ఎంతగా సవతి ప్రేమ చూపిస్తున్నా తెలంగాణ ప్రగతి పరుగులకు కేంద్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. తెలంగాణ మాడల్ దేశవ్యాప్తం కావాలనే డిమాండ్ అంతకంతకూ బలంగా వినిపించడమే ఇందుకు నిదర్శనం.