PM Modi | భారతదేశం అసాధారణమైన పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలకు పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు జైలులో మగ్గుతున్న, అరెస్టు కాబోతున్న భీతావహ పరిస్థితుల్లో నూతన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజాస్వామిక కసరత్తు జరుగుతున్నది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుకు ముందు రాజీనామా చేస్తే, తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చేసినా రాజీనామా చేయలేదు. జైలు నుంచే సర్కారును నడుపుతానని తెగేసి చెప్పారు.
ఆ మేరకు తన ప్రభుత్వంలోని ఓ మంత్రికి ఢిల్లీ నీటి సరఫరా మెరుగుదలపై ఆదేశాలు పంపారు కూడా. ఇదంతా గమనిస్తే ఎవరికైనా కొంత గందరగోళం కలగడం సహజమే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడులు, అరెస్టులతో విపక్షాలను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. అందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో పాటుగా ఐటీని బాహాటంగా ఉపయోగించుకుంటున్నది. ఇదంతా అవినీతిని అంతం చేసేందుకని కేంద్రం అంటున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది విపక్షాలను వేధించేందుకు కేంద్రం చేతిలో ఆయుధంగా మారిందనే విమర్శలు బలంగా వినవస్తున్నాయి.
రెండేండ్లయినా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు ఎటూ తేలలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించిన బలమైన సాక్ష్యాలు అంటూ ఏవీ లేవు. కేవలం అరెస్టయినవారి వాంగ్మూలాల ఆధారంగా కేసు ముందుకు సాగుతున్నది. దీనిపై గతంలోనే కోర్టులు నిలదీశాయి. అయినా ఎడతెరిపి లేకుండా దాడులు, అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టే కేసులపై విశ్వసనీయత చాలా తగ్గిపోయింది. ఈ తరహా కేసుల్లో నేర నిరూపణ జరిగి శిక్షలు పడటం చాలా చాలా తక్కువ.
రాజకీయ నాయకులకు సంబంధించి సీబీఐ, ఈడీ దర్యాప్తు చేసిన కేసుల్లో 95 శాతం విపక్షాల పైనే కావడం గమనార్హం. ఇకపోతే మొత్తంగా ఈడీ కేసుల్లో ముగింపునకు చేరినవి 0.5 శాతానికి లోపే. ఈ ధోరణికి టూజీ స్కామ్ అతిపెద్ద ఉదాహరణ. డీఎంకే నేతలు కనిమొళి, రాజా తదితరులపై టూజీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఏడేండ్ల కాలయాపన తర్వాత కూడా ఈ కేసులో ఒక్కరికీ శిక్ష పడలేదు. మొత్తం నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేశారు. కేవలం దర్యాప్తు సందర్భంగా సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా చార్జిషీటు రూపొందించారు.
తర్వాత సాక్షులు కోర్టు ముందు అవేవీ ఒప్పుకోలేదు. సీబీఐ స్పెషల్ జడ్జి ఓపీ సైనీ ఈ కేసు తీర్పులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం గుర్తు చేసుకోవాల్సిన అవసరమున్నది. నిందితులు చేశారంటున్న నేరాలకు సంబంధించిన ఆధారాలేవీ కేసులో చూపలేదు. అధికారిక రికార్డుల్లోని అంశాలను తప్పుగా చదవడం, అరకొరగా చదవడం, కొన్నిటిని మింగేయడం లేదా సందర్భ శుద్ధి లేకుండా చేర్చడం ద్వారా చార్జిషీటు తయారుచేశారు అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ కేసులోనూ సీబీఐ జడ్జి నాగ్పాల్, సుప్రీంకోర్టు ధర్మాసనం సాక్ష్యాధారాల కోసం దర్యాప్తు సంస్థలను నిలదీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తరహా కేసుల విశ్వసనీయత, వాటివెనుక గల ఉద్దేశాలు సందేహాస్పదం కావడం సహజమే.
అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల సాధనకు కేంద్ర సంస్థలు పనిముట్లుగా మారాయనే అభిప్రాయం దేశంలో అంతకంతకూ బలపడుతున్నది. ముందుగా ఒక ఆరోపణ చేస్తారు, దాడులు జరుగుతాయి. ఆ తర్వాత ఓ నిందితుడు అప్రూవర్గానో, మరో రకంగానో వాంగ్మూలం ఇస్తాడు. దాని ఆధారంగా మరికొందరిని నిందితులుగా మారుస్తారు. అనంతరం వారు ఇక దోషులే అన్నట్టుగా సోషల్ మీడియాలో ఊదరగొడతారు. ఈలోగా అరెస్టయిన నాయకులకు ఎంతో నష్టం జరుగుతుంది. అది జైల్లో గడిపిన కాలం కావచ్చు. లేదా రాజకీయంగా వాటిల్లిన నష్టం కావచ్చు, వ్యక్తిగతంగా అనుభవించిన మనోవేదన కావచ్చు.. జరిగిన అన్యాయానికి ఎవరు జవాబు చెప్తారు? ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. ఈ క్రమం గురించే ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం అనేది కొన్ని నియమాలకు కట్టుబడి ఆడే ఆట వంటిది. ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే దానిని తొండాట అంటారు. ఈ తొండాటలో బీజేపీ ఆరితేరినట్టు కనిపిస్తున్నది. రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను చీల్చడం, కూల్చడం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది. అందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు, చీలికవర్గం సాయంతో ప్రభుత్వం ఏర్పాటు, దారికి రానివారిపైకి కేంద్ర సంస్థలను ఉసిగొల్పడం, దాడులు, అరెస్టులతో వేధించడం, తనవైపు మళ్లినవారిపై దాడులు, కేసులు నిలిపివేయడం వంటి చర్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ రాష్ర్టాల్లో ప్రభుత్వాల చరిత్ర గమనిస్తే మనకు బీజేపీ వ్యవహారశైలి స్పష్టంగా బోధపడుతుంది. ఈ తతంగమంతా ప్రభుత్వం చెప్తున్నట్టు కేవలం అవినీతిని అంతం చేసేందుకే అనేది నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో, అంత నిజం!