Samvidhan Sadan | నరేంద్ర మోదీ కేంద్రంలో ఎలాంటి పదవులు నిర్వహించకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. పదేండ్ల క్రితం ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటు వద్దకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద శిరస్సు ఆనించి లోపలకు అడుగుపెట్టారు. పదేండ్ల తర్వాత కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు జరుగుతున్నాయి. రెండో విడుత పదవి చేపట్టినప్పుడు రాజ్యాంగ పుస్తకానికి శిరసు ఆనించి నమస్కారం చేశారు. అంటే కొత్త రాజ్యాంగానికి బాటలు వేస్తారా? అని అప్పట్లో పరిశీలకులు చమత్కరించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పదవీకాలం ముగిసిపోతున్న చరమఘట్టంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, అందులో భాగంగా సభ్యులు నూతన పార్లమెంటు భవనంలోకి మారడం దేశ రాజకీయాల్లో కీలకఘట్టమే! పార్లమెంటు నూతన భవనంలోకి మారడం సరే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎలాంటి మార్పులకు గురైందన్నది ప్రస్తుతం దేశం ముందున్న ప్రశ్న.
మొత్తంగా పార్లమెంటు దేశానికి, దేశ ప్రజలకు ప్రతినిధిగా ఉంటుంది. ఆ పార్లమెంటు (లోక్సభ) విశ్వాసం పొందిన ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఆ ప్రభుత్వంలోని మంత్రుల్లో ప్రథముడు అయిన ప్రధాని పరిపాలన అంతటికీ ఇరుసులా, పూలలో దారంలా ఉండాలి. అయితే అంతిమం మాత్రం ప్రధాని కాదు, పార్లమెంటే. ఇదీ పార్లమెంటరీ పరిపాలన ఏర్పాటు. కానీ మోదీ హయాంతో అంతా తారుమారైంది. ఏకవ్యక్తి పరిపాలన బలంగా వేళ్లూనుకున్నది. ప్రభుత్వానికి సంబంధించి మరో ముఖమేదీ బయటకు కనిపించదు.
సామాజిక మాధ్యమాల ద్వారా కల్పించిన ఒక ఊహాత్మకమైన సకల శక్తిమంతుడైన నేతగా మోదీని చూపే ప్రక్రియ మొదటినుంచీ అమలవుతున్నది. అన్నిటికి కర్త, కర్మ, క్రియ ఆయనే. నోట్ల రద్దు అయినా, కరోనా లాక్డౌన్ అయినా మోదీ తెరమీదకు రావడం షరా మామూలు అయింది. కేంద్ర ప్రభుత్వానికి ముఖ చిత్రం మాత్రమే కాదు, సమస్తమూ తానే అయిపోయారాయన. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశామని గొప్పగా చెప్పుకునే మోదీ పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ఆ రాష్ట్రపతి ఊసులేకుండా పూర్తి చేయడం దేశం చూసింది. మీడియాకు ముఖం చాటేసే ప్రధాని పార్లమెంటులోనూ కీలక విషయాలపై అదే విధానం పాటించడాన్ని ఏ రకంగా జీర్ణం చేసుకోవాలి.
బీజేపీ సొంత ఎజెండాలోని అంశాలను అమలు చేసేందుకు తెచ్చిన చట్టాల విషయంలో ప్రధాని మోదీ బుల్డోజర్ విధానమే అనుసరించారు. తమకున్న బలంతో హడావిడిగా పని కానిచ్చేశారు తప్పితే జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలపై తగిన చర్చ జరగాలని ఏనాడూ అనుకోలేదు. ప్రధాని ప్రియమిత్రుడు అదానీ అక్రమాలపై పార్లమెంటరీ సంఘాన్ని వేయాలన్న విపక్షాల డిమాండ్ గురించి మాటవరసకైనా సర్కారు సమాధానం చెప్పలేదు. అంతెందుకు తాజా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై కూడా గందరగోళమే. ఎందుకు సమావేశాలు పెడుతున్నారు, చర్చాంశాలు ఏమిటనే విషయంలో పారదర్శకత లోపించింది.
నలుగురినీ కలుపుకొని పోవడం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి గీటురాయి. సంప్రదింపులు అనేవి అందుకు సాధనాలుగా ఉపకరిస్తాయి. కానీ మోదీ సర్కారుకు అలాంటి పార్లమెంటరీ ఆదర్శాలు ఏవీ లేవు. అనుకున్నది నయానా భయానా ముందుకు తోయడం ఒకటే వారికి తెలిసిన విద్య. పాత పార్లమెంటు భవనానికి ‘సంవిధాన్ సదన్’ అని పేరు పెట్టినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. అంటే రాజ్యాంగ నిలయం అని అర్థం. కానీ నూతన పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని తెలంగాణ శాసనసభ ముక్తకంఠంతో తీర్మానం చేస్తే ఆ సంగతి మాత్రం గాలికి వదిలేశారు. పార్లమెంటరీ ఆచార, సంప్రదాయాలపై పెద్దగా గౌరవం లేనినాడు భవనం పాతదా, కొత్తదా అనేది ముఖ్యం కాదు. కావాల్సింది కేంద్ర సర్కారులో గుణాత్మకమైన మార్పు.. దేశహితం కోసం నలుగురినీ తమ వెంట నడిపించే ఓర్పు!