తమిళనాడులో తరచు రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్న గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా శాసన సభలోనే వివాదం సృష్టించుకొని వాకౌట్ చేయడం సభ్యతగా లేదు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని కీలకమైన వాక్యాలను ఆయన చదవకుండా దాటవేయడం వివాదానికి కారణమైంది. అంబేద్కర్, ద్రవిడ నాయకులు, ద్రవిడ నమూనా పాలన, శాంతిభద్రలకు సంబంధించిన ప్రస్తావనలను ఆయన వదిలేయడం పాలకపక్షానికి అభ్యంతరకరంగా తోచింది.
గవర్నర్ ప్రసంగం ఉన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, విజయాలను చెప్పుకోవడానికి. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగపాఠాన్ని గవర్నర్ యథావిధిగా చదవ వలసిందే తప్ప సొంత కవిత్వాన్ని వినిపించాలనుకోకూడదు. ఏదైనా అభ్యంతరమనిపిస్తే, ముందే సంప్రదించి తొలగించుకోవచ్చు. అంతిమంగా చెల్లుబాటు కావలసింది రాష్ట్ర మంత్రివర్గ అభీష్టమే. అక్కడక్కడా గవర్నర్లు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నా, అది వాంఛనీయం కాదు.
గవర్నర్గా వచ్చిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సౌహార్ద వారధిలా ఉండాలి. ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించాలి. రాష్ట్ర ప్రభుత్వ నడవడిలో లోపాలుంటే అది ప్రజలే చూసుకుంటారు. అదే ప్రజాస్వామిక సూత్రం. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర పరిమితమైనది. గవర్నర్ ఆర్.ఎన్. రవి వివాదాస్పదంగా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. దాదాపు ఇరువై బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెట్టడం ఈయన ఘనత. గవర్నర్గా వచ్చి తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం భావ్యం కాదు. రాష్ట్రం పేరు ‘తమిళనాడు’గా ఉండటమే ఆయనకు నచ్చడం లేదట! ఒక్క తమిళనాడులోనే కాదు, మోదీ హయాంలో పలు రాష్ర్టాల గవర్నర్లు ఇదే వింత పోకడలను ప్రదర్శిస్తున్నారు. గవర్నర్కు ఉండే రాజ్యాంగ పరిమితులపై వీరికి అవగాహన ఉన్నట్టే కనిపించడం లేదు.
గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తికి సొంత అభిప్రాయాలు, వైఖరులు ఉండకూడదా అనే వాదనను కొందరు లేవనెత్తవచ్చు. వ్యక్తి అయినప్పుడు సొంత అభిప్రాయాలు, వైఖరులు ఉండటం సహజం. కానీ గవర్నర్ పదవిలో ఉండి వాటిని ప్రజా ప్రభుత్వంపై రుద్దాలనుకోకూడదు. గవర్నర్ పదవి అలంకారప్రాయమైనదనే స్పృహతోనే వ్యవహరించాలి. సొంత అభిప్రాయాలే ప్రధానమని అనుకుంటే, గవర్నర్ పదవిని వదులుకొని అదే రాష్ట్రంలో ప్రజల మధ్యకు వెళ్ళి తనకు నచ్చిన అంశాలను ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికలలో పోటీ చేసి, ప్రజలు కనుక ఎన్నుకుంటే, శాసన సభలో తన అభిప్రాయాలను వెల్లడించవచ్చు. ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు. కానీ గవర్నర్గా ఉంటే మాత్రం ఆ పదవికి గల హద్దులలో ఒదిగిపోవలసిందే. అంతే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వలసపాలన కాలం నాటి పోకడలను ప్రదర్శించడం వల్ల చరిత్రలో గవర్నర్ పదవికి కళంకం తెచ్చిన వారిగా మిగిలిపోవలసి ఉంటుంది. ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించడం ద్వారానే గవర్నర్ పదవికి గౌరవాన్ని తెచ్చిపెట్టగలమని ఈ పదవిలో ఉన్నవారు గ్రహించాలి.