ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసిన రెండు అగ్రరాజ్యాధినేతల వర్చువల్ సమావేశం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య మూడు గంటల పాటు సాగిన వీడియో కాన్ఫరెన్స్ స్నేహ పూర్వక పలకరింపులతో మొదలై హితబోధలు, హెచ్చరికలతో కొనసాగింది. సార్వభౌమాధికారాలు, స్వేచ్ఛా వర్తక వాణిజ్యాల ప్రస్తావనల్లో ఇరుదేశాలూ హూంకరింపులు, బెదిరింపులకు దిగాయి. తైవాన్ విషయంలో అమెరికా వేలుపెడితే నిప్పుతో చెలగాటం ఆడినట్టేనని జిన్పింగ్ హెచ్చరిస్తే, ఇండోపసిఫిక్ జలాల్లో స్వేచ్ఛా వాణిజ్య అవసరాన్ని ప్రస్తావిస్తూ చైనా ఆధిపత్యాన్ని సాగ నివ్వబోమని బైడెన్ తెగేసి చెప్పారు. గతానికన్న భిన్నంగా ఈసారి అమెరికా ఆత్మరక్షణాత్మకంగా వ్యవహరిస్తే, మూడో సారి అధ్యక్షుడిగా ఎన్నికై జీవిత కాలం అధికారంలో కొనసాగే పట్టు సాధించిన ఉత్సాహంతో జిన్పింగ్ దూకుడుగా వ్యవహరించటం గమనార్హం.
వర్తమాన పరిస్థితుల్లో అమెరికా, చైనా దేశాధినేతల సమావేశానికి ప్రత్యేకత ఏర్పడింది. దశాబ్దాలుగా ఆర్థిక గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అమెరికాను వెనుకకు నెట్టి, చైనా ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇరవై ఏండ్ల కిందట ఏడు లక్షల కోట్ల డాలర్ల నుంచి నేడు 120లక్షల కోట్ల డాలర్ల సంపదతో అత్యంత సంపన్న దేశంగా అవతరించింది. ప్రపంచ సంపద వృద్ధిలో మూడోవంతు చైనాదేనని మెకిన్సే నివేదిక వెల్లడించింది. పెరిగిన ఆర్థిక శక్తితో చైనా గతంకన్నా దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. కాగా తన ప్రతిష్ఠను నిలుపుకొనేందుకు అమెరికా ప్రయత్నించే కొద్దీ ఇరు దేశాల మధ్య ఘర్షణలు నెలకొనే ప్రమాదం ఉంది. ఘర్షణలు ఏ రూపంలో ఏ మాత్రం చెలరేగినా, వాటి ప్రభావం విస్తృతంగా ఉంటుంది. విభేదాలు ఘర్షణలకు దారి తీయకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత ఇరుపక్షాలకూ ఉన్నది.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ప్రపంచ వాణిజ్య, రాజకీయ సంబంధాలను ప్రభావితం చేస్తున్న అమెరికా, చైనాల నాయకులు ముఖాముఖి చర్చించుకోవడం ఆహ్వానించ దగినది. ఇంతకాలం ప్రచ్ఛన్న ఆధిపత్య పోరులో నువ్వా నేనా అన్నట్లు సాగుతూ ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఇరు దేశాలు చర్చలు జరపటం శాంతి సుస్థిరతలకు హామీగా భావించవచ్చు. అయితే ఇరు దేశాలూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించకూడదు. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు, మానవ హక్కులకు భంగం కలిగించకూడదు. వీగర్ల పట్ల చైనా అణచివేత విధానాలు మానివేయాలి. హాంకాంగ్, టిబెట్ల ప్రత్యేక ప్రతిపత్తిని గౌరవించాలి. ఇరాక్, లిబియా మొదలు సిరియా,అప్ఘానిస్థాన్ దాకా దురాక్రమణ విధానాలను అమెరికా విడనాడాలి. అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం, ఐక్యరాజ్య సమితిని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ప్రపంచ శాంతికి హామీ లభిస్తుంది.