రాజకీయం, స్వప్రయోజనం తప్ప మరొకటి పట్టని మోదీ సర్కారుకు ఉచితానుచితాలు కూడా లేకుండా పోతున్నాయి. రోజురోజుకీ బరితెగింపు బట్టబయలవుతున్నది. పొరుగుదేశం శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై చర్చిద్దాం రండి అంటూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఆ భేటీలో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై ఆధారాల్లేని ఆరోపణలు చేయటం కేంద్రం దిగజారుడు వైఖరికి కొత్త ప్రమాణంగా నిలుస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలు తమ తమ రాష్ర్టాలను అప్పుల్లో ముంచెత్తుతున్నాయని, ఇది దేశానికి నష్టం చేస్తుందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి చెప్పుకొచ్చారు. ఇవన్నీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలే కావటం గమనార్హం. శ్రీలంక గురించి చర్చించాల్సింది పోయి, మాపై నిందలు వేయటం ఏమిటంటూ ఆయాపార్టీల నేతలు నిలదీయటంతో కేంద్రం తోకముడిచింది.
అప్పుల విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేగాక తెలంగాణకు చెందిన పలువురు ఆర్థికవేత్తలు, ప్రొఫెసర్లు, టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే వివరంగా సమాధానాలిచ్చారు. దేశం గాడి తప్పి ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉండేందుకే ఎఫ్ఆర్బీఎం (ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ) చట్టం ఉన్నది. ఈ చట్టం ప్రకారం రాష్ర్టాలు తమ జీఎస్డీపీలో 25 శాతం వరకు అప్పులు చేయవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీలో రుణాల వాటా 23 శాతంలోపే ఉన్నది. అతి తక్కువ అప్పులు చేసిన రాష్ర్టాలలో తెలంగాణ మూడవ స్థానంలో ఉందని స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి గతంలో లోక్సభలో వెల్లడించారు. కర్ణాటక, గుజరాత్, యూపీ వంటి బీజేపీ పాలిత రాష్ర్టాలే ఎక్కువ అప్పులు చేశాయి. తెలంగాణ అప్పులు పరిమితికి లోబడే ఉన్నట్టు ఆర్బీఐ కూడా తెలిపింది.
వాస్తవానికి కేంద్రప్రభుత్వమే నిర్దేశిత ఎఫ్ఆర్బీఎం పరిమితి 6.2 శాతానికి మించి అప్పులు చేసింది. కేంద్ర జీడీపీలో ఈ అప్పులు 59 శాతం. దేశాన్ని పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు రూ.55,87,149 కోట్లు కాగా, మోదీ ఎనిమిదేండ్ల హయాంలో చేసిన అప్పు కోటి కోట్లను దాటింది. ఇంత అప్పు చేసి కేంద్రం ఈ దేశ సంపదకు అదనంగా జోడించింది ఏమిటి? ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారు? ఆయన అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్లే నేడు రూపాయి పాతాళంలోకి జారిపోతున్నది. ద్రవ్యోల్బణం, ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్లాయి. కేంద్రం దేశాన్ని అప్పులు పాలు చేసింది చాలక, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న తెలంగాణపై రుణాలు తీసుకోకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పులు రాష్ట్రంలో సంపదను పెంచాయి. లక్షలాది మందికి కొత్తగా ఉపాధిని కల్పించాయి. కోట్లాదిమంది రైతులకు వ్యవసాయాన్ని పండుగగా మార్చాయి. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం సహకరించాలి తప్ప, బురదజల్లడం బాధ్యతారాహిత్యమే.