మన దేశంలో అది రూ.18,607 కోట్ల విలువైన మార్కెట్. దాదాపు 43 కోట్ల మంది దానిపై సమయం గడుపుతున్నారు. అయినప్పటికీ ఆ రంగానికి ఒక నిబంధన గానీ, ఒక సమగ్రమైన చట్టంగానీ లేవు. అదే ఆన్లైన్ గేమ్స్ రంగం. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం బద్ధకాన్ని వదిలించుకొని ఆన్లైన్ గేమ్స్ను నియంత్రించే పనికి పూనుకొన్నది. ఇది హర్షనీయమే అయినా, అన్నింటినీ రాజకీయ కోణంలో, తన ఖజానా నింపుకొనే కోణంలో మాత్రమే చూసే మోదీ సర్కారు ఈ విషయంలో ఏ విధమైన నిబంధనలను తీసుకొస్తుందా అన్న ఆసక్తి నెలకొన్నది. ఇక్కడ కూడా రాష్ర్టాల హక్కులను హరించే పనులకు దిగుతుందా అన్న అనుమానాలూ పొడసూపుతున్నాయి. ఏలినవారి ఎనిమిదేండ్ల చరిత్ర అటువంటిది మరి.
ఆన్లైన్ గేమ్స్ రంగం ఐటీ శాఖ కిందికి వస్తుందా? లేక, క్రీడామంత్రిత్వ శాఖ కిందికి వస్తుందా? అన్న స్పష్టత ప్రస్తుతానికి లేదు. అలాగే ఆన్లైన్ గేమ్స్ను నైపుణ్యంతో కూడిన క్రీడలుగా పరిగణించాలా? లేక అదృష్టమే పెట్టుబడిగా ఆడే ఆటలుగా భావించాలా? అన్న చర్చ కూడా ఉన్నది. ఒకరకం వాటిని నిజమైన క్రీడలుగా పరిగణించవచ్చన్న అభిప్రాయం ఉంది. రెండోరకం ఆటలు జూదం, బెట్టింగ్ వంటివి. వీటిని ఆంక్షలతో నియంత్రించాలి. మేధోహక్కుల విషయంలో తలెత్తే వివాదాలు కూడా ఈ రంగంలో బోలెడు. ప్రపంచంలో రష్యా, చైనా, టర్కీ, ఫిలిప్పైన్స్ మాత్రమే ఆన్లైన్ గేమ్స్ను నిజమైన క్రీడలుగా ప్రకటించాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా వీటిపై దృష్టిసారించింది. ఆసియాలో ఈ రంగం శరవేగంగా విస్తరిస్తున్నది. అందులోనూ భారత్లో మరీ ఎక్కువ. 2025 నాటికి దేశంలో 66 కోట్ల మంది ఆన్లైన్ గేమ్స్ యూజర్లు ఉంటారని, రూ.29,000 కోట్ల మార్కెట్గా ఆ రంగం విస్తరిస్తుందని అంచనాలున్నాయి. లక్షలాది ఉద్యోగాలకు, ఎఫ్డీఐలకు ఈ రంగం నెలవు కానుంది. కానీ, స్పష్టమైన చట్టాలు లేకపోవటం వల్ల బ్లాక్ మార్కెటింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి సమస్యలు నెలకొన్నాయి.
వీటన్నింటికీ మించి దృష్టిపెట్టాల్సిన అంశం.. బాలలను, యువతను ఆన్లైన్ గేమ్స్ అనే వ్యసనం నుంచి తప్పించటం. కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులకు అలవాటుపడిన పిల్లలు, యువత అదే క్రమంలో ఆన్లైన్ గేమ్స్కు విపరీతంగా ఆకర్షితులై, గంటలకు గంట లు గడిపేస్తున్న పరిస్థితి ఉన్నది. ఏ వ్యసనమైనా వ్యక్తులకూ సమాజానికీ నష్టదాయకమే. అందులోనూ భవిష్యత్ భారతాన్ని నిర్మించాల్సిన యువత సెల్ఫోన్ తెరలకు అతుక్కుపోవటం ఎంతమాత్రం సహించాల్సిన విషయం కాదు. కేంద్రం ఈ సమస్యలను పరిష్కరించేలా ఆన్లైన్ గేమ్స్పై సమగ్రమైన నియంత్రణలు తీసుకురావాలి. పేకాట, బెట్టింగ్ వంటివాటిపై ఆంక్షలు విధించే అధికారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంది. కొత్త చట్టం పేరుతో రాష్ర్టాలకు ఉన్న ఇటువంటి హక్కులను హరించివేయకుండా కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలి. రాష్ర్టాలు, గేమింగ్ నిపుణులు, సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలతోపాటు తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకొని సమగ్ర చట్టాన్ని రూపొందించాలి.