బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్కు చెందిన ప్రఖ్యాత విద్యాసంస్థలు విశ్వభారతి, శాంతినికేతన్లకు హైదరాబాద్ రాజ్య పాలకుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1933లో రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిజాం ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కార్యదర్శి మెహ్దీ నవాజ్ జంగ్ (ఈయన పేరు మీదే నేటి మెహిదీపట్నం ఏర్పడింది) ఆహ్వానం మేరకు రవీంద్రనాథ్ ఠాగూర్ అదే ఏడాది హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ ఆర్థికమంత్రి అమీన్జంగ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ఠాగూర్ హాజరయ్యారు. ఆ విందుకు హైదరాబాద్ ప్రధానమంత్రి మహారాజా కిషన్ పెర్షాద్తోపాటు అనేకమంది నగర ప్రముఖులు వచ్చారు.
ఈ సందర్భంగా స్వయంగా కవి అయిన కిషన్ పెర్షాద్ ఒక కవితా పంక్తిని అప్పటికప్పుడు చదివి వినిపించారు. ‘మెహ్ఫిల్ మే హై ఆజ్ జమా దో సాహెబ్ ఎ రిష్, దోనో దిల్షాద్ ఔర్ దోనో దిల్రిష్’ (ఈ రోజు ఇక్కడికి ఇద్దరు పెద్ద గడ్డాల పెద్ద మనుషులు వచ్చి చేరారు. గాయపడిన హృదయాలు ఉన్నప్పటికీ సంతోషం నిండినవారు వారిద్దరూ..) అని చెప్పారు. అక్కడున్న వారిలో హైదరాబాద్ ప్రజాకవిగా పేరొందిన అమ్జద్ హైదరాబాదీ వెంటనే.. మరో పంక్తి కలిపి ఆ కవితను పూర్తి చేశారు. ‘ఇన్ దోనో కి ముఖ్తసర్ సె తారీఫ్ ఏ హై, దార్వీష్ పరస్త్ ఏక్, ఏక్ హై దార్వీష్ (వారిద్దరూ ఎవరంటే.. ఒకరు స్వయంగా ఆధ్యాత్మికవేత్త కాగా, మరొకరు ఆధ్యాత్మికవేత్తల భక్తుడు). ఈ సమావేశంలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు నవాబ్ బహదూర్ యార్ జంగ్ ఉర్దూలో ప్రసంగించారు. బహదూర్ యార్జంగ్కు గొప్ప వక్తగా అప్పటికే యావత్దేశంలో పేరుంది.
అతని ప్రసంగం వినకపోతే హైదరాబాద్ను చూసినట్టే కాదు అని ఠాగూర్కు సరోజినీదేవినాయుడు అప్పటికే చెప్పారు. జంగ్ ప్రసంగం విన్న ఠాగూర్ అతడిని మెచ్చుకుంటూ ‘కొంత కసరత్తు చేస్తే ఇంగ్లిష్తోపాటు ఏ భాషలోనైనా మీరు అద్భుతమైన వక్త కాగలరు’ అంటూ భుజం తట్టారు. (ఠాగూర్ మరణించిన తర్వాత ఆయనకు జంగ్ అర్పించిన నివాళిలో.. మహమ్మద్ ఇక్బాల్తో ఠాగూర్ను పోల్చారు. ఠాగూర్ వంటి నిజాయితీపరులైన దేశభక్తుల చేతుల్లో దేశ నాయకత్వం ఉంటే భారతదేశంలో మతపరమైన చీలికలే ఉండేవి కావన్నారు). హైదరాబాద్ పర్యటనలో ఠాగూర్.. బంజారాహిల్స్లోని ఒక భవనంలో బస చేశారు. బంజారాహిల్స్లో నాడున్న ప్రకృతి రమణీయతను చూసి పరవశించిపోయిన ఠాగూర్.. ‘కొహ్సర్’ (రాతి ప్రాంతం) పేరుతో ఒక కవిత రాశారు. బంజారాహిల్స్లో ఒక ఇల్లు కట్టుకోవాలని ఆయన భావించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు.