భూమ్మీద నూకలు చెల్లిపోయాయనేది పాత సామెత. ఇప్పుడు భూమికే నూకలు చెల్లిపోతున్నాయని ఆ సామెతను మార్చి చెప్పుకోవాలేమో! అనంత మహావిశ్వంలో భూమి ఓ గులకరాయి అంత కూడా ఉండదు. కానీ ఆ గులకరాయి మనకు తెలిసినంత వరకు మనిషితో పాటు, యావత్తు జీవరాశికి ఏకైక లోగిలి. వాతావరణ మార్పుల వల్ల ఆ చల్లని లోగిలి ఇప్పుడు నిప్పుల గుండంలా మారుతున్నది. చండచండం తీవ్రతీవ్రం అన్నట్టుగా భూతాపం పెరిగిపోతున్నది. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న మానవుల స్వయంకృతం ఇది. వినాశనం వైపు వేగంగా దూసుకువెళ్తున్న భూ తల్లిని కాపాడుకునేందుకు పెద్దగా సమయం లేదు. కచ్చితంగా చెప్పాలంటే 5 సంవత్సరాల 361 రోజులు. మొన్న జూలై 22 నాటికి న్యూయార్క్లోని వాతావరణ ‘గడియారం’ చూపిస్తున్న లెక్క ఇది. మనం ఏం చేసినా ఆ లోగానే. ఆ తర్వాత చేతులు కాలాయని పట్టుకునేందుకు ఆకులు కూడా మిగలవు. ఎందుకంటే గడియారం హెచ్చరిస్తున్న గడువు దాటితే భూతాపం పెరుగుదల 1.5 డిగ్రీలు మించుతుంది.
నిజానికి పారిశ్రామికయుగం ప్రారంభంతోనే భూతాపం పెరగడం మొదలైంది. ఇటీవలి సంవత్సరాల్లో దాని వేగం పెరిగి శ్రుతి మించుతున్నది. అటో ఇటో అనే దశకు చేరుకుంటున్నది. న్యూయార్క్లోని పర్యావరణ గడియారం హెచ్చరిస్తున్నది కత్తి అంచు మీద భూమి నిలబడే రోజు గురించే. ఆ రోజంటూ వస్తే ఇక వెనుదిరిగేందుకు ఏమీ ఉండదు. అదొక తిరుగులేని మార్పు. తిరిగిరాని పయనం. భూతాపం పెరుగుదల వల్ల తలెత్తిన మార్పుల గురించి తెలుసుకోవాలంటే పెద్దగా అన్వేషించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత జూలై నెల ఎండలు చూస్తే చాలు. జూలై 4న ప్రపంచ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనం తగా రికార్డు సగటు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ తరహా ప్రకృతి ఉత్పాతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇదేదో చెదురుమదురు వ్యవహారం అనుకోవడానికి వీల్లేదు. అతివృష్టి, అనావృష్టి మధ్య భూగోళం అటూ ఇటూ ఊగిసలాడుతున్నది. అటు ఎండలు మండిపోయి అడవులను దహిస్తున్నాయి. ఇటు కుంభవృష్టితో వరదలు ముంచెత్తుతున్నాయి. ధ్రువాల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మనం విధించుకున్న ఒకటిన్నర డిగ్రీల పరిమితి దాటితే అల్లకల్లోలమే అంటున్నారు.
భూతాపం మానవ కల్పితం అన్నది నిజమే. కానీ దాని దుష్ఫలితాలను అదుపు చేసే శక్తి మాత్రం మనిషికి లేదు. మొత్తంగా భూతాపాన్ని వెనుకకు తిప్పే అవకాశం లేనప్పటికీ రాబోయే ఉత్పాతాన్ని నివారించేందుకు మనం చేయగలిగింది చాలానే ఉంది. భూతాపం పెరిగి వాతావరణ మార్పులకు దారితీయడానికి కారణం శిలాజ ఇంధనమే. బొగ్గు, పెట్రోల్, గ్యాస్ ఏదైనా మండించినప్పుడు కర్బన ఉద్గారాలే వెలువడుతాయి. వీటి ఉపయోగాన్ని అదుపు చేస్తే సమస్య చాలావరకు అదుపులోకి వస్తుంది. జల, వాయు, సౌర ఇంధనాలవైపు ఎంత వేగంగా మళ్లితే మహా ప్రళయాన్ని అంతగా నివారించినవారమవుతాం.