‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ భారతీయుల ఆరోగ్య స్థితిగతులనే గాక, సామాజిక ఆలోచన ధోరణులను కూడా వెల్లడించే సాధనంగా మారుతున్నది. పెళ్లి, పిల్లలు, సంపాదన, లింగవివక్ష, పౌష్టికాహారం వంటి అంశాలపైనా ఈ సర్వే సాధికారికంగా వివరాలను వెల్లడిస్తున్నది. 140 కోట్ల మందితో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్.. జనాభా నియంత్రణ పరంగా మెరుగైన ఫలితాలను సాధించటం సర్వేలో వెల్లడైన సానుకూల అంశం. 2015-16లో జరిపిన ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు 2.2గా నమోదు కాగా, ఇప్పుడది 2.0కి తగ్గింది. 2.1ను జనాభా స్థిరీకరణకు సంకేతంగా భావిస్తారు. అంటే జనన, మరణాలు సమాన సంఖ్యలో నమోదయ్యే పరిస్థితి. ప్రస్తు తం ఈ లక్ష్యానికన్నా మిన్నగా దేశంలో జనాభా నియంత్రణ జరుగుతున్నదని వెల్లడైంది. సంతానోత్పత్తి రేటు తగ్గుదలను మతాలపరంగా గమనిస్తే ముస్లింలలో అత్యధికంగా (2.6 నుంచి 2.3కి) నమోదు కావటం విశేషం.
పుట్టిన నెల లోపు మరణించే శిశువుల సంఖ్య ప్రతీ వెయ్యి మంది లో 30 నుంచి 25కి తగ్గటం కూడా మంచి పరిణామమే. అయితే, పౌష్టికాహారం విషయంలో నేటికీ ఆందోళన కలిగించే పరిస్థితులే నెలకొని ఉన్నాయి. 6-23 నెలల వయసు పిల్లల్లో 89 శాతం మందికి సరైన ఆహారం లభించటం లేదని ఆరోగ్య సర్వే తెలిపింది. దేశ భవిష్యత్తుకు పట్టుకొమ్మలైన భావితరాలను సంరక్షించుకునే విషయంలో మనం వెనుకబడే ఉన్నామని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. బీజేపీ ఘనంగా చెప్పుకొనే ‘డబుల్ ఇంజిన్’తో నడుస్తున్న యూపీ, గుజరాత్ రాష్ర్టాలు ఈ అంశంలో అట్టడుగున ఉండటం ఆ పార్టీ నినాదంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నది.
జనాభాలో సగం ఉన్న మహిళల ఆరోగ్యం, వారి సామాజిక స్థాయి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి కీలక అంశాల్లో సర్వే వెల్లడించిన వివరాలు ఆందోళనకరంగా ఉన్నాయి. వివాహితల్లో కేవలం 32 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు, బయ టి పనులు చేస్తుండగా, వీరిలో 15 శాతం మంది ఎటువంటి వేతనం లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్నారు. మరో 14 శాతం మందికి తమకొచ్చే ఆదాయంపై అధికారమే లేదు. 44 శాతం మంది వివాహితలకు ఇంటినుంచి మార్కెట్కు వెళ్లటానికి కూడా ‘అనుమతి’ ఉండ టం లేదంటే.. దేశాభివృద్ధి గురించి చెప్పుకొనే మాటలను ఓసారి పునఃసమీక్ష చేసుకోవాలి. కుటుంబ నియంత్రణ అనేది మహిళలకు సంబంధించిన విషయమని భావించటం, గర్భనిరోధక సాధనాలను ఉపయోగించటం వల్ల స్త్రీలు అక్రమ సంబంధాలను పెట్టుకునే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడటం భారతీయ పురుషుల ఆలోచనల్లోని వెనుకబాటుతనాన్ని, పితృస్వామిక భావజాలాన్ని వెల్లడిస్తున్నాయి. ఆరోగ్యంపై, ఆలోచనలపై ఆర్థిక అంతరాలు కూడా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని సర్వే స్పష్టం చేసింది. ఆరోగ్య భారత్ను రూపొందించటానికి ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ను మేలుకొలుపుగా తీసుకొని కేంద్రం తగిన చర్యలు చేపట్టాలి.