తాజాగా ‘కుటుంబ వినియోగ వ్యయ సర్వే’ నివేదికను జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) విడుదల చేసింది. గృహ వినిమయ వ్యయం తీరుతెన్నుల్లోని మార్పులను ఈ నివేదిక వెల్లడిస్తుంది. పేదరికం హెచ్చుతగ్గులు, అసమానతల అంచనాలకు ఈ నివేదిక ఉపకరిస్తుంది. దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఓ అంచనాకు వచ్చేందుకు ఈ డాటా ఎంతో అవసరం. ప్రజల ఆర్థిక పరిస్థితిపై డాటా సేకరించి, నివేదికలు విడుదల చేయడం లేదని మోదీ సర్కారుపై మొదటి నుంచి విమర్శలున్నాయి. చివరిసారిగా 2011-12లో ఈ నివేదిక విడుదలైంది. 2017లో పూర్తిస్థాయి నివేదిక రూపొందించినప్పటికీ డాటాలో లోపాలున్నాయంటూ ఆ నివేదికను కేంద్రం విడుదల చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టిందనే ఆరోపణలున్నాయి. తాజాగా విడుదలైన సర్వే ఫలితాలతో డాటా లోటు తీరిపోయింది. పదకొండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్థూల అంచనాలు విడుదల కావడం విశేషం. అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండున్నర లక్షల పైచిలుకు కుటుంబాలతో ఈ సర్వే జరిగింది.
తాజా నివేదికలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2011-12 నుంచి 2022-23 మధ్యకాలంలో పట్టణ గృహ వినిమయ వ్యయం 33.5 శాతం, గ్రామీణ ప్రాంత గృహ వినిమయ వ్యయం 40-42 శాతం పెరిగింది. అయితే ఇందుకు వాస్తవ ఆదాయాల పెరుగుదల కన్నా ధరల పెరుగుదలే ప్రధాన కారణం. ఇక ఆదాయంలో ఇంటి ఖర్చుల శాతం స్వల్పంగా తగ్గిందని తాజా నివేదిక తెలిపింది. అంటే ఇతర అవసరాలకు ఖర్చు చేయడం పెరిగిందని దీనిద్వారా తెలుస్తున్నది. మరోవైపు ప్రభుత్వ సబ్సిడీలు కూడా పెరిగాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఉచిత/సబ్సిడీ ఆహారధాన్యాల పంపిణీపై ఆధారపడి ప్రజలు జీవిస్తుండటాన్ని కేంద్ర ప్రభుత్వాల వైఫల్యంగా స్పష్టం చేస్తోంది. ఈ నివేదిక ప్రకారం.. గుడ్లు, పాలు, చేపలు, మాంసం వంటి పోషకాహారాలతో పాటుగా ప్రాసెస్డ్ ఆహారం, శీతల పానీయాల వినియోగం పెరిగింది. ఇందులో మొదటిది ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ రెండోది జీవనశైలి ఆరోగ్య సమస్యల పెరుగుదలకు దారితీస్తుంది. సర్వే నివేదికలో ఆరోగ్య వ్యయం పెరుగుదల కూడా ఈ విషయాన్నే నిర్ధారిస్తున్నది. దీంతో పాటుగా విద్యా వ్యయం, గృహోపకరణాల కొనుగోలు, మరమ్మతుల ఖర్చులు పెరగడం గమనార్హం. మారుతున్న జీవనశైలికి ఇది నిదర్శనం.
2016లో పెద్దనోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు దరిమిలా దశాబ్ద కాలంలో గృహ వ్యయం రెండింతలకు పైగా పెరిగిపోయింది. 2017-18 నివేదికను విడుదల చేయనప్పటికీ బయటకు పొక్కిన సమాచారం ప్రకారం వినిమయం తగ్గిపోయినట్టు తెలుస్తున్నది. పూర్తిస్థాయి అంచనాల విడుదలతో పదకొండేండ్లలో చోటుచేసుకున్న పరిణామాల స్వరూప స్వభావాల అంచనాకు వీలు కలుగుతుంది. ద్రవ్య విధాన రూపకల్పనలో కీలకమైన వినిమయ ధరల సూచీ తయారీకి ఈ డాటా ఉపకరిస్తుంది. రాబోయే రోజుల్లో ఏర్పడే నూతన కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికకు సంబంధించిన విశ్లేషణ కృషిని మరింత ముందుకు తీసుకుపోయి, సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న జనగణనను చేపట్టేందుకు నడుం బిగించాలి. దేశ గణాంక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అది ఎంతైనా అవసరం.