గాజాలో ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా జరుపుతున్న నరమేధం గత ఆదివారానికి వందరోజులు పూర్తిచేసుకున్నది. మృతుల సంఖ్య 24 వేలు దాటడం, వారిలో అత్యధికులు అమాయక మహిళలు, చిన్నారులు కావడం నాగరిక ప్రపంచానికి సిగ్గుచేటు. 60 వేల పైచిలుకు మంది గాయపడ్డారు. వారిలోనూ నాలుగోవంతు మంది మహిళలు, చిన్నారులే. గాజా ఘర్షణలు మొదలైన తర్వాత వెయ్యిమందికి పైగా పిల్లలు ఒకటో రెండో శరీర భాగాలను కోల్పోయారు. వంద రోజుల్లో వంద మందికి పైగా, అంటే రోజుకు ఒకరు చొప్పున, మీడియా సిబ్బంది హతులయ్యారు. గాజాలోని మొత్తం 36 దవాఖానలు ధ్వంసమైతే అందులో పదిహేనింటిని, అదీ పాక్షికంగా మాత్రమే పని చేయించగలుగుతున్నారు. 22 లక్షల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పదింట తొమ్మిది మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులు నిరాహారంగా గడపాల్సి వస్తున్నది. మూడున్నర లక్షలకు పైగా నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఇదీ ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో నెలకొన్న ఘోర కలి.
ఇజ్రాయెల్పై గత అక్టోబర్ 7న హమాస్ క్షిపణిదాడులతో మొదలైన గాజా ఘర్షణ అమాయక పాలస్తీనియుల ఊచకోతకు దారితీసింది. అసహాయుల హాహాకారాలు మిన్నంటుతుంటే దేశదేశాల్లో ఈ యుద్ధం పట్ల వ్యతిరేకత ప్రజ్వరిల్లుతున్నది. అయినా ఇజ్రాయెల్ వైఖరిలో గానీ, ఆ దేశానికి అండదండగా నిలుస్తున్న అమెరికా తదితర పాశ్చాత్య దేశాల విధానాల్లో గానీ ఎలాంటి మార్పు వచ్చిన సూచనలు కనిపించడం లేదు. ‘సంపూర్ణ విజయం సాధించేంత వరకు, చివరిదాకా యుద్ధాన్ని కొనసాగిస్తాం’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించడం గమనార్హం. ఆ మాటలకు అర్థం ఏమిటో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. గాజాను మరుభూమిగా మార్చి, ఆపై అక్కడ తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో పరిపాలనా వ్యవస్థను ఏర్పాటుచేయడం ఇజ్రాయెల్ లక్ష్యం. ఈ సంగతి ఇజ్రాయెల్ రక్షణమంత్రి అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు.
గాజాలో శత్రు శేషం లేకుండా చేయాలనే ఇజ్రాయెల్ పట్టుదలకు సామాన్య పౌరులు బలి పశువులవుతున్నారు. ఈ యుద్ధం నెలలపాటు, ఏండ్ల పాటు కొనసాగే అవకాశం ఉన్నదని పరిశీలకులు అంటున్నారు. హమాస్ను అంతం చేసి, బందీలను విడిపించుకోవాలనే రెండు లక్ష్యాలతో ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. అయితే ఇవి అంత సులభంగా సాధ్యమయ్యేవి కావని పెదవి విరిచేవారి సంఖ్య ఇజ్రాయెల్లో అంతకంతకూ పెరుగుతున్నది. ఇజ్రాయెల్ భూ భాగంలోనూ పరిస్థితి ఏమంత ఆశావహంగా లేదు. టెల్ అవీవ్, జెరూసలేం తదితర నగరాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినప్పటికీ దుకాణాలు, హోటళ్లు మూసే ఉంటున్నాయి. రిజర్వ్ దళాలను సమీకరించే పని ముమ్మరంగా జరుగుతున్నది.
గాజా యుద్ధం చిటపటలు ప్రపంచయుద్ధంగా మారుతాయా అనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. లెబనాన్ స్థావరంగా పనిచేసే హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు జరుపుతున్నది. హెజ్బొల్లా మద్దతుదారులైన యెమెనీ హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు జరుపుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇటీవలే భారత్కు రసాయనాలతో వస్తున్న ఓడపై ఇలాంటి దాడి జరిగింది. దాంతో భారత్ తన నౌకాదళాన్ని ఆ ప్రాంతానికి పంపింది. మరోవైపు హౌతీల వేట పేరిట యెమెన్పై బ్రిటన్, అమెరికా దాడులు జరుపుతున్నాయి. హౌతీలకు, హెజ్బొల్లాకు ఇరాన్ మద్దతు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాజా ఘర్షణ చుట్టూ నెలకొన్న పరిస్థితి పేలడానికి సిద్ధంగా ఉన్న మందుగుండులా ఉంది.
ఏ చిన్న మిణుగురు వచ్చి పడ్డా ప్రమాదమే. ప్రస్తుత ప్రపంచం ఇలాంటి ఉత్పాతాలను తట్టుకోగలిగే స్థితిలో లేదు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రావణకాష్టంలా రగులుతూనే ఉన్నది. చైనా-తైవాన్ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. క్షిపణుల ప్రయోగాలతో ఉత్తర కొరియా అమెరికా మీదకు లంఘిస్తున్నది. ఈ ఏడాది ప్రపంచాన్ని పీడించే పది ముప్పుల్లో దేశాల మధ్య సాయుధ ఘర్షణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఇజ్రాయెల్పై నరమేధం ఆరోపణతో దక్షిణాఫ్రికా దావా వేయడం ఓ సాహస చర్యగా భావించవచ్చు. తమను ఎవరూ ఆపలేరన్న ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి ముకుతాడు వేసే ప్రయత్నాలు ఆలస్యంగానైనా ప్రారంభం కావడం శుభసూచకం. ప్రపంచం ముందు పరిష్కారానికి ఎదురుచూస్తున్న ఆకలి, అవిద్య అనారోగ్యం వంటి తక్షణ సమస్యలు చాలానే ఉన్నాయి. ప్రపంచానికిప్పుడు కావాల్సింది శాంతి, మరో మహాయుద్ధం కాదు.