మోదీ పాలనలో బడుగు వర్గాల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో, ప్రభుత్వం ఎంతగా సంపన్నులకు సంపదను కట్టబెడుతున్నదో తాజాగా ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనుసరిస్తున్న పేదల వ్యతిరేక విధానాల మూలంగా సంపన్నుల దగ్గరే సంపద పోగవుతున్నది. మరోవైపు పన్నుల భారాన్ని పేదలు మోయవలసి వస్తున్నది. మన దేశంలో నెలకొన్న ఆర్థిక అంతరాల గురించి ఆక్స్ఫామ్ విడుదల చేసిన నివేదిక ఈ కఠోర వాస్తవాలను కళ్ల ముందుంచింది. మోదీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలకు మరో నిదర్శనం- అదానీ ఆస్తుల పెరుగుదల. 2022లో అదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో రెండవ స్థానానికి చేరుకున్నారు. అతివేగంగా సంపద పెంచుకున్నవారిలో అగ్రస్థానంలో నిలిచారు. దీన్నిబట్టి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎవరి పక్షమో తెలిసిపోతున్నది.
ఆక్స్ఫామ్ నివేదిక దేశ వాస్తవ దృశ్యాన్ని బయటపెట్టింది. దేశ జనాభా 140 కోట్లు. దీంట్లో ఐదు శాతం అంటే, ఏడు కోట్ల మంది దగ్గరే మొత్తం దేశ సంపదలో 60 శాతం పోగుబడి ఉన్నది. జనాభాలో 50 శాతం అంటే, 70 కోట్ల మంది వద్ద మూడు శాతం సంపదే ఉన్నది. కానీ కేంద్రప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీలో 64 శాతాన్ని ఈ 50 శాతం నిరుపేద భారతమే చెల్లిస్తుండగా, అపర కుబేరులైన తొలి పది శాతం నుంచి మూడంటే మూడు శాతమే వసూలవుతున్నది. సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా పన్నుల భారాన్ని పేదలు మోస్తుంటే, ఆకాశ హర్మ్యాల్లో సంపన్నులు విహరిస్తున్నారన్న సత్యాన్ని ఆక్స్ఫామ్ నివేదిక తెలియజెప్పింది. ఈ అంతరాలు ఆర్థికానికే పరిమితమైనవి కావని, గ్రామీణ-పట్టణ, స్త్రీ-పురుష, కుల సామాజిక అంతరాలూ వీటితో ముడివడి ఉన్నాయని వెల్లడించింది.
ప్రపంచీకరణ తర్వాత సంక్షేమ రంగానికి ప్రాధాన్యం తగ్గించడం, సంపన్న వర్గాలకు సౌకర్యాలు పెంచడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల మనవంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మధ్యతరగతికి కొత్త అవకాశాలు అందివచ్చినప్పటికీ సంప్రదాయ వృత్తులు, అసంఘటితరంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా సంపద కేంద్రీకరణ గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో జరిగి ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక మోదీ హయాంలో ఈ ధోరణి ఇంకా ప్రబలింది. కంపెనీలపై విధించే కార్పొరేట్ ట్యాక్స్ను కేంద్రప్రభుత్వం 30 నుంచి 22 శాతానికి తగ్గించింది. కానీ నిరుపేదలకు కొంతైనా భరోసా కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను గణనీయంగా తగ్గించి వేసింది. అనేక నిబంధనలు పెడుతూ, ఆ పథకాన్నే నిర్వీర్యపరుస్తున్నది. అంతరాలు పెరిగిపోతే వ్యవస్థ అంతానికే అవి దారితీస్తాయన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. ఆక్స్ఫామ్ నివేదికను వట్టి గణాంకాలతో కూడిన నివేదికలా కాకుండా, నిద్రాణ స్థితిని వదిలించే హెచ్చరికలా తీసుకోవాలి. సంపన్నులపై పన్నులు వేయటమే అంతరాల తగ్గింపునకు మార్గమన్న ఆ నివేదిక హితవును పాటించాలి.