ప్రపంచ జన సంఖ్య 800 కోట్లకు చేరుకోవడంతో జనాభా నియంత్రణపై చర్చ సాగుతున్నది. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందల కోట్లకు చేరుకున్నది. ఈ చివరి వంద కోట్లలో భారతీయుల సంఖ్యే ఎక్కువ. అయినా మన దేశానికి ఇదొక ఆందోళన పడవలసిన అంశం కాదనే అభిప్రాయం ఉన్నది. స్త్రీ సగటు సంతానం 2.1గా ఉంటే మరణాలకు అనుగుణంగా జననాలు భర్తీ అవుతాయి. మన దేశం ఈ సంతానోత్పత్తి రేటును 2.2 నుంచి 2 స్థాయికి చేరుకొని జనాభాలో స్థిరత్వాన్ని సాధించిందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాలలో యువజనం కన్నా వృద్ధుల సంఖ్య ఎక్కువ కావడంతో జనాభా తగ్గుదల సమస్యగా మారింది. కొన్ని దేశాలు అధిక సంతానానికి ప్రోత్సాహకాలు ఇవ్వవలసి వస్తున్నది. అయినా ఈ దేశాలు జనాభా కొరతను వర్ధమాన దేశాల నుంచి వలసల ద్వారా తీర్చుకోక తప్పదు. దీనిని బట్టి వర్ధమాన దేశాల నిపుణుల వలస ఇక ముందు కూడాసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ వలసలు ఆయా దేశాలలో సామాజిక ఉద్రిక్తతలకు కూడా దారి తీయవచ్చు.
జనాభా ఇదేవిధంగా పెరుగుతూ పోతే 2080 నాటికి 1,040 కోట్లకు చేరుకుంటుందని అంచనా. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రకృతి సంపద వృద్ధి చెందదు. అందువల్ల ఈ జనాభా అవసరాలను తీర్చడమెలా అనే వాదన కూడా ఉన్నది. ఆహారం, నివాసం వంటి కనీస అవసరాలను తీర్చాల్సి ఉంటుం ది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలపై భారంగా మారుతుందనేది కొందరి వాదన. కానీ జనాభా సంఖ్య ఎప్పుడూ సమస్య కాదని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ పేర్కొనడం గమనార్హం. చెట్టుకు కాయలు బరువా అన్నట్టు – జీవుల అవసరాలకు అవసరమైన ప్రకృతి సంపద భూగోళంపై ఉన్నది. గాంధీజీ అన్నట్టు ప్రకృతి మానవుల కనీస అవసరాలు తీర్చగలదు, కానీ విలాసాలను తీర్చలేదు.
అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో వనరుల వినియోగం ఎక్కువగా ఉన్నది. వర్ధమాన దేశాలలోనూ వనరుల వినియోగం ఎక్కువైంది. దీనివల్ల ప్రకృతిని కొల్లగొట్టడం సాగుతున్నది. అభివృద్ధి పేర పర్యావరణానికి హాని కలిగించడం వల్ల భూగోళంపై ఉష్ణోగ్రతలు పెరగడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలను హితబోధగా తీసుకొని కార్యాచరణ చేపట్టాలి. ఈ భూమి మీద జీవించే హక్కు మనకు ఎంత ఉందో సకల జీవరాశులకు అంతే ఉందన్న సత్యాన్ని ఎరుకపర్చుకోవాలి. సంపద కేంద్రీకరణ వల్ల పేదల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రపంచ దేశాలు ఆర్థిక విధానాలను మార్చుకోవడమే దీనికి పరిష్కారం. వసుధైక కుటుంబంలా మానవాళి జీవించగలిగితే జనాభా బలమే అవుతుందిగానీ బలహీనత కాబోదు.