‘వైద్య విద్యార్థులతో రాష్ర్టానికి ఆరోగ్య కవచం నిర్మించుకుంటున్నాం’ అని ఎనిమిది కొత్త వైద్య కళాశాలల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఆయన దార్శనికతను వెల్లడిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా కరోనా ఏ విధంగా యావత్ ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించిందో చూశాం. ఆ సమయంలో శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు, వైద్యులు ముక్తకంఠంతో చెప్పిన మాట.. ‘ఇలాంటి ఆరోగ్య విపత్తులు మానవ సమాజానికి తొలిసారీ కాదు.. ఆఖరూ కాదు. వాటిని ఎదుర్కొనేలా ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠపరుచుకోవటమే మన వద్ద ఉన్న ప్రత్యామ్నాయం. ఆ విధంగానే నష్టాల్ని వీలైనంత తగ్గించుకోగలుగుతాం’. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగానే తెలంగాణను బలోపేతం చేస్తున్నారు. దాంట్లో భాగమే ఏకకాలంలో ఎనిమిది మెడికల్ కాలేజీల ప్రారంభం.
ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాలనలో మూడంటే మూడు మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఏర్పాటయ్యాయి. అంటే, 20 ఏండ్లకు ఒకటి చొప్పున. ఇదీ నాడున్న పరిస్థితి. ఈ కారణంగానే వైద్యవిద్య అత్యంత ఖరీదైనదిగా మారిపోయింది. అంతేకాదు, సరైన సంఖ్యలో వైద్యులు లేక ఆరోగ్యరంగం కునారిల్లిపోయింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఒక్కో రంగాన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న కేసీఆర్ వైద్య ఆరోగ్య రంగానికి కూడా అత్యంత ప్రాధాన్యమిచ్చారు. రాజధాని హైదరాబాద్లో నలువైపులా నాలుగు టిమ్స్ ఏర్పాటు నుంచి గ్రామస్థాయిలో బస్తీ దవాఖానల వరకూ అంచెలంచెలుగా ప్రభుత్వ వైద్యసేవలను గతంలో ఎవరూ ఊహించని స్థాయిలో మెరుగుపరచారు. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చటానికి సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కూడా ఒకటి. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలు ఎంత సుదూర భవిష్యత్తును చూస్తాయో, ఆయన ఆచరణ ఎంత వేగంగా ఉంటుందో మరోసారి అందరికీ తెలిసి వచ్చింది.
తాజాగా ప్రారంభమైన వాటితో కలిపి మొత్తం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఎనిమిదేండ్ల స్వల్ప వ్యవధిలో ఏర్పాటయ్యాయి. వీటివల్ల రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,790కి పెరిగింది. 2014లో వీటి సంఖ్య 850. అంటే, మూడు రెట్లకు మించి పెరిగాయి. ప్రస్తుతం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 33 కాలేజీల ఏర్పాటు దిశగా తెలంగాణ దూసుకుపోతున్నది. మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్రం పూర్తి వివక్ష చూపుతున్నా కూడా తెలంగాణ సొంతంగా సాధించిన అభివృద్ధి ఇది. ఈ కళాశాలల నుంచి ఏటా వేలాది మంది వైద్యులు సమాజంలో అడుగు పెడుతుంటే ఆరోగ్య సేవలు భారీగా మెరుగుపడతాయి. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మన రక్షణ కవచాన్ని మనమే నిర్మించుకుంటున్నాం.