తెలంగాణ ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తూ, హైదరాబాద్లో సెప్టెంబర్ 17వ తేదీన బీజేపీ ప్రదర్శించిన నాటకం అభాసు పాలయింది. తెలంగాణలో అడ్డావేయాలని పగటి కలలు కంటున్న బీజేపీ హఠాత్తుగా పూనకం వచ్చినట్లుగా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించింది. హైదరాబాద్ చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని బీజేపీ విమోచన దినోత్సవమంటూ ఊరేగడమే పెద్ద వింత. అందులోనూ మత రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించిన సర్దార్ పటేల్ వంటి మహనీయుడిని నెత్తిన పెట్టుకొని తమ నాయకుడైనట్టు ఊరేగడం మరో వింత. సర్దార్ పటేల్ను గుజరాతీగా చూపడమైనా, మత ముద్రవేయడమైనా రెండూ ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేవే. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఏ స్థాయికైనా దిగజారుతుందనడానికి సెప్టెంబర్ 17 నాటక ప్రదర్శనే ఉదాహరణ.
బీజేపీ-జనసంఘ్ పూర్వీకులైన రాజకీయ, హిందుత్వ వాదులకు దేశ సమైక్యత గురించి, స్వాతంత్య్రం గురించి మాట్లాడే అర్హతే లేదు. వీరు రాచరికాలను పచ్చిగా సమర్థిస్తూ, సంస్థానాధీశులకు మద్దతు ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనకపోవడమే కాకుండా, ఏకంగా ముస్లింలీగ్తో పొత్తు పెట్టుకొని స్వాతంత్య్ర ఉద్యమాన్ని నీరు గార్చాలని చూసిన ఘనత వీరిది. దేశ స్వాతంత్య్రం అంటే పట్టని, గిట్టని వారి వారసులు నేడు హైదరాబాద్ విమోచన అంటూ ఇల్లెక్కి అరవడం ఆశ్చర్యకరం. స్వాతంత్య్రం వచ్చినంక ఐదు దశాబ్దాల పాటు, అంటే 2002 వరకు నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయనే లేదు. గతంలో ఇక్కడ పతాకావిష్కరణకు ప్రయత్నించిన వారిని చొరబాటుదారులంటూ పోలీసులకు పట్టిచ్చిన చరిత్ర వీరిది. దేశ స్వాతంత్య్రాన్ని గుర్తించడానికి నిరాకరించే వారికి తెలంగాణ సమైక్యత దినోత్సవ పిలుపులోని అంతరార్థం ఎలా అర్థమవుతుంది!
ప్రజాస్వామ్యం, లౌకికత్వం, బహుళత్వాన్ని గౌరవించే భారతదేశంలో భా గం కావాలని తెలంగాణ సమాజం నిర్ణయించుకుంది. ఇప్పటికీ స్వాతంత్య్రోద్యమ విలువలకు కట్టుబడి ఉన్నది. బహుళ జాతుల, భాషాసంస్కృతుల భారతదేశంలో భాగమైన సందర్భాన్ని, ఆ విలువలను ఆకాశానికి ఎత్తుతూ తెలంగాణ సమాజం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకొన్నది.
దేశాన్ని విద్వేషాలతో నింపే ప్రయత్నం సాగుతున్న తరుణంలో సమైక్యతా విలువలను చాటడం తమ కర్తవ్యమని సీఎం కేసీఆర్ భావించారు. దేశంలోని అతి పెద్ద సంస్థానం భారతదేశంలోని వివిధ జాతులతో చేయి కలిపిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన పిలుపు దేశమంతా వినిపించింది. విద్వేష, విభజన రాజకీయాలను తిప్పికొట్టడం ఖాయమని ఈ సమైక్యతా దినోత్సవం చాటి చెప్పింది.