కర్ణాటకలో సాగుతున్న మత రాజకీయాల పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా చేసిన విమర్శ తేలికగా కొట్టిపారేయదగినది కాదు. కర్ణాటకలో మత విభేదాలను నిలువరించాలని, ఐటీ రంగానికి ఈ విద్వేషాలు పాకితే అంతర్జాతీయంగా నాయకత్వ స్థానంలో ఉన్న భారత్ తన హోదాను కోల్పోతుందని ఆమె హెచ్చరించారు. ఈ వ్యాఖ్య రాజకీయపరమైనది కాదు. ఒక పారిశ్రామిక దిగ్గజం తన అభిప్రాయాన్ని వెల్లడించడంగానే భావించాలి. బీజేపీ నాయకులు కూడా ఈ విమర్శను ప్రజాస్వామిక స్ఫూర్తితో స్వీకరించాల్సింది. కానీ వారు ఆమె వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని అంటగట్టారు. తన వ్యాఖ్య రాజకీయమయం అవుతుందని కావచ్చు, లేదా బీజేపీతో వివాదం ముదరడం ఇష్టం లేకకావచ్చు- కిరణ్ మజుందార్ షా వాదోపవాదాలకు దిగకుండా వెనుకకు తగ్గారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనా సరళిపై గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయ డం గమనార్హం. ప్రభుత్వ తీరు తెన్నులను విమర్శించడానికి జంకే పరిస్థితి ఉన్నదని ఆయన బీజేపీ పెద్దల ముందే నిర్మొహమాటంగా తప్పుబట్టారు. ఇప్పుడు కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యల నేపథ్యంలో ఒక కర్ణాటక విషయమే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ పాలనా తీరు తెన్నులపై చర్చించుకోవలసిన సందర్భం ఏర్పడింది. మోదీ విధానాల మూలంగా పారిశ్రామికరంగం కునారిల్లిపోతున్నది. దీనికితోడు మోదీ ప్రభుత్వ హఠాత్ నిర్ణయాల వల్ల పారిశ్రామిక రంగంలో అనిశ్చితి నెలకొంటున్నది. వ్యాపారులు ప్రభుత్వ విధానాలలో స్థిరత్వాన్ని కోరుకుంటారనేది తెలిసిందే. మోదీ ప్రభు త్వం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్నదనేది మరో పెద్ద విమర్శ. మొత్తం పారిశ్రామికాభివృద్ధికి పాటుపడే బదులు, తమకు దగ్గరైన కొందరు పారిశ్రామికుల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నదనే అభిప్రాయం కలుగుతున్నది.
పారిశ్రామికవేత్తలు మొదటగా కోరుకునేది వ్యాపారం సజావు గా సాగించగలిగే శాంతియుత పరిస్థితులు ఉండాలనేది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సామాజిక విద్వేషాలు, అశాంతి నెలకొనడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించడం సహజం. దక్షిణాదిలోనే రాజకీయంగా, శాంతిభద్రతల పరంగా పెద్దగా అలజడి లేని ప్రశాంతమైన రాష్ట్రంగా కర్ణాటకకు గతంలో పేరుండేది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ఆ రాష్ట్రంలో సామాజిక విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయనేది ఆందోళనకు కారణమవుతున్నది. కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యలను కూడా ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. సామాజిక శాంతి నెలకొని ఉం టేనే పారిశ్రామిక వృద్ధి సాధ్యమవుతుందని, యువతకు ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెప్పడానికి కారణం ఇదే. అందుకే తెలంగాణ సమాజం విద్వేష రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.