కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్కు రాసిన లేఖను న్యాయవ్యవస్థపై కేంద్రం ప్రత్యక్ష దాడిగా పరిగణించాలి. ఇంతవరకూ సదస్సుల్లో, మీడియా సమావేశాల్లో సుప్రీంకోర్టుపై, కొలీజియంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన మంత్రి.. అధికారికంగా లేఖ రాయటం ఇదే తొలిసారి. మన దేశంలో న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య కొంత దూరం అన్నది తొలి నుంచీ ఉన్నదే. దేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక రకంగా మంచిది కూడా. ఏనాడూ ఏ న్యాయశాఖ మంత్రి సీజేఐపై, న్యాయవ్యవస్థపై అగౌరవనీయమైన వ్యాఖ్యలు చేయగా మన దేశం చూడలేదు. కానీ, తనను మించిన ప్రధానమంత్రి భారతదేశంలో ఇప్పటివరకూ పుట్టలేదనే భ్రమలో ఉన్న నరేంద్ర మోదీ హయాంలోనే కనీవినీ ఎరుగని ఈ దుస్సంప్రదాయం మొదలైంది.
మీడియాను, దర్యాప్తు సంస్థలను, గవర్నర్ వ్యవస్థను, చివరికి ఎన్నికల సంఘాన్ని కూడా మోదీ సర్కార్ ఏ విధంగా ప్రభావితం చేస్తూ, దుర్వినియోగం చేస్తున్నదో దేశమే కాదు, యావత్ ప్రపంచం గమనిస్తున్నది. తన నుంచి ఎవరుగానీ, ఏ వ్యవస్థగానీ ఎటువంటి జవాబుదారీతనాన్ని ఆశించవద్దని, ప్రశ్నించవద్దని ఈ ప్రభుత్వ వైఖరిగా ఉన్నది. తాను ఏం చేస్తే అదే గొప్ప అనే వందిమాగదులు మాత్రమే ఉండాలని భావిస్తున్నది. ఇటువంటి సర్కార్కు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉం డటం ఎంతమాత్రమూ నచ్చకపోవటంలో ఆశ్చర్యం లేదు. అందువల్లే న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో చొరబడాలని మోదీ అధికారంలోకి రాగానే ప్రయత్నాలు మొదలయ్యాయి. కొలీజియం స్థానంలో ‘న్యాయమూర్తుల నియామకాల కమిషన్’ను ఏర్పాటుచేస్తూ చట్టాన్ని కూడా చేసింది. పెను ప్రమాదాన్ని పసిగట్టిన సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకం అంటూ కొట్టివేసింది.
కొంతకాలంపాటు సహనంతో ఉన్న కేంద్రం.. ఇటీవల, ముఖ్యంగా జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ దాడిని ముమ్మరం చేసింది. మంత్రి రిజిజు వ్యాఖ్యలు, బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు మమతతో నిత్యం కయ్యాలు పెట్టుకొని తద్వారా ఉప రాష్ట్రపతి పదోన్నతిగా పొందిన జగ్దీప్ ధన్కర్ మాటలు దీన్ని నిరూపిస్తున్నాయి. భిన్నాభిప్రాయాలకు పెద్దపీట వేసే ఉదారవాద న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ చంద్రచూడ్ వచ్చే లోక్సభ ఎన్నికలు ముగిసేవరకూ పదవిలో ఉంటారు. బహుశా ఈ కారణం వల్లనే, మోదీ సర్కార్ సుప్రీంకోర్టు ప్రతిష్ఠను ప్రజల్లో పలుచన చేసే ప్రయత్నాలకు తెరలేపి ఉండవచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎన్నికల లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఏ స్థాయికైనా బరితెగిస్తుందనటానికి ఈ ఎనిమిదేండ్లలో అనేక ఉదాహరణలున్నాయి. ఈ బుల్డోజర్ రాజకీయాలకు పాతర వేయకపోతే దేశ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉండని రోజొస్తుంది. కేంద్రం దాడిని సుప్రీంకోర్టు తిప్పికొట్టాలి. ప్రజలందరూ కేంద్రం వైఖరిని ఖండించాలి. న్యాయ నియామకాల్లో సంస్కరణలు, పారదర్శకత అవసరమేగానీ, అవి న్యాయవ్యవస్థ స్వతంత్రతను హరించేవిధంగా ఉండరాదు. ఆ మార్పులు తెచ్చే యోగ్యత, నైతికత మోదీ సర్కార్కు ఉన్నాయా?