కరెంటు రాకడ, ప్రాణం పోకడ అని సామెతను చెప్పుకొన్న రోజులు తెలంగాణకు తెలుసు. ఇప్పుడా సామెతను మన రాష్ట్రం మరిచిపోయి చాన్నాళ్లయింది. కరెంటు లేక పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించేవారు. బోరు బావులకు కరెంటు లేక ఎవుసం మూలకు వడేది. ఇదే కదా ఒకప్పుడు మన గోస. ఇక ఇండ్లల్లో కోతలతో ఉస్సూరనడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితి నుంచి కోతలంటే తెలియని దశకు చేరుకోవడం చిన్న విషయం కాదు. ఇప్పుడు వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇండ్లకు 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా అవుతున్నది. ఫలితంగా ఉత్పత్తి, సంపద పెరిగి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తున్నది. స్వరాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత సాధించిన అద్భుత విజయమిది. మనకు కరెంటు కష్టాలు గతచరిత్ర అయ్యాయి కానీ, దేశంలో పరిస్థితి మాత్రం పెనం మీంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది.
76 ఏండ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ దీనికి ఏం సమాధానం చెప్తాయి. దేశంలో కరెంటు చీకట్లు తాండవిస్తున్నాయి. అత్యధిక రాష్ర్టాలు ఇప్పుడు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నాయి. సమస్యను పరిష్కరించలేక అక్కడి ప్రభుత్వాలు దిక్కులు చూస్తున్నాయి. అందుకు భిన్నంగా తెలంగాణ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా దూసుకుపోతున్నది. వినియోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగానూ రికార్డు సృష్టించింది. దేశ సగటు వినియోగం 1,255 యూనిట్లు కాగా, తెలంగాణలో 2,166 యూనిట్లుగా ఉండటం గర్వకారణం. గ్రిడ్ ఇండియా తాజా నివేదిక ఈ సంగతి వెల్లడించింది. బీజేపీ అధికారంలో ఉన్న యూపీ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, అసోం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, జనతా కూటమి అధికారంలో ఉన్న బీహార్ రాష్ర్టాలు ఎడాపెడా కోతలు విధిస్తున్నాయి. యూపీలో అయితే 74 శాతం ప్రాంతాల్లో కోతలు అమలవుతున్నాయి. చిన్న పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటిస్తున్నారు. మన పక్కన ఏపీలోనూ ఇదే పరిస్థితి.
ఉత్పత్తి ఆగడంపై పారిశ్రామికులు, ఉపాధి లేకపోవడంపై కార్మికులు ఆందోళన బాట పట్టడం దేశవ్యాప్తంగా కనిపిస్తున్నది. తెలంగాణ ఈ తరహా గడ్డు పరిస్థితి నుంచి బైటపడిన వైనం గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. సీఎం కేసీఆర్ స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అమలుచేశారు. ఉత్పత్తిని, పంపిణీని చక్కదిద్ది, ముందుగా బయటనుంచి కొనుగోలు చేసి, తర్వాత సొంత ఉత్పత్తిని మెరుగుపర్చుకొని రాష్ట్రంలో కరెంటు వెలుగులు నింపారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల కాలంలో 24 గంటల విద్యుత్తు సరఫరాకు భరోసా కల్పించారు. తర్వాత సాగుకు ఉచిత కరెంటుతో మరో ముందంజ సాధించారు. ఆగస్టులో వర్షాలు ముఖం చాటేసిన పరిస్థితుల్లోనూ సరఫరాకు లోటు రాకుండా చూసుకున్న రాష్ట్రం మనది. గుజరాత్ మాడల్ గురించి ఊదరగొట్టి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం కరెంటుకు కటకట పడుతుండటం గురించి మాట్లాడరు. కరెంటు ఉత్పత్తి, సరఫరాను కార్పొరేట్లకు కట్టబెట్టి చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు ఉపశమనం కలిగించడం గురించి ఆయన ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.