బాలానగర్, మే 27 : సైబర్నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టించి… ఓ మహిళను నట్టేట ముంచారు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం…బాలానగర్ రాజుకాలనీకి చెందిన సౌభాగ్యలక్ష్మి బ్యుటీషియన్. గత నెల 28న గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లైటెనింగ్ పవర్ బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని.. పెట్టుబడి పెడితే స్వల్ప వ్యవధిలో రెట్టింపు లాభాలు వస్తాయని అగంతకులు నమ్మబలికారు. దీంతో సౌభాగ్యలక్ష్మి తొలుత రూ 6,900లు పెట్టుబడి పెట్టగా, అదనంగా రూ.3వేలు కలిపి రూ.9,900 రావడంతో ఆ యాప్పై ఆమెకు నమ్మకం కుదిరింది. బంధువులు, మిత్రులతో రూ.12లక్షల 91వేల వరకు పెట్టుబడులు పెట్టించింది. ఈ క్రమంలో వారు మరో నంబర్ ఇచ్చి..నగదును ఫోన్ పే చేయాలని సూచించారు. చెప్పినట్లుగానే పేమెంట్ చేస్తూ వస్తున్నది. ఆ తర్వాత సదరు వ్యక్తుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన సౌభాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉన్నది.