ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 23 పోలింగ్ కేంద్రాలు, 15,921 మంది ఓటర్లు
ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో 7 పోలింగ్ బూత్లు
షాద్నగర్ నియోజకవర్గంలో 14 పోలింగ్ కేంద్రాలు
ఓటు వేయనున్న 9,473 పట్టభద్రులు
ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
ఇబ్రహీంపట్నం, మార్చి 13 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో 15,921 మంది ఓటర్లున్నారు. ఇందులో 10,201మంది పురుషులు, 5,717 మంది స్త్రీ ఓటర్లున్నారు. నియోజకవర్గంలో 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం జడ్పీ బాలుర పాఠశాలలో ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఓటర్ల కోసం 6 పోలింగ్ కేంద్రాలు, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఓటర్ల కోసం అబ్దుల్లాపూర్మెట్ జడ్పీ పాఠశాలలో 9 పోలింగ్ కేంద్రాలు, యాచారం మండలంలోని ఓటర్ల కోసం ఉన్నత పాఠశాలలో 4, మంచాల మండలంలో ఉన్నత పాఠశాలలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మంచాల, మార్చి 13 : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలను శనివారం రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో మహేశ్బాబు పరిశీలించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న 2,360 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు మంచాల జడ్పీ పాఠశాలలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభమై సాయంత్ర 4గంటల లోపు క్యూలో ఉన్న వారు ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామగ్రిని రిటర్నింగ్ అధికారి దేవోజా అధ్వర్యంలో పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా మంచాల సీఐ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆమనగల్లులో..
ఆమనగల్లు, మార్చి 13 : పట్టభద్రుల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మండల కేంద్రాలతో పాటు, పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రకారం పట్టభద్రులకు ఓటర్ స్లిప్లను పంపిణీ చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా, వెబ్ కెమెరాల పర్యవేక్షణలో ఓటింగ్ ప్రక్రియ కొనసా గనునట్లు తహసీల్దార్ చందర్రావు తెలిపారు.
షాద్నగర్
నియోజకవర్గంలో..
షాద్నగర్, మార్చి 13 : షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. షాద్నగర్ మున్సిపాలిటీ, ఫరూఖ్నగర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 8 పోలింగ్ కేంద్రాలు, కేశంపేట మండల కేంద్రంలో 2 పోలింగ్ కేంద్రాలు, కొందుర్గు, చౌదరిగూడెం, కొత్తూరు, నందిగామ మండల కేంద్రాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రా న్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 9,473 పట్టభద్రులున్నారు. అత్యధికంగా ఫరూఖ్నగర్ మండలంలో ఉన్నారు. కొత్తూరు మండలంలో 811, నందిగామ మండలంలో 817, కొందుర్గు మండలంలో 876, చౌదరిగూడ మండలంలో 720, కేశంపేట మండలంలో 1,474 పట్టభద్రుల ఓటు ఉండగా షాద్నగర్ మున్సిపాలిటీ, ఫరూఖ్నగర్ మండలంలో 4,775 ఓట్లు ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ముగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు మౌలిక వసతులను కల్పించారు. పోలింగ్ కేంద్రంలో మంచినీటి సౌకర్యం, వైద్య సదుపాయం, వీల్చైర్ వసతులను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఎన్నికల ప్రచారం, సమావేశాలు నిర్వహించరాదని, చట్టవిరుద్ధంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల నిర్వాహణ అధికారులు హెచ్చరించారు. ఓటు వేసే క్రమంలో ఎలాంటి సందేహాలు తలెత్తినా ఎన్నికల నిర్వహణ అధికారులను సంప్రదించాలని సూచించారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
నియోజకవర్గంలోని పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పా ట్లు పూర్తిచేశాం. నియోజకవర్గంలో మొత్తం 15,924 మంది ఓటర్లకుగానూ 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పట్టభద్రులకు అవసరమైన పెన్నులు, ఇతరత్రా పరికరాలను అందుబాటులో ఉంచాం. ఓటర్ల కోసం తాగునీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం. పోలింగ్ నిర్వాహణ కోసం సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
-ఆర్డీవో వెంకటాచారి, ఇబ్రహీంపట్నం