‘కరోనా’తో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంతోపాటు శుభ్రతపైనా శ్రద్ధ పెరుగుతున్నది. ఇంట్లోంచి వైరస్, బ్యాక్టీరియాలనూ తరిమేయాలనే స్పృహ అధికం అవుతున్నది. అయితే, ఇంట్లోకి ఎప్పుడు? ఎలా? ప్రవేశిస్తుందో తెలియని బ్యాక్టీరియాను నిర్మూలించడం కష్టమే. దీనికి పరిష్కారంగా కొన్ని సంస్థలు బ్యాక్టీరియాను తరిమేసే ఎల్యీడీ బల్బులను తయారుచేశాయి. ‘యాంటీ బ్యాక్టీరియల్ ఎల్యీడీ’ పేరుతో అవి ఇప్పటికే మార్కెట్లలోకి విడుదలయ్యాయి. ఈ బల్బులనుంచి విడుదలయ్యే శక్తివంతమైన కిరణాలతో ఇంట్లోని బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ కిరణాలు మనుషులకు ఎలాంటి హానీ చేయవని వారు హామీ ఇస్తున్నారు. ప్రమాదకర బ్యాక్టీరియాను ఎదుర్కోవడంతోపాటు ఇంట్లో మరింతగా విస్తరించకుండా నిరోధించడానికి ఈ ‘యాంటీ బ్యాక్టీరియల్’ బల్బులు సాయపడుతాయని అంటున్నారు.