ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిశాయి. శనివారం ప్రగతి పత్రాలు అందజేశారు. దాంతో పాఠశాలలు, వసతి గృహాల నుంచి విద్యార్థులు ఇంటిబాట పట్టారు. పుస్తకాలు, బ్యాగులు పట్టుకొని వెళ్లగా బస్టాండ్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. జూన్ 11న పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా మళ్లీ కలుద్దామంటూ విద్యార్థులు వీడ్కోలు చెప్పుకొన్నారు.
కరోనా కారణంగా సెప్టెంబర్ 2021న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కేసులు పెరుగడంతో జనవరి 2022లో నెలరోజులపాటు సెలవులు ప్రకటించారు. తిరిగి ఫిబ్రవరిలో పునఃప్రారంభించారు. అప్పటి నుంచి తరగతులు నిర్విరామంగా కొనసాగాయి. ఈ నెల 16 నుంచి 22 వరకు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరిగాయి. శనివారం విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందచేశారు.
ఆదివారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. పదో తరగతి విద్యార్థులకు మే 23 నుంచి వార్షిక పరీక్షలు జరుగనున్నందున అప్పటి వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సెలవుల ప్రకటనతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. విద్యార్థులతో బస్టాండ్లల్లో సందడి కనిపించింది. పాఠశాలలు జూన్ 11న పునఃప్రారంభం కానున్నాయి.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి జిల్లా