బన్సీలాల్పేట్ : 17వ శతాబ్దంలో నిర్మించిన పురాతన నాగన్నకుంట మెట్లబావికి పూర్వ వైభవం తీసుకువస్తామని, నగరానికి ఉన్న ఘనమైన చరిత్ర భావితరాలకు తెలిసేలా ముఖ్యమైన కట్టడాలను అభివృద్ది చేస్తామని రాష్ట్ర సినిమాటో గ్రఫి, మత్స, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, సికింద్రాబాద్ తాసీల్దార్ బాలశంకర్, ఇతర అధికారులతో కలిసి గురువారం బన్సీలాల్పేట్లోని నల్లపోచమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న చారిత్రాత్మక నాగన్నకుంట మెట్ల బావి పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు.
హుస్సేన్సాగర్ సమీపంలో భూగర్భ జలాలను వృద్ది చేస్తూ, నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు తాగునీరు అందించిన నాగన్నకుంట బావి ఎంతో చరిత్ర గలిగిందని అన్నారు. గత ఏడాది ఆగస్టు 15న ఈ బావి పునరుద్దరణ పనులు ప్రారంభించామని, 2022 ఆగస్టు 15వ తేదిన ఈ మెట్లబావిని ప్రారంభించి, ప్రజలకు అంకితమిస్తామని ఆయన తెలిపారు. దానిని ఒక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించిన రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ప్రతినిథి కల్పనా రమేశ్, ఐఎస్ఎస్ అర్వింద్ కుమార్, నార్త్ జోన్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వారి సిబ్బందిని అభినందిస్తున్నానని అన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక, వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో ఎక్కడెక్కడ చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు.
యునెస్కో గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా మోజంజాహి మార్కెట్ను అభివృద్ధి చేశామన్నారు. మీరాలం మండి, సర్దార్ మహల్, మోండా మార్కెట్ లాంటి వాటిపై దృష్టి సారించామని తెలిపారు.
చెత్తా చెదారంతో నిండిన బన్సీలాల్పేట్లోని మెట్లబావి పునరుద్ధరణ కోసం జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో 800 వందల లారీలలో రెండున్నర టన్నుల వ్యర్థాలను తరలించామని, ఇప్పటికే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, మరో కోటి రూపాయలు వ్యయం కానున్నదని అన్నారు. ఇప్పటి వరకు 44 బావులను గుర్తించామని, బాపూఘాట్, గచ్చీబౌళి, సీతారామ్బాగ్, శివబాగ్ ప్రాంతాలలో నాలుగు బావులను పునరుద్దరించామని తెలిపారు.
నగరంలో మొత్తం వందకుపైగా పురాతన బావులు ఉన్నాయని ఆంచనా, ప్రజలు కూడా తమ ప్రాంతంలో ఇలాంటి బావులు ఉంటే జీహెచ్ఎంసీకి తెలపాలని కోరారు. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు కల్పనా రమేశ్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ బన్సీలాల్పేట్ మెట్లబావి ఆరోజుల్లో ఎంతోమందికి తాగునీటిని అందించిందని అన్నారు.
మెట్ల బావి పునరుద్దరణ అనంతరం ఈ ప్రాంతం అతిపెద్ద పర్యాటక ప్రదేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదికారులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.