కొవిడ్ వ్యాక్సినేషన్లో భద్రాద్రి జిల్లా రికార్డు సృష్టించింది.. మొదటి డోసు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈనెల ఆదివారంతో వందశాతం లక్ష్యాన్ని చేరుకున్నది. వైద్యసిబ్బంది జిల్లావాసులకే కాక మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఆధార్ వివరాలు తీసుకుని ఇతర ప్రాంత వాసులకూ టీకాలు వేశారు. కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక చొరవ, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది నిబద్ధతతోనే ఈ విజయం సాధ్యమైంది.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లా కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 19కి వందశాతం పూర్తయింది. జిల్లాలో 7,94,206 మందికి టీకాలు వేయాల్సి ఉండగా 7,96,689 మందికి టీకాలు వేసి రికార్డు సృష్టించారు. జిల్లావాసులకే కాక మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఆధార్ వివరాలు తీసుకుని ఇతర ప్రాంతవాసులకూ టీకాలు వేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను మించి వైద్యసిబ్బంది పనిచేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.
నాడు చిమ్నాతండా.. నేడు జిల్లా మొత్తం..
జిల్లాలో మారుమూల గ్రామాల్లో చిమ్నాతండా ఒకటి. కొవిడ్ మొదటి డోస్ వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తి చేసిన గ్రామంగా తండా పేర్గాంచింది. ఇదే స్ఫూర్తితో వైద్యసిబ్బంది జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. టీకాపై అపోహలు ఉన్నవారికి అవగాహన కల్పించడం, పని ప్రదేశాలకు వెళ్లి టీకాలు వేయడం, 20 మొబైల్ వాహనాల ద్వారా గ్రామాలకు చేరుకోవడంతో లక్ష్య సాధన సులభమైంది. వైద్యసిబ్బంది టీకాలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ఎంతో సహకరించారని వైద్యాధికారులు వెల్లడించారు.
కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ..
వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని అధిగమించేందుకు కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రత్యేక వాహనాలను కేటాయించి ఏజెన్సీ గ్రామాలకు టీకాలు పంపించారు. క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. వైద్యసిబ్బందికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలిచ్చారు.
వైద్యసిబ్బంది కృషితోనే..
కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు వైద్యులు, వైద్యసిబ్బంది కృషితో జిల్లాలో వందశాతం మొదటి డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ను పూర్తి చేశాం. అందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు. రెండో డోస్నూ ఇదే స్ఫూర్తితో వందశాతం సాధిస్తాం.