మియాపూర్, డిసెంబరు 4 : ఒమిక్రాన్ వైరస్ పొంచి ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి వ్యాక్సినేషన్తో రక్షణ పొందవచ్చని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అల ప్రియాంక అన్నారు. ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్ను విస్తృతంగా చేపడుతున్నందున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జోన్ వ్యాప్తంగా ఈ నెల 20 వరకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను జడ్సీ ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో కరోనా టీకా ప్రక్రియ, పురోగతి, ఇంటింటికీ సర్వేలపై డీసీలు, సర్కిళ్ల వైద్యాధికారులతో జడ్సీ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 20 వ తేదీ వరకు జోన్ వ్యాప్తంగా సెకెండ్ డోస్ వ్యాక్సినేషన్ను చేపట్టాలన్నారు. తద్వారా వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఒమిక్రాన్ వైరస్ ప్రబలే అవకాశం ఉందన్న ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలందరికీ టీకాను పూర్తి స్థాయిలో అందించాలన్నారు. జోన్ వ్యాప్తంగా మొత్తం 537 కాలనీలో 3,48,685 నివాసాలున్నాయని, ఇప్పటికే 80 శాతానికి పైగా కాలనీల్లో టీకా పంపిణీ లక్ష్యాన్ని చేరుకున్నట్లు జడ్సీ ప్రియాంక పేర్కొన్నారు. డ్రైవ్తో పాటు చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా ఇంకా రెండో డోస్ టీకా తీసుకోవాల్సిన వారితో పాటు అసలు టీకా తీసుకోని వారి వివరాలు రిజిస్టర్లో నమోదై ఉన్నందున ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి టీకాలను అందించాలన్నారు. సర్కిల్కు 10 ప్రత్యేక మొబైల్ బృందాలు టీకాలను అందించనున్నందున సర్కిళ్ల వైద్యాధికారులు వాటిని ఎప్పటికపుడూ పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొనేలా చర్యలు తీసుకోవాలని జడ్సీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీలు రమేశ్, బాలయ్య, వైద్యాధికారులు రవి, కార్తీక్, రంజిత్, బిందు, అదనపు కమిషనర్ మల్లారెడ్డి ఏఎంసీ సుధీర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లకు చెందిన ఇంటింటి సర్వే రిజిస్టర్లను జడ్సీ పరిశీలించారు.